Monday 28 December 2015

వీక్షణం సాహితీ గవాక్షం-34 (June,14-2015)


వీక్షణం
సాహితీ గవాక్షం-34
- ‘విద్వాన్’ విజయాచార్య.
ఈ నెల 6-14-15 ఆదివారం వీక్షణం సాహితీ సమావేశం ప్రముఖ “కౌముది” పత్రిక సంపాదకులు, కవి, రచయిత, విమర్శకులు శ్రీ కిరణ్ ప్రభ గారి యింట్లో సకల జన మనో రంజకంగా, సహృదయ హృదయాహ్లాదజనకంగా జరిగింది. కిరణ్ ప్రభగారు తమ ఆహ్వానంతో సభని ప్రారంభించారు. నేటి సమావేశానికి ’విద్వాన్’ శ్రీ తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు గారు అధ్యక్షులుగా సమయానుకూల సమన్వయంతో, సందర్భోచితవ్యాఖ్యలతో సభని చక్కగా నిర్వహించారు. ఈనాటి సమావేశంలో ప్రముఖ రచయిత్రి, కేంద్రసాహిత్యఅకాడమీపురస్కార గ్రహీత శీమతి కాత్యాయని విద్మహే గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధాన ప్రసంగం చేసారు. వారు పరిశోధన చేసిన బుచ్చిబాబు “చివరకుమిగిలేది” నవలపై సమగ్రంగా, సోదాహరణ పూర్వకంగా ఉపన్యసించారు.


“అస్తిత్త్వ చైతన్య” రీతిలో సాగిన చివరకు మిగిలేది నవలలో ‘దయానిధి’ పాత్రలోని హేతుబద్ధత, వ్యక్తిగత విముక్తిని వివరిస్తూ,ఆ నవలలో ‘ ఫ్రాయిడ్’ తెల్పిన ‘ఈడిపశ్ కాంప్లెక్స్,’ సిద్ధాంతాన్ని వివరించి, ఆరాట పోరాటాలని, నైతికవిలువల్ని, ప్రజా స్వామిక భావాలని, ప్రపంచీకరణవిధానాన్ని శ్రోతల కనుల ముందు ఆవిష్కరించారు.
తదుపరి శ్రీ వేమూరిగారు, కొంతమంది శ్రోతలు అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలను యిచ్చి ప్రసంగాన్ని ముగించారు.కె.గీత “చైతన్య స్రవంతి” శైలినిగూర్చి ప్రశ్నించగా. కాత్యాయని విద్మహే గారు సోదాహరణంగా వివరించారు. శ్రీ కిరణ్ ప్రభ గారు బుచ్చి బాబు గారి సతీమణి శ్రీమతి సుబ్బలక్ష్మిగారి గొప్పతనాన్ని సభకి వివరించారు.
తరువాత శ్రీ క్రాంతి శ్రీనివాసరావుగారి ‘6th ఎలిమెంట్' కవితా సంపుటిని, ఆ కవితలపై డా|| ఆవంత్స సోమసుందర్ గారు వ్రాసిన ‘క్రాంతి గీతాలు’ అనే రెండు గ్రంథాలని ముఖ్య అతిథి ఆవిష్కరించి, వివరించారు. పిదప శ్రీ క్రాంతిశ్రీనివాస్ గారు గ్రంథ రచనా నేపధ్యాన్ని సభకి వివరించారు.
విరామంలో కిరణ్ ప్రభగారి సతీమణి శ్రీమతి కాంతి గారు తయారు చేసిన పసందైనవిందు అందరూ ఆనందంగా ఆరగించేరు. తదుపరి కవితాగానం. ముందుగా శ్రీ వేణు ఆసూరి గారు "త్రిగుణం" అనే కవితను చదివి అందరిని అలరించేరు. పిదప కె.గీతగారు "ఆకాశం – పర్వతం, అతడు-నేను" అనేకవితలో ధీరగంభీరముద్ర, కంటి చివరిభాష్పం, దూది కంబళి వంటి పదాలను గుప్పించి శ్రోతల ప్రశంసలనందుకొన్నారు. క్రాంతి శ్రీనివాసు గారు-“ఆమెకథ” అనే కవితను చదివి సభాసదుల మన్ననలు పొందేరు.

తదుపరి కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమం ఎప్పటి వలే సభాసదులను ఉత్సాహపరచింది. ఇక్బాల్ గారి,అరబిక్ వ్యాకరణ బోధన, అధ్యక్షుల వారి మలిపలుకులు, గీతగారి వందన సమర్పణతో కార్యక్రమం విజయ వంతంగా ముగిసింది.

ఈ నాటి సభలో ప్రముఖ కథా రచయిత్రి కె.వరలక్ష్మి గారు, శ్రీమతి టి.పి.విజయలక్ష్మి గారు, శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీ సుబ్బారావు, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి కె.శారద, శ్రీ శివచరణ్, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీ సుభాష్, శ్రీ పిల్లలమర్రి కృష్ణ కుమార్ మొదలగు ప్రముఖులు పాల్గొని, సభకి నిండుదనాన్ని కలిగించేరు. స్వస్తి.
----------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july2015/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/july/july_2015_vyAsakoumudi_vikshanam.pdf


No comments:

Post a Comment