Thursday 18 October 2012

వీక్షణం తొలి సాహితీ సమావేశం (Sep9, 2012)



వీక్షణం తొలి సాహితీ సమావేశం

శాన్ ఫ్రాన్సిస్కో  bay ఏరియా లో ప్లెసంటన్   లోని శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు గారింట్లో వీక్షణం తొలి సాహితీ సమావేశం ఆదివారం   సెప్టెంబర్ 9   జరిగింది.
డా|| కె. గీత



ఆహూతులకు డా|| కె. గీత స్వాగతం చెప్పి, వీక్షణం సాహితీ గవాక్షాలను తెరిచారు. సభకు రఘు మల్లాది అధ్యక్షత వహించారు.  
శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు

వంగూరి ఫౌండేషన్ వారిచే  $116/- బహుమతి పొందిన వేమూరి వెంకటేశ్వరరావు గారి "మరో లోకం" సైన్స్ ఫిక్షన్ స్వీయకథా పఠనంతో కార్యక్రమం మొదలయ్యింది.  మిడతంభొట్లు అనే శాస్త్రజ్ఞుడి వద్దకు ఒక గ్రహాంతరజీవి వచ్చి మరో 200 ఏళ్ళలో భూలోకానికి ఉపద్రవం రాబోతున్నదని, ఈ భూమి పై ఉన్న జీవరాశులను  కాపాడటానికి తాము పథక రచన చేసామని, ఇక్కడి ప్రాణులన్నింటినీ తమ గ్రహానికి తరలిస్తామని అందులకు శాస్త్రజ్ఞుడైన మిడతంభొట్లు తమకు సహకరించాలని కోరుతాడు. ఈ ప్రతిపాదనకు మిడతంభొట్లు ఎలా స్పందించాడన్నదే ఈ కథలోని ఆయువుపట్టు.ఈ కథను వేమూరివారు చక్కగా చదివి రక్తి
కట్టించారు. "మరో లోకం" కథను ఇక్కడ చదవవొచ్చును.

 

శ్రీమతి తమిరిశ జానకి

రోజు వీక్షణం కు వచ్చిన అతిధులలో ఒకరు తమిరిశ జానకి. వీరు పెక్కు కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు వ్రాశారు. నాలుగు కథా సంపుటాలు వెలువడ్డాయి. మొట్టమొదటి నవల ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రికలో "విశాలి" పేరుతో సీరియల్ గా వచ్చింది.  ఈ సీరియల్ అదే పేరుతో  1973 లో ఎ. సంజీవి దర్శకత్వంలో, కృష్ణంరాజు, శారద నాయక, నాయిక పాత్రలలో సినిమాగాను, పుస్తకంగాను వచ్చింది.   
వేమూరి గారి స్వీయ కథాపఠనం తరువాత రచయిత్రి తమిరిశ జానకి గారు  కథారచనకు తమను ప్రేరేపించిన అంశాల గురించి మాట్లాడారు.  నిత్యం వచ్చే బిచ్చగాడు కొన్నిరోజులుగా  రాకపోతే ఏ కారణం వలన అతను రావటం  లేదో అని ఆలోచిస్తూ, 1964 లో తమ తొలి కథ "వాడుకైనవాడు" అనే కథ రాసామన్నారు.  రచయిత తన చుట్టూ  ఉన్న సామాజిక రుగ్మతల  వల్ల ప్రభావితుడై ఒక కథ వ్రాస్తూ ఇది ఒకరినైనా మారిస్తే బాగుండును అని తలుస్తాడు. పాత రోజుల్లో తన కథ చదివి పత్రికా కార్యాలయానికి, తనకూ పాఠకులు ఉత్తరాలు వ్రాసేవారు. ఇప్పుడంతా స్పీడ్ యుగం అయిందని, కథ చదువుతూనే పాఠకులు ఫోన్ ద్వారా లేక e-mail ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని తమ సంతోషం తెలియచేశారు.  హైదరాబాదులో జరిగే సాహిత్య సభలు, చాలా పత్రికలు తనను కొత్త రచనలు చేసేలా ఉత్తేజ పరుస్తాయని తెలిపారు. తాను నిరంతర పాఠకురాలనని కొత్త పుస్తకాలు, పత్రికలు చదువుతుంటానని చెప్పారు. కొద్ది పత్రికలు మినహాయించి   చాలా పత్రికలలో తన రచన అచ్చయిందన్న విషయం తన పాఠకుల ద్వారానే తనకు సమాచారమందుతుందని తెలిపారు. రచయితలకు తమ రచన అచ్చైన పత్రికలు Complimentary copies పంపిస్తే బాగుంటుందని అభిప్రాయం వెలిబుచ్చారు. కథారచన గురించి సభికుల పలు ప్రశ్నలకు బదులిచ్చారు.
    

   
చిత్రం లో ఎడమ నుంచి కుడి వైపు -శ్రీమతి తమిరిశ జానకి, శ్రీ సి.బి.రావు, శ్రీ మల్లాది రఘు    


రోజు వీక్షణం కు వచ్చిన మరొక అతిధి సి.బి.రావు గారు.  దీప్తిధార, పారదర్శి బ్లాగుల ద్వారా వీరు పరిచితులు. వీరు ఎంచుకున్న అంశం కథా ప్రయోజనం. "రచయితలు వ్రాస్తారు. ఈ రచనల ప్రయోజనమేమిటి? ఏ ఉద్దేశంతో, ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ కథలు వ్రాస్తున్నారో ఆ ప్రయోజనం నెరవేరుతుందా? రచయిత  ఎవరికోసం వ్రాస్తున్నాడో వారికి  తన రచనలు అందుతున్నాయా?  ఉద్దేశించిన పాఠకులు తన రచనలు చదువుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు రచయితలను వేధిస్తాయి.  పై ప్రశ్నలు వేసుకునుంటే కార్ల్ మార్క్స్, ప్రపంచ గతిని మార్చిన  దాస్ కాపిటల్ అనే ఉద్గ్రంధం వ్రాసిఉండెడివాడు కాదేమో!   రచయిత ప్రధమ కర్తవ్యం  తను చెప్పవలసిన విషయాలు పాఠకులకు అర్ధమయ్యేలా , ఆసక్తికరంగా రచనలు చెయ్యటమే.  రచయితలు కొందరు కేవలం వినోదాత్మక కథలు వ్రాస్తే, మరికొందరు ప్రయోజనాత్మక కథలు వ్రాస్తారు. ఇంకొందరు తమ కథలలో మంచి  కథాశిల్పం రావాలని ఆశిస్తారు. ప్రయోజనాత్మక కథలవలన ఏ కొందరైనా మారుతారని, సమాజం లో మార్పు వస్తుందని  రచయిత చిన్న ఆశతో తన రచన చేస్తాడు. " అంటూ తమ దృష్టిలో ప్రయోజనాత్మక   కథలేవిటో వివరిస్తూ  ఉదాహరణగా 1) శ్రీ వేమూరి వెంకటేశ్వరరావు -"అభయారణ్యంలో ఏంబర్"  2) వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో ఉండే రచయిత్రి శ్రీమతి సామాన్య -"కల్పన" 3) శ్రీ జె.యు.బి.వి.ప్రసాద్ ల "అంజనం"  కథలను విశ్లేషించారు. "ఏ ప్రయోజనం ఆశించి రచన చేస్తాడో, ఆ ఉద్దేశ్యం  నెరవేరితే రచయిత ఎంతో సంతృప్తుడవుతాడు. రెట్టించిన ఉత్సాహంతో సమాజహితం కోసం మరిన్ని రచనలు చేస్తాడు." అని చెప్తూ తమ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం సభికుల ప్రశ్నలకు బదులిచ్చారు.
 

శ్రీ కిరణ్ ప్రభ



ఇప్పటిదాకా గంభీరమైన ఉపన్యాసాలతో వేడెక్కిన సభ కౌముది మాసపత్రిక సంపాదకుడు కిరణ్‌ప్రభగారి Quiz కార్యక్రమంతో తొలకరి జల్లు కురిసినట్లై చల్లబడింది. ప్రశ్నలన్నీ తెలుగు సాహిత్యానికి సంబంధించినవే. ఉదాహరణకు కిరణ్‌ప్రభగారు సంధించిన కొన్ని ప్రశ్నలిస్తున్నాను పాఠకుల సమాచారనిమిత్తం. 1) రేడియో ప్రయోక్త ఉషశ్రీ గారి అసలు పేరు? 2) విశ్వనాధ సత్యనారాయణ గారి మొదటి నవల ఏది? 3) తాపీ ధర్మా రావు గారి స్వీయచరిత్ర పేరేమిటి?  4) "అనుభవాలూ జ్ఞాపకాలు " వ్రాసిన రచయిత ఎవరు?  ఇలాంటి ప్రశ్నలెన్నో!   సరైన సమాధానం చెప్పినవారికి చక్కటి పుస్తకాలు బహూకరించారు.

శ్రీ మధు ప్రఖ్య


తరువాత స్థానిక కవుల కవితాగానం జరిగింది.
 
 
శ్రీయుతులు మధు ప్రఖ్య, రావు తల్లా ప్రగడ, వరకూరు ప్రసాద్, డా|| కె. గీత  ప్రభృతులు తమ స్వీయ కవితాగానం చేసి శ్రోతలను అలరించారు. ఈ కవితా గాన సౌరభాన్ని మాటలలో వర్ణింప తరమా! పాఠకులు ఈ కవితలు ఇక్కడ విని ఆనందించకోరుతాను. చక్కటి కవితలున్నవిందులో


 
శ్రీరావు తల్లాప్రగడ   


రఘు మల్లాది గారి సమయపాలనతో సభ  సజావుగా జరిగింది. వీక్షణం తరఫున గీత గారి వందన సమర్పణతో సభ ముగిసింది.



కుడి నుండి ఎడమ కు ముందు వరుసలో  కూర్చున్నవారు మృత్యుంజయుడు తాటిపామల, కృష్ణకుమార్ పిల్లలమర్రి, ప్రసాద్ వరకూరు,
కుర్చీలలో ఎడమ నుంచి కుడికి సి.బి. రావు, తమిరిశ జానకి, రమణ, కె.గీత, శారద,
వెనక నిలబడ్డవారు ఎడమ నుంచి కుడికి కిరణ్, దర్శన, శ్రీమతి కృష్ణకుమార్, బులుసు నారాయణ, చిమటా శ్రీనివాస్, రావు తల్లాప్రగడ, వేంకటేశర్రావు రావు వేమూరి, రఘు మల్లాది, గిరిధర్ రావు, శివచరణ్ గుండా, కిరణ్ ప్రభ, శ్యాం పుల్లెల, శ్రీనివాస్ చుక్కా, కిరణ్ వాకా



స్థానిక రచయితలు, కవులు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేశారు. 
-సి.బి.రావు
…........................
కౌముది, అక్టోబరు 2012 ప్రచురణ
http://www.koumudi.net/Monthly/2012/october/index.html 

సుజన రంజని, అక్టోబరు 2012 ప్రచురణ
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct12/veekshanam.html