Tuesday 9 April 2024

వీక్షణం-139 వ సాహితీ సమావేశం

 వీక్షణం-139 వ సాహితీ సమావేశం

-- పిళ్ళా వెంకట రమణమూర్తి --
vikshanam-139

వీక్షణం సాహితీ గవాక్షం 139వ అంతర్జాల సమావేశం తేదీ మార్చి14న ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో వీక్షణం వ్యవస్థాపకులు డా.గీతామాధవి గారు స్వాగత వచనాలు పలికి, ఈనాటి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య సి.హెచ్. సుశీలమ్మ గారిని పరిచయం చేసారు. వీరు 'నెచ్చెలి' మాస పత్రిక లో, ఆ'పాత'మధురాలు అనే శీర్షికను నిర్వహిస్తున్నారని, ఇవేళ 'అలనాటి రచయిత్రుల అభ్యుదయ భావాల కథలు' అనే అంశమ్మీద ప్రసంగించబోతున్నారని తెలియజేసారు. ఈ సమావేశానికి నిర్వహణ బాధ్యత వహించిన శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారు ఆత్మీయ వచనాలు పలికి, ముఖ్య వక్తను ప్రసంగం చేయమని ఆహ్వానించారు.

ప్రొ. సి.హెచ్. సుశీలమ్మ గారు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు. విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య” (శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు. అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష (పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు 'ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు. స్తీవాదం – పురుష రచయితలు, కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర, విమర్శనాలోకనం (విమర్శ వ్యాసాలు), విమర్శ వీక్షణం (విమర్శ వ్యాసాలు) మొ.న రచనలు చేసారు.

ఆచార్య సుశీలమ్మ గారు ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమర ఉద్యమాల సందర్భంగా పురుషులు కారాగారాలకు వెళ్తే, స్త్రీలు నిస్పృహ చెందకుండా కథల ద్వారా సాటి స్త్రీలకు చైతన్యం కలిగించే ప్రయత్నం చేసారని, స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు కౌటుంబిక వ్యవస్థలో స్త్రీ పాటించవలసిన ప్రముఖ పాత్రను కూడా తెలిపారని చెబుతూ, ఈ సందర్భంగా స్త్రీ రచయిత్రుల కథా కధనాలు ప్రస్తావిస్తూ, 1874 లో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించిన 'బండారు అచ్చమాంబ గారు' 1901 వ సంవత్సరంలో ప్రథమ అభ్యుదయ భావాల కథల సృష్టి కర్తగా గుర్తింపు పొందారని, వారి 'ధనత్రయోదశి' తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి కథగా గుర్తింపు పొందిందని ఉటంకిస్తూ, అలనాటి కథ అంటే 1901 నుంచి కథారచయితలు బందరులో మహిళా సమాజ స్థాపన చేసి స్త్రీ విద్య ఆవశ్యకత గురించి కృషి చేసారని, భారతదేశానికి స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, కుటుంబంలో స్త్రీ స్వాతంత్ర్యం అంత అవసరం అని తెలిపారు. ఈ సందర్భంగా 1902లో అచ్చమాంబ గారి రచనయైన 'దంపతుల కలహం' అనే కథను సోదాహరణంగా వివరించారు. తరువాత 1892లో నెల్లూరు జిల్లాలో జన్మించిన 'పునకా కనకమ్మ గారు'  జాతి వివక్షత లేని బాలికా పాఠశాలను కస్తూర్బాయి పేరిట స్థాపించిన అభ్యుదయ భావాలు గల రచయిత్రుల కోవకు చెందుతారని, వీరు 'జమీన్ రైతు' అనే దినపత్రిక స్థాపించారని, అంతే కాకుండా 'నేను అభాగ్యుడిని', మరియు 'ఉరి' అనే శీర్షికతో రెండు కథలు వ్రాసారని తెలిపారు.

1931లో స్త్రీ హితైషిణీ మండలి స్థాపించిన కనపత్రి లక్ష్మి గారు కుటీర లక్ష్మి (రామలక్ష్మి) అనే స్త్రీ అభ్యుదయ భావాలను వ్యక్తం చేసే కథను సోదాహరణంగా వివరించారు. దుర్గా బాయ్ దేశ్ ముఖ్ గా ప్రసిద్ధి చెందిన గుమ్మిడిదల దుర్గాబాయ్ 1929లో (బాల వితంతు శారదాంబ ఆత్మ కథ) ను 'నేను ధన్యనైతిని' అనే శీర్షికతో కథను వివరించారు.

ప్రథమ దళిత వాద కథా రచయిత్రిగా గుర్తింపు పొందిన పులవర్తి కమలావతి గారి రచన 'మాదిగ' (1931 జూన్ మాసంలో వాసవి అనే పత్రికలో) ప్రచురితమై ఆనాటి కాలంలో దురాచారంగా ఉన్న అంటరానితనం కు బాసటగా నిలిచిన కథగా అభివర్ణించారు. అలాగే సి. హెచ్. రమణమ్మ గారు వర్గపోరాటం అనే అంశంపై వ్రాసిన 'ఆదర్శ ప్రాయురాలు- కమల'  పురుషాహంకారులకు కనువిప్పు కలిగేలా చేసిందని తెలిపారు.ఎల్లాప్రగడ సీతాకుమారి 'కులమా - ప్రేమా' అనే కథను, ఆచంట శారదాదేవి గారి *ఈ ఒక్కరోజు* అనే కథను, కూడా ప్రస్తావించారు. చివరగా గుడిపాటి వెంకటాచలం గారి తమ్ముని భార్య అయిన కొమ్మూరి పద్మావతి గారి 'శోభ' అనే కథను వివరించి తన పరిశోధనలో ఇప్పటికే 14 మంది అలనాటి అభ్యుదయ రచయిత్రులు వారు వ్రాసిన కథలు సేకరించి నెచ్చెలి మాస పత్రిక ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ముగించారు.

అనంతరం వీరి ఉపన్యాసం పై డా.గీతామాధవి గారు, డా నీహారిణి గారు, వసుధారాణి గారు, గాడేపల్లి మల్లికార్జునుడు గారు, అవధానం అమృతవల్లి గారు తమ స్పందనను తెలిపారు. తదుపరి డా.మామిళ్ళ లోకనాధం గారి అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. మొదటగా డా గీతా మాధవి గారు లోకనాధం గారిని సభకు పరిచయం చేసారు.

ఈ కవి సమ్మేళనంలో వసుధారాణిగారు రెండు లఘు కవితలు చదువగా, డా. నీహారిణీ గారి కాలబింబం అనే కవిత, డా.కె.గీతామాధవి గారి కుట్ర అనే కవిత,గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారి నవశకం పిలుస్తోంది అనే కవిత, వసీరా గారి ప్రేమ సాగరసంగీతం కవిత, మేడిశెట్టియోగేశ్వరరావు గారి నీడలు మొలిచేచోట కవిత, సాధనాల వెంకట స్వామి నాయుడు గారి గాలిలో దీపం కవిత, ఉప్పలపాటి వెంకట రత్నం గారి తలవంచుకునే అనే కవిత, సూరి రాధిక గారి అసూర్య పశ్యను అనే కవిత, రామాయణం ప్రసాదరావు గారి మహా కవయిత్రి అనే కవిత సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కవి సమ్మేళనంలో డా. నీహారిణి కొండపల్లి, కందుకూరి శ్రీరాములు, వసీరా, డాక్టర్ కె.గీతామాధవి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, రామాయణం ప్రసాదరావు, రాము లగిశెట్టి, శ్యామరాధిక, పద్మశ్రీ చెన్నోజ్వల, డాక్టర్ దేవులపల్లి పద్మజ, మోటూరి నారాయణ రావు, అవధానం అమృతవల్లి, డాక్టర్ చీదెళ్ళ సీతాలక్ష్మి, పిళ్ళా వెంకట రమణమూర్తి, మేడిశెట్టి యోగేశ్వరరావు, గౌరీపతి శాస్త్రి కె. వి. ఎస్, లింగుట్ల వెంకటేశ్వర్లు, ఉప్పలపాటి వెంకటరత్నం, డాక్టర్ కోదాటి అరుణ, వీరరాఘవులు చిట్టాబత్తిన, దేవి గాయత్రి, బొమ్మిరెడ్డి వినోదరెడ్డి, డాక్టర్ వేము వందనం, బొమ్మిరెడ్డి వినోద్ రెడ్డి, నాగేంద్రమ్మ పరుచూరి, నాళం నరసమ్మ, మాసుంబి, సిరివరపు అన్నపూర్ణ, గాడేపల్లి మల్లికార్జునుడు, గంగారపు గోవిందరావు, మల్లాప్రగడ రామకృష్ణ, పానుగంటి శ్రీనివాస్ రెడ్డి మొ.న వారు సుమారు 32మంది కవిశ్రేష్ఠులు పాల్గొని కవి సమ్మేళనాన్ని సుసంపన్నం చేసారు. ఈ సందర్భంగా గత ఫిబ్రవరి 2024 వీక్షణం కవితా పురస్కార గ్రహీతగా డా.మామిళ్ళ లోకనాధం గారి పద్య శీర్షిక 'తెలుగు భాష-వెలుగు దివ్య తేజ' కి లభించింది అని తెలిపి, అనంతరం ముఖ్యవక్తగా విచ్చేసిన ఆచార్య సుశీలమ్మ గారికి, కవి సమ్మేళనం లో పాల్గొన్న కవిమిత్రులకు కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో చేసిన వందన సమర్పణానంతరం సభ ముగిసింది. ఈ సమావేశంలో అమెరికాతో బాటూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు.

ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-139/

https://www.koumudi.net/Monthly/2024/april/april_2024_vyAsakoumudi_vikshanam.pdf

Saturday 9 March 2024

వీక్షణం-138 వ సాహితీ సమావేశం

 వీక్షణం-138 వ సాహితీ సమావేశం

-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-138

వీక్షణం సాహితీ గవాక్షం 138 వ ఆన్లైన్ సమావేశం డా. గీతామాధవి గారి సారధ్యంలో ఫిబ్రవరి17న ఆద్యంతం ఆసక్తిదాయకంగా, రసవత్తరంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులు శ్రీ దాసరి అమరేంద్ర గారినీ,  శ్రీ ఏ కె ప్రభాకర్ గారినీ డా.గీతామాధవి గారు సాదరంగా ఆహ్వానించి సభకు పరిచయం చేశారు. "నంబూరి పరిపూర్ణ గారు పరిచయం అవసరం లేని రచయిత్రి. ఇటీవల మనందరినీ వదిలి వెళ్ళిపోయిన వారికి నివాళిగా వారిని సంస్మరించుకుంటూ ఈ నాటి వీక్షణాన్ని జరుపుకుంటూ ఉన్నాం" అని తెలియజేసారు. దాసరి అమరేంద్ర గారు ఇటీవల స్వర్వస్తులైన తమ అమ్మగారు శ్రీమతి నంబూరి పరిపూర్ణ గారి రచనా పరిణామం అనే అంశమ్మీద ప్రసంగించగా, ఏ కె ప్రభాకర్ గారు ఆత్మీయ వాక్యాలు పలుకుతూ పరిపూర్ణగారి రచనలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేసారు.

నంబూరి పరిపూర్ణగారి వివరాలు: వీరు 1931 జూలై 1న కృష్ణా జిల్లా బొమ్ములూరు గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యను విజయవాడ దగ్గర బండారిగూడెంలోనూ, మద్రాసు, రాజమండ్రిలలో హైస్కూల్ విద్యను, ఇంటెర్మీడియేట్ పి. ఆర్. కాలేజీ, కాకినాడలోనూ పూర్తిచేసి, ప్రైవేటుగా బి.ఏ. పట్టభద్రులయ్యారు. సెయింట్ థెరీసా మహిళా కళాశాల, ఏలూరులో టీచర్ ట్రైనింగ్ చేసారు. వీరు అనేక ఉద్యోగాలు చేసారు. 1955-58 మధ్య నూజివీడు, ఏలూరు, గోపన్నపాలెంలో అధ్యాపకులుగా పనిచేసారు. ఆ తర్వాత 1958-1989 మధ్య 30 ఏళ్ళ పాటు పంచాయితీ రాజ్ సోషల్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా, స్త్రీ శిశుసంక్షేమ శాఖలో లైజాన్ ఆఫీసర్ గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ గా  వివిధ ప్రాంతాలలో పనిచేసారు. 1989 జూలై 1న పదవీ విరమణ పొందారు.

సాంస్కృతిక రంగంలోని కృషిలో భాగంగా వీరు లోహితాస్యుడుగా స్టేజి నాటకంలోనూ, శోభనాచల పిక్చర్స్ వారి భక్తప్రహ్లాద సినిమా (1941)లో ప్రహ్లాదుడి పాత్రలను పోషించారు. సినిమాల్లో ప్లే బ్యాక్ లేకుండా పాటలూ, పద్యాలు పాడారు. బాలాంత్రపు రజనీకాంతరావు గారి ఆధ్వర్యంలో అనేక రేడియో నాటకాల్లో పాలుపంచుకున్నారు. 1965 నుంచి ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల నుంచి అనేక రేడియో ప్రసంగాలు ఇచ్చారు. 1944లో కమ్యూనిష్టు పార్టీ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో వేదికలపై ప్రచార గీతాలు ఆలపించారు. 1986లో అక్కినేని కుటుంబరావు గారి దర్శకత్వంలో "ఇద్దరూ ఒక్కటే" అనే టెలీఫిల్మ్ లో ప్రధాన భూమికను పోషించారు. 2004లో, సర్రాజు ప్రసన్నకుమార్ సంగీత దర్శకత్వంలో "స్వర పూర్ణిమ" అనే ఆడియో పాటల ఆల్బమ్ ను విడుదల చేసారు.

సాహిత్య వ్యాసంగంలో భాగంగా మాకురావు సూర్యోదయాలు, నవలిక (1985), ఉంటాయి మాకు ఉషస్సులు, కథా సంపుటి (1998), కథా పరిపూర్ణం కథా సంకలనం (2006) (శిరీష అమరేంద్ర శైలీంద్రలతో కలిసి), శిఖరారోహణ, వివిధ సామాజిక అంశాల పై స్త్రీ సమస్యల పై వ్యాసాలూ, కథల సంపుటి (2016), వెలుగు దారులలో… ఆత్మకథ (2017), పొలిమేర నవల (2018), ఆలంబన నవల 2022లో వెలువరించారు.

పరిపూర్ణ గారి సామాజిక సేవ గురించి చెప్పాలంటే 1944-49 మధ్య వామపక్ష ఉద్యమాల్లో విద్యార్థి కార్యకర్తగా, నేతగా పనిచేసారు. 1950-52 కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా నిర్బంధానికి గురై అజ్ఞాత జీవితం గడిపారు. విజయవాడ హైద్రాబాద్ లలో సంఘటిత, అసంఘటిత మహిళలతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇరవై ఏళ్ళ పాటు ఆలంబన స్వచ్ఛంద సేవాసంస్థకి చేయూతనిచ్చి, క్రియాశీలక పాత్రని పోషించారు. విశాలసాహితీ కథా పురస్కారం (1996), వెంకటసుబ్బు అవార్డులు (2019) వీరిని వరించాయి. ఇక వారి కుమారులు, ముఖ్య అతిథులైన దాసరి అమరేంద్ర గారు కథకులు, వక్త, అనువాదకులు. కథలు, వ్యాసాలు యాత్రాకథనాలు, అనువాదాలు.. ఇలా విభిన్న ప్రకియల్లో 16 పుస్తకాలు ప్రచురించారు. వృత్తిరీత్యా ఇంజినీరు. ఢిల్లీలో నివాసం ఉంటారు. అమరేంద్ర గారు మాట్లాడుతూ "స్వర్గీయ నంబూరి పరిపూర్ణ గారు దాసరి కులంలో జన్మించి వివక్షకు గురియైనా రంగస్థల నటిగా, సినీ నటిగా, రచయిత్రిగా, కవయిత్రిగా, వ్యాసకర్తగా ఎలా అందనంత ఎత్తుకు ఎదిగారో వివరించారు. ఆత్మాభిమానం, స్వావలంబన, సాధికారత సాధించి సమాజాన్ని కాచి వడపోసి రచించిన గ్రంథాలు మనకు మార్గదర్శనం చేస్తాయని వివరించారు. వామపక్ష భావాలతో ఎదిగిన తను తన 92వ యేట నిస్పృహతో వివిధ ప్రలోభాలకు గురియైన వామపక్ష వాదులు తమ మూలసిద్ధాంతాలను మూలపెట్టారు అని పరిపూర్ణగారు విచారం వ్యక్తం చేయడాన్ని, ఆమె ఆత్మసంస్కారాన్ని తెలియజేస్తుంది. వారి గ్రంథాలలో కొన్ని అయిన కథా పరిపూర్ణం, పొలిమేర, ఆలంబన, వెలుగు దారులలో, ఒకదీపం వేయి వెలుగులను పరిచయం చేశారు. సుమారు గంట సేపు అనర్గళంగా సాగిన వారి ఉపన్యాసం అద్భుతంగానూ, స్ఫూర్తిదాయకంగానూ జరిగింది.

ఆ తరువాత మాట్లాడిన ఏ కె ప్రభాకర్ గారు పరిపూర్ణగారి కథా సంవిధానాన్ని, విశేషాంశాలని సభకు తెలియజేసి సభలోనివారికి అదే స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలగజేశారు. తరువాత కవిసమ్మేళనాన్ని తొలుత శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారూ, ఆ తరువాత శ్రీ గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారూ సమర్థవంతంగా నిర్వహించారు. 28 మంది ఉద్దండ కవులు భారత దేశం నుండి, అమెరికా మొ.న పాశ్చాత్య దేశాలనుండీ పాల్గొని తమ కవితా గానాన్ని వినిపించారు.

డా.గీతామాధవిగారు తన కుడిచేతి వ్రేలుకి ఆపరేషన్ చేయించుకుని ఆ కట్టుతోనే పాల్గొనడం అచ్చెరువు గొల్పినది. ఆ వ్రేలు పైనే వారు కవిత చెప్పడం మరో విశేషం. ఆమె పడిన కష్టాలను, ఆగిపోయిన కార్యక్రమాలనూ ఆర్ద్రంగా, ఆవేదనగా, అద్భుతంగా వారి కవితలో వినిపించారు. వసీరా గారు యారాడకొండపై కవితాగానం చేశారు. "యారాడ ఏనుగుపై చందమామ ఊరేగాడు" అనడం మనస్సును తాకింది. కందుకూరి శ్రీరాములు గారు అమ్మ గురించిన ఆర్ద్రమైన కవితని వినిపించారు. ఆచ్ పిట్ట పద ప్రయోగం, ముసలమ్మ ముచ్చట ఎవరికి కావాలి? అనేవి ఇందులోని విశేషాలు. రాజేంద్రప్రసాద్ గారు "తెలుగు వెలుగురా" అని తన కంచు కంఠంతో శ్రావ్యంగా పాడి అందరినీ ఆకర్షించారు. డా.పాతూరి అన్నపూర్ణగారు 'కాలమా నీతో మాట్లాడాలని ఉంది' అంటూ అద్భుతమైన భావుకతను చూపారు. రాము లగిసెట్టి గారు ఇక పరుగెత్తు అని అందరిమనసులను తనతో పరుగెత్తించారు. డా. దేవులపల్లి పద్మజ గారు నవరస మాలికను సరసంగా వినిపించారు. మంచి భావుకత పరిమళించింది. డా.కోదాటి అరుణ గారు పుస్తకం యొక్క ప్రాముఖ్యతను తనకవితలో చెప్పారు. డా.బృంద గారు గానం చేసిన కవితలో అంత్యప్రాసలు అందరినీ ఆకట్టుకున్నాయి. డా.సి.హెచ్. సీతాలక్ష్మి గారు ప్రేమకు మరణంలేదు అంటూ ప్రేమ ఔన్నత్యాన్ని రసవత్తరంగా చెప్పారు. రామాయణం ప్రసాదరావు గారు "చావుతో సరసం" అనే కవితతో అందరినీ మెప్పించారు. అమృతవల్లి గారు క్రొత్తదనానికి చోటిస్తే అని, ఉమామహేశ్వరరావు గారు కవి గురించి గానం చేశారు. చిట్టాబత్తిన వీరరాఘవులు గారు కవిహృదయాన్ని సుందరంగా చెబితే, సాధనాల వెంకటస్వామి నాయుడుగారు కలల పై కవిత్వం వినిపించారు. పిళ్ల వెంకటరమణమూర్తి విచ్చిన్న ముకురం అనే కవిత చదివారు. వారి కవితలోని భాషా విన్యాసం అందరినీ ఆకట్టుకుంది. రవీంద్రగారు అమ్మలేని జీవితం ఎంత దుర్భరమో ఆర్ద్రంగా చదివారు. సత్యమూర్తి గారు మన భారతరత్న పీవీ గారిపై కవిత చదువగా, పీవీగారికి గురువైన వారి నాన్నగారిపై అయ్యలరాజుగారు గానించారు. మోటూరు వెంకట నారాయణరావు గారు "ఈ ప్రశ్నకు బదులేదీ" అంటూ ప్రశ్నించారు. మన్నెం లలితగారు కుక్కకాటుకు అనే కవితలో ఈనాటి యువతుల గురించి చెప్పారు. లోకనాధంగారు మాతృదేవోభవ అంటూ పద్య పఠనం చేసారు. మల్కాని విజయలక్ష్మి గారు పుస్తకం విజ్ఞానదీపికలు అంటూ పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచారు. వృద్ధాప్యం పై మేడిశెట్టి యోగేశ్వరరావు గారు వినిపించిన కవితలోని లయ సౌందర్యాన్ని అద్దుకుంది. ఇంకా ధనమ్మరెడ్డి, గౌరీపతి శాస్త్రి గారు, మొ.న వారు చక్కని కవితలు వినిపించారు.

జనవరి నెలకి గానూ ఉత్తమ కవితా పురస్కారాన్ని డా.చీదెళ్ల సీతాలక్ష్మి గారు అందుకున్నారు.

చివరిగా డా.గీతామాధవి గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఎన్నో కష్ట నష్టాలకోర్చి గీతగారు నెలనెలా వీక్షణం సమావేశాలు కాలిఫోర్నియా నుండి నిర్వహించడం కవిలోకానికి నెలనెలా ఓ పండుగ! ఈ సమావేశంలో అమెరికాతో బాటూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యాభిలాషులు అనేకులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఆత్మీయంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-138/

https://www.koumudi.net/Monthly/2024/march/march_2024_vyAsakoumudi_vikshanam.pdf

Tuesday 13 February 2024

వీక్షణం-137 వ సాహితీ సమావేశం

 వీక్షణం-137 వ సాహితీ సమావేశం

-- వరూధిని --
vikshanam-137

జనవరి 19, 2023 న ఆన్ లైనులో జరిగిన వీక్షణం సాహితీ సమావేశం ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ముందుగా డా.కె.గీతామాధవి గారు సభకు ఆహ్వానం పలకగా, శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు సభలోని తొలిభాగానికి నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ ఎలనాగ (డాక్టర్ సురేంద్ర నాగరాజు) విచ్చేసారు. "తెలుగు కవిత్వం - అనువాద ప్రాముఖ్యత" అనే అంశం మీద ప్రసంగించారు.

శ్రీ ఎలనాగ స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల. మొత్తం రచనల సంఖ్య: 37 (తెలుగులో స్వతంత్ర రచనలు - 16; ఇంగ్లీష్ లో స్వతంత్ర రచనలు - 2). అనువాదాల సంఖ్య: 19 (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి - 10; తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి - 9). ఇంగ్లీష్ లో రాసిన కవితా సంపుటి, Dazzlers కు Ukiyoto Global Publishers వారి Poet of the Year Award - 2023 వచ్చింది. అదే పుస్తకం టర్కిష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, రష్యన్, చైనీస్, జపనీస్ భాషలలోకి అనువదింపబడింది. వీరు ప్రముఖ కవి, అనువాదకులు శ్రీ నాగరాజు రామస్వామి గారికి సహోదరులు.

శ్రీ ఎలనాగ గారు అనువాదానికి సంబంధించిన ఎన్నో అంశాలు చేర్చుకుంటూ విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు. ప్రతి పదానికి రంగు, రుచి, బరువు ఉంటాయని కవితాత్మకంగా పేర్కొన్నారు. తెలుగులోనూ, ఆంగ్లంలోను సరిసమానమైన ప్రతిభా పాటవాలతో అనేక పదాల్ని ఎలా తర్జుమా చేయాలో వివరించారు. ఒక భాషలోంచి మరొక భాషలోకి అనువాదం చెయ్యాలంటే రెండు భాషల్లోనూ సమాన నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు. స్వీయ అనుభవాల నుండి కొన్ని పదాలను, పదబంధాలను, వాక్యాలను ఉదహరిస్తూ వాటి అనువాదానికి తాను పడ్డ కష్టాన్ని వివరించారు. అనువాదానికి, అనుసరణకు, అనుసృజనకు భేదాల్ని పేర్కొన్నారు. దాదాపు నలభై నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో అనేక అంశాల్ని ప్రస్తావిస్తూ అనువాద ప్రాముఖ్యాన్ని సునాయాసంగా వివరించారు. మొత్తంగా అనువాదానికి సంబంధించిన ఒక చక్కని తరగతి నిర్వహించినట్లుగా ఉందని సభలోని వారు పేర్కొనడం విశేషం.

తరువాత డా.గీతామాధవి గారు డిసెంబరు నెల కవితా పోటీ విజేతగా ఈ. వెంకటేష్ ను ప్రకటించారు. "బిచ్చవ్వ" అనే కవితకు గాను ఈ బహుమతి లభించింది.

ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనానికి నిర్వహణ బాధ్యత శ్రీమతి ప్రశాంతి రామ్, డా.సంధ్యారాణి కొండబత్తిని, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సంయుక్తంగా చేపట్టారు. ఇందులో భారతదేశం నుండి ప్రముఖ కవులు కందుకూరి శ్రీరాములు, వసీరా గార్లతో బాటూ, శ్రీసుధ కొలచన, డా.సంధ్యారాణి కొండబత్తిని, డా. నీహారిణి కొండపల్లి, డా. కె.గీతామాధవి, అపర్ణ గునుపూడి, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, సాధనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ దేవులపల్లి పద్మజ, శారద సాయి, ఈ. వెంకటేష్, మందా వీరాస్వామి గౌడ్, అమ్మాల కామేశ్వరి, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, కె వి యస్ గౌరీపతి శాస్త్రి(వీరవతి), వెంకటేశ్వర్లు లింగుట్ల, వుండవల్లి సుజాతామూర్తి, మండపాక అరుణ కుమారి, యు.వి. రత్నం, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, డాక్టర్ ఎం. ఎన్. బృంద, ఎస్ రత్నలక్ష్మి, చిట్టాబత్తిన వీరరాఘవులు, డా. భోగెల. ఉమామహేశ్వరరావు (ఉమాకవి), రవీంద్రబాబు అరవా, సత్య వీణా మొండ్రేటి, దేవి గాయత్రి, మేడిశెట్టి యోగేశ్వరరావు, మోటూరి నారాయణరావు, జె వి కుమార్ చేపూరి, పొన్నాల ధనమ్మరెడ్డి, శరత్కవి డబ్బీరు వెంకట రమణమూర్తి, డాక్టర్ గడ్డం శాంత కుమారి, డాక్టర్ కోదాటి అరుణ. ఆర్.ప్రవీణ్, మన్నె లలిత, డా. దూత. రామకోటేశ్వరరావు, బొమ్మిడి వినోదరెడ్డి, కలివే నాగేశ్వరరావు మొ.నవారు ఎందరో పాల్గొన్నారు. ప్రశాంతి రామ్, శారద సాయి శ్రావ్యమైన పాటలు పాడి వినిపించారు.

ఈ సమావేశంలో అమెరికాతో బాటూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవులు, సాహిత్యాభిలాషులు ఎంతోమంది పాల్గొన్నారు. అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-137/

https://www.koumudi.net/Monthly/2024/february/feb_2024_vyAsakoumudi_vikshanam.pdf

Thursday 18 January 2024

వీక్షణం-136 వ సాహితీ సమావేశం

 వీక్షణం-136 వ సాహితీ సమావేశం

-- వరూధిని --
vikshanam-136

డిసెంబరు 13, 2023 న జరిగిన వీక్షణం సమావేశం ఇప్పటివరకు జరిగిన అన్ని సమావేశాల్లోకెల్లా ప్రత్యేక సమావేశం. వీక్షణం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ సమావేశం భారతదేశంలో ప్రత్యక్ష సమావేశంగా హైదరాబాదులో జరిగింది. ఘనంగా జరిగిన ఈ వీక్షణం 136వ సమావేశంలో వీక్షణం అధ్యక్షులు డా.కె.గీత గారి ఆంగ్ల పుస్తకాలు Centenary Moonlight and other poems, At the Heart of Silicon Valley (Short Stories) ఆవిష్కరణలు ప్రముఖ సినీనటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారి చేతుల మీదుగా సాయంత్రం 6 గం. నుండి 9గం.ల వరకు ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగం పల్లి, నల్లకుంట, హైదరాబాద్ లో జరిగాయి.

ఈ సభకు అధ్యక్షత తెలంగాణా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ కందుకూరి శ్రీరాములు వహించగా, ముఖ్య అతిథిగా మ్యూజ్ ఇండియా చీఫ్ ఎడిటర్ శ్రీ ఆత్రేయ శర్మ విచ్చేసారు. వక్తలుగా ప్రముఖ కవులు, రచయితలు, అనువాదకులు శ్రీ వసీరా, డా. ఆలపాటి ట్యాగ్ లైన్ కింగ్, శ్రీమతి శ్రీసుధ కొలచన ప్రసంగించారు. ఇందులో దాదాపు నలభై మంది కవుల కవిసమ్మేళనం కూడా జరిగింది. కవిసమ్మేళనాన్ని డాక్టర్ రాధా కుసుమ గారు నిర్వహించారు. శ్రీమతి విశ్వైక కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి (యూ.ఎస్.ఏ), వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సభను విజయవంతంగా నిర్వహించారు. ఆవిష్కరణ పూర్తికాగానే డా.కె.గీతామాధవి గారు తన పుస్తక మొదటి ప్రతుల్ని తమ తల్లిగారైన ప్రముఖ రచయిత్రి శ్రీమతి కె.వరలక్ష్మి గారికి, తమ అన్నగారైన కె.ఆర్.ఫణిరాజ్ గార్లకు అందజేశారు.

విశ్వైక ముందుగా డా.కె.గీతామాధవి గారిని ఆహ్వానిస్తూ వారి వివరాలు తెలియజేసారు. డా|| కె.గీత రచయిత్రి, గాయని, భాషా నిపుణులు. “నెచ్చెలి” అంతర్జాల వనితా మాస పత్రిక వ్యవస్థాపక సంపాదకులు. కాలిఫోర్నియాలో నివాసం. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఫీల్డు లో "తెలుగు భాషా నిపుణురాలి" గా పనిచేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషాశాస్త్రంలో పిహెచ్.డి, అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. పది సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. 2006లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి "ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు" పొందారు. ద్రవ భాష (2001), శీత సుమాలు (2006), శతాబ్ది వెన్నెల (2013), సెలయేటి దివిటీ (2017), అసింట(2022) కవితా సంపుటాలు, సిలికాన్ లోయ సాక్షిగా(2018) కథా సంపుటి, వెనుతిరగని వెన్నెల (2021) నవల ప్రచురింపబడ్డాయి. "అపరాజిత"- గత ముప్ఫైయ్యేళ్ళ స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకత్వం వహించి ప్రచురించారు. కవిత్వంలో అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం మొ.న అవార్డులు, నవలకు తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ సాహితీ పురస్కారాల్ని పొందారు. ఈ ఆంగ్ల పుస్తకాలు వీరి ప్రచురింపబడిన ఎనిమిది, తొమ్మిదవ సంపుటులు.

డా.కె.గీతామాధవి గారు, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్లు ఆహ్వాన ఉపన్యాసాలు చేసారు. పుస్తకాల్ని ఆవిష్కరించి సుబ్బరాయ శర్మ గారు కె.గీత గారు షణ్ముఖి అంటూ వేనోళ్ళ కొనియాడారు. ఈ కథలు, కవితల్లోనించి తనకు నచ్చిన కొన్నిటిని ఉదహరించారు. ఆ తరువాత ప్రసంగించిన ఆత్రేయశర్మగారు సోదాహరణంగా అనువాద విశేషాల్ని వివరించారు. వసీరా గారు సిలికాన్ లోయ సాక్షిగా కథల గురించి వివరంగా ప్రసంగించగా, శ్రీ సుధ గారు సెంటినరీ మూన్ లైట్  గురించి, ఆలపాటి గారు రెండు పుస్తకాల గురించి సరదాగా ప్రసంగించి సభికుల్ని విశేషంగా అలరించారు. అధ్యక్షులు కందుకూరి శ్రీరాములుగారు సభను చక్కగా నిర్వహించి, చివరగా గీత గారి కవితల్ని చదివి వినిపించారు. చివరగా రచయిత్రి, కవయిత్రి డా.కె.గీత గారు తమ ప్రతిస్పందనగా మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి, అనువాద ఆవశ్యకతను తెలియజేసారు. తెలుగువారి రచనలు ప్రపంచ వ్యాప్తం కావాలంటే అనువాదాలు తప్పనిసరి అని తెలియజేసారు.

Centenary Moonlight and other poems డా|| కె.గీత గారి కవితల్లో నించి యాభై ఉత్తమ కవితల అనువాదాలు కాగా, At the Heart of Silicon Valley (Short Stories) సిలికాన్ లోయ సాక్షిగా కథల సంపుటికి ఆంగ్లానువాదం. ఈ పుస్తకాల్ని మో, ఎన్నెస్ మూర్తి, అల్లాడి ఉమ, శ్రీధర్, మాధురి పాలాజీ, వి.విజయకుమార్, వి.వి.బి. రామారావుగార్లు అనువాదం చేసారు.

ఈ సభలో మరో ప్రత్యేకత ఏవిటంటే ఉత్తమ కవిగా శ్రీ రామాయణం ప్రసాదరావు గారికి ఘనసన్మానం జరిగింది. ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనంలో డా.కె.గీతామాధవి, సాధనాల వెంకటస్వామి నాయుడు, డా. ఆలపాటి ట్యాగ్ లైన్ కింగ్, శ్రీసుధ కొలచన, రామాయణం ప్రసాదరావు, డాక్టర్ దేవులపల్లి పద్మజ, పిళ్ళా వెంకట రమణమూర్తి, విశ్వైక, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, డాక్టర్ మోటూరి నారాయణరావు, మామిళ్ళ లోకనాథం, అవధానం అమృతవల్లి, డాక్టర్ అరుణ కోదాటి, కె వి యస్ గౌరీపతి శాస్త్రి,డా. రాధా కుసుమ, ఆర్.ప్రవీణ్, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, పరిమి వెంకట సత్యమూర్తి, డా.వైరాగ్యం ప్రభాకర్, జె వి కుమార్ చేపూరి, రామకృష్ణ చంద్రమౌళి, ఎం. అరుణ కుమారి, మల్కని విజయలక్ష్మి, పోలయ్య కూకట్లపల్లి, డా. దూత రామకోటేశ్వరరావు, శరత్కవి డి వి ఆర్ మూర్తి, జి.కె.నారాయణ, కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, చిట్టాబత్తిన వీరరాఘవులు, కనకయ్య మల్లముల, మన్నె లలిత, విజయలక్ష్మీ వడ్డేపల్లి, డాక్టర్ ఎమ్ ఎన్ బృందా, ఎస్ రత్నలక్ష్మి, పి వసంత శోభ, పి. పద్మావతి, కె‌.జగ్గయ్య, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మొ.నవారు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల కవులు, రచయితలు సాహిత్యాభిలాషులు  మొ.న వారు అనేకులు పాల్గొన్నారు. కవిసమ్మేళనంలో పాల్గొన్న వారికి సన్మానాలతో సభ దిగ్విజయంగా ముగిసింది. అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-136/

https://www.koumudi.net/Monthly/2024/january/jan_2024_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం-135 వ సాహితీ సమావేశం

 వీక్షణం-135 వ సాహితీ సమావేశం

-- వరూధిని --
vikshanam-135

నవంబరు 10, 2023 న ప్రత్యక్ష సమావేశంగా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో షర్మిల గారింట్లో జరిగిన వీక్షణం 135వ సాహితీ సమావేశం శ్రీ మధు ప్రఖ్యా గారి అధ్యక్షతన ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశ ప్రధానోద్దేశ్యం వీక్షణం చిరకాల సభ్యులు, మిత్రులు, ప్రముఖ శతావధానులు అయిన శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారితో ఆత్మీయ సమావేశం జరుపుకోవడం. ఇటీవల శ్రీచరణ్ గారు అవధానిగా అమెరికాలో మొట్టమొదటి సంస్కృతాంధ్ర ద్విశతావధానాన్ని విజయవంతంగా పూర్తిచేసిన విషయం మనందరికీ విదితమే. ఈ సందర్భంగా వారికి ఈ సమావేశంలో ఆత్మీయ సన్మానం జరిగింది.

శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు కాలిఫోర్నియా నివాసి. బహుముఖ ప్రజ్ఞాశాలి. సాఫ్ట్ వేర్ రంగంలో నిపుణులు మాత్రమే కాకుండా సంస్కృతాంధ్ర భాషా పండితులు. పద్య కావ్యాలు రచించారు. అనేక మార్లు కావ్య పఠనం, వ్యాఖ్యానం చేసారు. గత ఐదారేళ్లుగా అవధానాలు చేస్తున్నారు.

వారి గురించి వారి మాటల్లోనే చెప్పాలంటే "మాది తిరుపతి సమీపంలోని కమ్మపల్లె. నాన్నగారు విద్వాన్‌పాలడుగు జయరామా నాయుడు ప్రధానోపాధ్యాయుడిగా, అమ్మగారు రావిళ్ల మనోరంజని జువాలజీ అధ్యాపకురాలిగా పనిచేశారు. మా తమ్ముడు జయచరణ్‌. నా చదువు బీటెక్‌ వరకూ తిరుపతిలోనే జరిగింది. 1997లో ఎంటెక్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేశా. వెంటనే ఉద్యోగం వచ్చింది. 1998లోనే అమెరికా వెళ్లా. అక్కడ సాప్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాను. చిన్నపుడు అమ్మానాన్నలు నేర్పిన శతకపద్యాలు ఇప్పటి నా అవధానాలకు పునాది వేసాయనిపిస్తుంది. రోజూ నాలుగైదు పద్యాలు అప్పట్లో కంఠతా పట్టేవాడిని. రామాయణం, భారతాల నుండి కథలు చెప్పేవారు. ఇక తిరుపతిలో ఉండడమనే కారణంతో గుడులకు వెళ్ళడం, అన్నమాచార్య కళామందిరానికి వెళ్ళడం వంటివి చిన్నతనం నుంచీ అలవడింది. దీంతో భక్తి, సాహిత్యం, భాష.. ఈ మూడింటిపై ఆసక్తి కలిగింది. ఆలయాల్లో పసితనం నుంచీ వింటున్న వేదపారాయణం కారణంగా శృతి, లయలపై కూడా తెలియని అరాధనాభావం ఏదో మదిలో ఉండేది. ఘంటసాల వారి పద్యాలు, ఎన్టీఆర్‌పౌరాణిక సినిమాల ద్వారా సాహిత్యం, పురాణాలపై జిజ్ఞాస కలిగింది. చిన్నతనం నుంచి చూస్తున్న అవధానాలు, వింటున్న ప్రవచనాలు, ఉషశ్రీ పుస్తకాలు వంటివి నాలో సాహిత్యం పట్ల అనురక్తిని పెంపొందించాయి.

అమెరికాలో ఓ గుడికి వెళ్ళినపుడు పరిచయమైన గణేశశర్మ అనే పురోహితుడి ద్వారా ప్రతి సోమవారం సాయంకాలం మూడేళ్లపాటు రుద్రాభిషేకంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ శబ్ద సౌందర్యం మంత్రాలపై ఆసక్తి కలిగించింది. వేదం నేర్చుకోవాలనే కోరిక కలిగింది, కానీ కొన్ని ఆటంకాలతో అది ముందుకు సాగలేదు. చివరకు, గురువుగారు శ్రీ మారేపల్లి నాగవేంకట శాస్త్రి గారు ఒకసారి నాలోని భక్తి, శ్రద్ధ గమనించి, ఈ రెంటికీ తోడు శుద్ధి కూడా పాటిస్తే వేదం నేర్పుతానన్నారు. వారి అనుగ్రహంతో 2007 మే మాసం నుంచి వేదాధ్యయనం చేస్తున్నా. ఒకవైపు తెలుగు, సంస్కృత సాహిత్యాలు చదువుకుంటూ, మరో వైపు వేదం నేర్చుకోవడంతో నాలో సాహిత్య అధ్యయన దృష్టి పెరిగింది.

2007లో తొలిసారి పద్యం రాసే ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేదు. అడపా దడపా, ఆశువుగా రాసుకున్న పద్యాలను ఒకసారి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు చూసి, పద్యనిర్మాణంలో మెలకువలు చెప్పారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌నేను రాసిన శివోహం పద్యాలు చూసి ప్రోత్సహించారు. "ఛందఃపద్మాలు" అనే నా తొలిపుస్తకాన్ని 2013లో వారే ఆవిష్కరించారు. నా సాధనలో భాగంగా ఇప్పటివరకూ 8వేలపద్యాలు, శ్లోకాలు రాశా.

ఇంటర్లో సంస్కృతం తీసుకున్నా. అప్పటి మా ఉపాధ్యాయులు పాఠం చెప్పేతీరు సంస్కృతం అంటే నాకుఇష్టం పెరిగేలా చేసింది. ఐఐటీలో మంచి లైబ్రరీ ఉండేది. అక్కడ చాలా పుస్తకాలు చదివా. అమెరికా వెళ్ళిన తొలినాళ్ళలోనే మళ్లీ ఆన్‌లైన్లో సంస్కృతం నేర్చుకోవడం, పుస్తకాలు తెప్పించుకోవడం చేసేవాణ్ణి. తిరుపతి విశాలాంధ్ర నుంచి నాకు కావలసిన పుస్తకాలను అమ్మ కొని పంపేది. అలా సంస్కృతంలో పంచమహా కావ్యాలు, వాల్మీకి రామాయణం పూర్తిగా చదువుకున్నా.

2016లో వద్దిపర్తి పద్మాకర్‌గారు సమస్య, వర్ణనలతో నా చేత అవధానం సాధన చేయించారు. 2017 మే మాసంలో అమెరికాలో నా తొలి అవధానం వేద గుడిలో జరిగింది. వెంటనే సెప్టెంబర్‌మాసంలోనే తెలుగు- సంస్కృత భాషలలో ద్విగుణిత అష్టావధానం మన వీక్షణం వార్షిక సాహితీ సమావేశంలోనే చేశాను. ఆ తరువాత వారంరోజుల వ్యవధిలోనే ఐదు అవధానాలుచేసే అవకాశం వచ్చింది. సంస్కృతంలోనే అప్రస్తుత ప్రసంగంతో అవధానం చేశాను. జంట అవధానం, త్రిగళావధానం, 8 మంది పృఛ్చకులతో కాకుండా 15 మంది పృఛ్చకులతో అవధానం చేయడం జరిగింది. ఇపుడు చేసినది నా తొలి ద్విశతావధానం, అదికూడా సంస్కృతం-తెలుగు భాషల్లో జరిగింది. వీక్షణంలో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ అవధానంలోని పృచ్ఛకులు అడిగిన సమస్యలను పూరించిన పద్యాలను ఆశువుగా చెప్పి అందరినీ ఆనందింపజేశారు.

శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారిని ఉద్దేశించి వీక్షణం అధ్యక్షులు డా. కె. గీతామాధవి గారు మాట్లాడుతూ "శ్రీ చరణ్ గారు నాకు మా వీక్షణం సాహితీ వేదిక ద్వారా దాదాపు గత పదేళ్ల కిందట పరిచయం కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారు భాషా, సాహిత్య పండితులు, సాఫ్ట్ వేర్ రంగంలో నిపుణులు మాత్రమే కాకుండా, ఏ రంగంలో ఏ ప్రశ్న అడిగినా చెప్పగలిగిన నిష్ణాతులు. ఒక విధంగా చెప్పాలంటే జీనియస్ ఆయన. అంతకంతా మంచి మనసున్న మనిషి. సౌశీల్యత, నిరాడంబరత కలిగిన గొప్ప మనీషి. అటువంటి శ్రీచరణ్ గారు నా సమకాలీకులు అని చెప్పుకోవడం కూడా గర్వకారణమైన విషయం. నా సహోదర సమానులైన వారి కోసం ఉడతా భక్తిగా ఒక చిన్న పద్యం-

శ్రీచరణ్ గారు -
సంస్కృతాంధ్ర పలుకు సమముగా పలుకుచు
ఎల్ల జగములెల్ల నెదుట నిలుపు
వారి కెవరు సాటి పద్దె విద్యను జూడఁ
చరణు వారి మాట చద్దిమూట!
అంటూ వారిని పద్యంతో కూడా సత్కరించారు.

శ్రీ చరణ్ గారిని ఉద్దేశించి శ్రీ మధు ప్రఖ్యా, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీమతి షంషాద్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీమతి షర్మిల, శ్రీమతి శారద, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీమతి అనూరాధ, శ్రీ రామకృష్ణ మున్నగువారు ప్రసంగించారు.

శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు చరణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజు ఆయనకు సరస్వతి పూనినట్లు మధ్య పూరణ గావించారని తెలియజేస్తూ పూరణ చేసిన కొన్ని పద్యాలను,వ్యాఖ్యతో సహా వివరించారు. సమస్యలు అందించిన వారు డా. కె.గీతామాధవి, శ్రీ మధు ప్రఖ్యా, శ్రీ శ్యామ్ పుల్లెల, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, డా. పిల్లలమఱ్ఱి శేషశాయి, శ్రీ చిమటా శ్రీనివాస్ మొ.న వారు.

1. సమస్య: వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్
పూరణ:
ఆర్షజ్ఞాన విధానధర్మములకును యజ్ఞేశ్వరారాధనం
కర్షక్షేత్ర చిదగ్ని బీజరుహ వాగ్గంధ ప్రకాశంబు దు
ర్ధర్షాఘాంధ వినాశమున శివమరుత్కౌండిన్య గోత్రోజసీ
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్


2. సమస్య: మనలను గాచునదె మారణహోమము చిత్తగింపగన్
పూరణ:
వనరుహ లోచనాభినవ పంచశిరోరుహ నాట్యలాస్యముల్
ధనమదమూని అపహృత ధర్మ నిరీశ్వర యాగభావమున్
దునిమెడివేళ సత్యధృతి దోర్బల భధ్రకరాళ రూపమే
మనలను గాచునదె మారణహోమము చిత్తగింపగన్


3. సమస్య: ఆలి మాట వినుట కలుక దేల
పూరణ:
కాలికైన లోక పాలనా వేశంబు
విషము గ్రోల నైన వెనుదిరుగదు
నిండుబలము నెడమనిండి నడుపువేళ
ఆలి మాట వినుట కలుకదేల


4. సమస్య: పలికెద గాక సత్యమును పట్టణ వీధుల యందు మిత్రమా!
పూరణ:
కలహ విమర్శనాంత నరకప్రద దుఃఖ దురంత భారముల్
నళిన మనోహరాద్భుత గణద్వర నీలిమ రోచిరంశముల్
తొలగెడి వేళలందు నిజరూప విలాస సనాతనంబునే
పలికెద గాక సత్యమును పట్టణ వీధుల యందు మిత్రమా!


మరి కొన్ని పూరణలు:

రామా! శూర్పణఖాంతమ
ప్రామిన్నుకుల సొగసులూని రవళింపగక దు
ష్కామిత మప్రాచ్యయమనును
మామా! మామ్మేమి! మమ్మిమమ్మీ మామ్మా!

బుధుల గొలుచువారి పుణ్యవిశేషముల్
మహితకాంతిసారమౌక్తికములు
జ్ణానదుగ్ధసింధు జాతపర్వాధ్యక్ష
విధుని పొట్టలోన నిధులు మెండు

ఛందఃపద్మాకరమున
వందనపూరిత కవిత్వపానజిగీషన్
చిందు కనకసుమముల ప్రా
కుందేటిని కోడిపిల్ల గుటుకున మింగెన్

నవనవజన్మశ్రీయుత
పవిత్రసూత్రాన్వితునకు వరమంగళమున్!
అవిసెను చింతామణికై
అవధానికి సానిదాని అవసరమయ్యెన్!

విద్వదనేకసంఘపరభీతివిదూరకవిప్లవార్థముల్
మృద్వభిరమ్యభావహితవృత్తివివర్ధితపద్యబంధముల్
సాధ్వభినవ్యవైఖరివిశాలసమున్నతశైలవేదవేదీ
ద్విశతావధనమున తిప్పలుబెట్టిరి పృచ్ఛకాళిరో!

చందనచర్చితానుభవసౌమ్యకళంకవపుర్విలాసముల్
సుందరసింధుజాత విధుసుమ్నకరగ్రహకౌముదీతతుల్
కుందసమానరోచిరతికోమలబైందవతారకావళుల్
వందలభార్యలున్న పతి వందనపాత్రుడు వేదసాక్షిగా!

రాగవిమోహపారసలిలప్లవకేతుకదీర్ఘవీచికల్
మూగినవేళ కప్పబడు మోహమనోగతభావనావళుల్
దాగని ధూర్తవర్తనము దాటగ త్రెళ్ళెడి తార తానహో
ఏగతి వేడుకోగలదు ఈసతి దుర్మతి సాహసించగన్

దాడిమ్యామ్రఫలాంతరద్భుతరసోద్యానాధినాథాళికిన్
నీడల్ గాంచని మూర్ఖసంతతికిలన్ నిర్ఘోషితాక్రందనల్
వ్రీడావర్జితసద్విమర్శసరణిన్ వెల్గొందు ఖడ్గాళికిన్
సోడా త్రాగినవారు వ్రాయగలరే సోకైన పద్యంబిలన్

సద్య ఉపాసనప్రథమశాస్త్రవిచారవిమర్శసంచరత్
వైద్యనిధానమూర్తులకు వంద్యులకున్ సురసోమతీర్థమున్
హృద్యవికారరోగతరణీయసమర్థన చేయువేళ చి
న్మద్యము గ్రోలు వారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

కట్నము దయ్యమై వరలు కాపురుషాధమచిత్తమందునన్
చట్నజనించునట్టి విరసంబుల గాడ్పులు మిన్నునంటగా
పట్నపువాసులెల్లరకు భావము దాచెడి భావముష్టికై
రాట్నము చేతబట్టుకుని రాక్షసకృత్యము చేసినాడహో!

బలరిపుభంజనాకృతి విపత్పరిణామవినాశమూర్తినిన్
పొలుపుగ పేర్చినట్టి పలుభూములగుంపులు కల్పకాలముల్
తెలియగజేయునక్కథల తీరులవింతలు బాంధవాళులన్
చెలువగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభు డన్నయౌ

కల్పనా తిగతుంగా కల్పసూత్రము జ్ఞానమంగళమూర్తియై
శిల్పసుందరమందిరాంతర చిద్విలాసమనోజ్ఞియై
పొల్పునిల్చిన దుర్గరూపము మోయచిత్తగుహంబునన్
మిల్పిటాసున సింహమొక్కటి మేలుకొన్నది చూడరా!

ఆర్షజ్ఞానవిధానధర్మములకున్ యజ్ఞేశ్వరారాధనున్
కర్షక్షేత్ర చిదగ్నిబీజరుహ వాగ్గంధప్రకాశంబు దు
ర్ధర్షాగాంధవినాశమున్ శివమరుత్కౌండిన్యగోత్రౌజసీ
వర్షాకాలము వచ్చె గ్రీష్మమువలెన్ వైశాఖమాసంబునన్

ఈ సమావేశంలో స్థానిక వక్తలు, కథకులు, కవులు, కవయిత్రులు, సాహిత్యాభిలాషులు మొ.న వారు పాల్గొన్నారు. సభలోని వారి ఆత్మీయ స్పందనలతో, శ్రీచరణ్ గారికి సన్మానాలతో సభ దిగ్విజయంగా ముగిసింది.

అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-135/

https://www.koumudi.net/Monthly/2023/december/dec_2023_vyAsakoumudi_vikshanam.pdf


వీక్షణం-134 వ సాహితీ సమావేశం

 వీక్షణం-134 వ సాహితీ సమావేశం

-- వరూధిని & డా. సంధ్యారాణి కొండబత్తిని --
vikshanam-134

వీక్షణం 134వ సాహితీ సమావేశం జూమ్ వేదికగా డాక్టర్ కె.గీతామాధవి గారి అధ్యక్షతన అక్టోబర్ 14 వ తేదీ శనివారం సాయంత్రం సుమారు మూడు గంటలపాటు జరిగింది. కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. వివిధ దేశాలనుండి వక్తలు, కథకులు, కవులు, కవయిత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ కవి శ్రీ వసీరా, ప్రముఖ యువ కథా రచయిత శ్రీ వి.మల్లికార్జున్ పాల్గొన్నారు.

“వసీరా” గా ప్రసిద్ధి చెందిన వక్కలంక సీతారామారావు పుట్టింది, చదివింది కోనసీమ లోని అమలాపురం. జర్నలిస్ట్ గా వివిధ పత్రికలు, టీవీ ఛానళ్లలో దాదాపు 30 స.రాలు  పైనే పనిచేసారు. లోహనది, మరోదశ, సెల్ఫీ కవితా సంకలనాలు రాసారు. “లోహనది” కి ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు, గరికపాటి అవార్డులు వచ్చాయి.

ముందుగా ప్రత్యేక ఆహ్వానితులు ప్రముఖ కవి, జర్నలిస్ట్ 'వసీరా' గారు తమ కవితాపఠనంతో హృదయాలని ద్రవింపచేశారు అంటే అతిశయోక్తి కాదేమో! కవితాసృజనలోని మెలకువలు, సూచనలు, సలహాలు వర్ధమానరచయితలకు ఉపయోగపడేలా సోదాహరణంగా వివరించారు.

ఇటీవల విడుదలైన వారి కవితా సంపుటి "సెల్ఫీ" నించి మొత్తం మూడు కవితల్ని వినిపించారు. మొదటిది హథ్రాస్, ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ అనే చోట ఒక దళిత బాలిక మీద అగ్రవర్ణాలకు చెందిన వారు అతి క్రూరంగా అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనని ఖండిస్తూ రాసిన కవిత. హథ్రాస్ కవిత 2020 లో నెచ్చెలి అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. ఇందులో బాలికని కాళికతో పోలుస్తూ రాసిన కవితాత్మక వాక్యాలు ఇలా ఉన్నాయి.

"విస్ఫోటించే నేల లోంచి కొత్త కాళిక ఆవిర్భవిస్తోంది.
సత్యానికి నోరిచ్చేందుకు సహస్రబాహువుల్లో
కొత్త ఆయుధాలు ధరించి
పరపరా సరసరా నాలుకలు కోస్తోంది
కోసిన నాలికలు మొల చుట్టూ అలంకరించుకుంది
......
అచ్చంగా పరపరా కలుపు మొక్కలు కోసినట్లుగా
పురుషాంగాలు కోసి మొలచుట్టూ అలంకరించుకుంటోంది"
అని ఆక్రోశాన్ని వ్యక్తం చేసారు. తరువాత "బంగారుపాప", "ఏమో ఎవడికి తెలుసు" కవితల్ని వినిపించి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు.

ఆ తర్వాత డా.గీత గారు వర్ధమాన కవులకు ఉపయోగపడేలా వచన కవితాసృజనలోని మెలకువలు, సూచనలు, సలహాలు తెలియజెయ్యమని వసీరా గారిని అడిగినప్పుడు అత్యంత ఆసక్తికరంగా, సోదాహరణంగా వివరించారు.

తరువాత శ్రీ వి.మల్లికార్జున్ గారి కథా పఠనం జరిగింది. 1992లో నల్లగొండ పట్టణంలో పుట్టి పెరిగిన మల్లికార్జున్, ఇంజినీరింగ్ చదివి కథల మీద ఇష్టంతో సాహిత్యరంగం వైపు వచ్చారు. 2014 నుంచి కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు ‘ఇరానీకేఫ్’, ‘కాగితం పడవలు’, ‘నల్లగొండ కథలు’ కథాసంపుటాలు వెలువరించారు. గతంలో సాక్షి, వెలుగు దినపత్రికల సండే మ్యాగజైన్లలో పనిచేసి, ఆ తర్వాత సొంతంగా ‘అజు పబ్లికేషన్స్’ పేరుతో పుస్తక ప్రచురణ సంస్థను నెలకొల్పి పది పుస్తకాలు ప్రచురించారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. 2023లో మల్లికార్జున్ తన రచనలకు గానూ డా. వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారం అందుకున్నారు.

ఈ సమావేశంలో 'నల్లగొండ కథలు' అనే కథా సంపుటి నుండి మా అమ్మ ముత్యాలు, మా నాన్న మారయ్య అనే కథల్ని చదివి వినిపించారు. తమ బాల్యం, ఊరు, అమ్మ, నాన్నలతో అనుబంధాన్ని తెలియజేస్తూ, ప్రత్యేకంగా మాండలిక యాసలో సాగిన కథాపఠనం విశేషంగా ఆకట్టుకుంది. శ్రోతలని తమ తమ బాల్యపు అనుభవాలను నెమరువేసుకునేలా చేసింది.

"అప్పట్నించి మా అమ్మ మళ్లా చెవులు కుట్టిచ్చలేదు. ఎడమపక్క చెవి గింతంత తెగి పక్కకి జరిగి ఉంటది. నాకు ఆ గింతంత చెవి ముక్క పట్టుకొని మా అమ్మ పక్కన కూసొని ముచ్చట చెప్పుడంటే పిచ్చి ఇష్టం."

"‘‘ఏం పేరే ఆయనది?’’ అనడిగిన. ‘‘ఏమో పేరుండెనేరా?’’ అని చానాసేపు ఆగిండు. ‘‘ముసిలిమోల్ల పిల్లగాడురా, చానా మంచోడు, చూసినవుగా!’’ అన్నడు మా నాన్న."

వంటి ఆర్ద్రమైన వాక్యాలు సభలోని వారికి కంట తడి పెట్టించాయి. ఈ కథలన్నీ ఆశువుగా చెప్పినట్టు అల్లడం ప్రత్యేకత. అలాగే ఈ కథల్లో ఎత్తుగడ, ముగింపులు అలవోకగా కనిపించినా కథ చెప్పే మంచి టెక్నిక్ ని ఔపోసన పట్టినట్టు ఉంటాయి.

ఆ తరువాత జరిగిన కవిసమ్మేళనంలో శ్రీధరరెడ్డి బిల్లా, దాలిరాజు వైశ్యరాజు, బాలకృష్ణారెడ్డి తాటిపర్తి, డా.కె.గీత, డా.సంధ్యారాణి కొండబత్తిని, మండ వీరస్వామి గౌడ్, గుర్రం మల్లేశం, ఆకుల అయోధ్య, గడిపె మల్లేశు, షేక్ రహీం సాహెబ్, మచ్చా రాజమౌళి, సరస్వతి రాయవరపు, చెరుకుపల్లి గాంగేయ శాస్త్రి, విజయలక్ష్మి మల్కని, అరుణ జ్యోతి, సత్యవతి యెడ్ల, షేక్ అమీనా కలందర్,

సావిత్రి రంజోల్కర్, అమృతవల్లి అవధానం, డాక్టర్ దేవులపల్లి పద్మజ, డాక్టర్ ఎం.ఎన్.బృంద, దేవి గాయత్రి, నారోజు వెంకటరమణ, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, మేడిశెట్టి యోగేశ్వరరావు, ప్రసాదరావు రామాయణం, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, సాదనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ మోటూరి నారాయణరావు మొ.న కవులు, కవయిత్రులు వైవిధ్య భరితమైన అంశాలపై కవితాపఠనంతో అలరించారు.

సరస్వతీ పుత్రిక డాక్టర్ గీతామాధవి గారు శతవిధాలా నిరంతరం ఎంతో శ్రమకోర్చి, వృత్తిని ప్రవృత్తిని సమన్వయo చేస్తూ సాహిత్యాభిలాషులను ప్రోత్సహిస్తూ క్రమం తప్పకుండా ప్రతినెలా అద్భుతమైన సాహితీ సమావేశాల్ని నిర్వహిస్తున్న వారి కృషికి అభినందన చందనాలు.

శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల గారు, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గార్ల ఆత్మీయ సహకారాలు, స్పందనలతో సభ దిగ్విజయంగా ముగిసింది. అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

_______________

https://sirimalle.com/vikshanam-134/

https://www.koumudi.net/Monthly/2023/november/nov_2023_vyAsakoumudi_vikshanam.pdf

"వీక్షణం" సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 11వ వార్షికోత్సవం

 "వీక్షణం" సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 11వ వార్షికోత్సవం

-- సుభద్ర ద్రోణంరాజు & వరూధిని --
vikshanam-11-Anniversary-01

సెప్టెంబరు 9/10, 2023 తేదీలలో ఉదయం 10 గం. నించి సాయంత్రం 5 గం. వరకు వీక్షణం 11 వ వార్షికోత్సవాన్ని అంతర్జాలంలోనూ, అమెరికాలోని కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలోని స్వాగత్ హోటల్లోనూ అట్టహాసంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమాలను వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి ఆహ్వానం పలికి ప్రారంభించారు. ముందుగా ఆన్లైన్ సమావేశంలో వీక్షణం ఆవిర్భావ వికాసాలను గురించి తెలియజేస్తూ-

"గత ఏడాది కాలంగా వీక్షణం అంతర్జాతీయ సాహితీ వేదిక అయ్యింది. ఆన్ లైనులోనూ, ముఖతః సమావేశాలు నడపడానికి తమ వంతు సహాయం చేస్తూ, చేయూతనిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు. ఈ వీక్షణం సాహితీ వేదిక స్థాపనకు అంకురార్పణ ఎలా జరిగిందో ముందు వివరిస్తాను. చిన్నతనం నించి సృజనాత్మక రచనలు చెయ్యడం, సభలు, సమావేశాల్లో పాల్గొనడం అలవాటైన నాకు అమెరికా వచ్చాక నేను అప్పటివరకు నా చుట్టూ ఉన్న సాహిత్య వాతావరణాన్ని కోల్పోయేను. సాహిత్యానికంటూ ఒక వేదిక లేకపోవడం ఒక లోటుగా అనిపించేది. రాయాలనే స్ఫూర్తి అడుగంటిపోతూ ఉండేది. అందుకోసం ఏమైనా ఎవరైనా చేస్తే బావుణ్ణని ఎప్పుడూ అనుకునేదాన్ని. అనుకోకుండా 2012లో ఒకానొక సాయంత్రం ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు. వెంటనే దాదాపు 30 మందితో చర్చించి, మొదటగా వేమూరి వెంకటేశ్వర్రావు గారింట్లో “వీక్షణం” పేరుతో మొదటి సమావేశాన్ని 2012 సెప్టెంబరు 9 వ తారీఖున జరుపుకున్నాం. ఇక ఆగకుండా నెలనెలా రెండవ ఆదివారం నాడు కొనసాగుతూనే ఉంది వీక్షణం. ఈవేళ వీక్షణంలో ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమందికి పైగా సభ్యులున్నారు.

కేవలం నాలోను, నా చుట్టూ ఉన్నవారిలోను సాహితీ స్ఫూర్తిని నిలబెట్టుకునే వేదికగా మాత్రమే కాకుండా, ఉచితంగా, స్వచ్చందంగా సమావేశాలు జరపాలనే ఉన్నతమైన లక్ష్యంతో కొనసాగుతూ ఉంది వీక్షణం. ఆ లక్ష్యమే వీక్షణంలో అందరినీ ఒక కుటుంబంగా చేసింది. విరాళాలు లేకుండా జరుపుకునే ఈ సమావేశాలు నిజానికి ఒక విజయవంతమైన ప్రయోగం. ఈ ప్రయత్నంలో నాకు ఎంతగానో సహకరించిన కాలిఫోర్నియా రచయితలు, సాహిత్యాభిలాషులందరికీ సభాముఖంగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

“వీక్షణం - సాహితీ గవాక్షం” అని మనందరం పిలుచుకునే ఈ వేదికలో లక్ష్మీపార్వతిగారు, గొల్లపూడి మారుతీరావుగారు, సుద్దాల అశోక్ తేజగారు, కాత్యాయనీ విద్మహేగారు, పాపినేని శివశంకర్ గారు, చుక్కా రామయ్య గారు వంటి ఎందరో ప్రముఖులు ప్రసంగించారు. 2021లో ఘనంగా జరిగిన 100 వ సమావేశం జరుపుకున్నాం. అందులో ప్రపంచ వ్యాప్త ప్రముఖులైన  డా|| జంపాల చౌదరి గారు, వంగూరి చిట్టెన్ రాజు గారు, శ్రీ కె.రత్నకుమార్ గారు, శ్రీ సాంస్కృతిక కళాసారధి  (సింగపూర్) , శ్రీ రావు కొంచాడ గారు, ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (ఆస్ట్రేలియా), - తెలుగుతల్లి పత్రికా నిర్వాహకులు శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు (కెనడా),  శ్రీ కిరణ్ ప్రభ గారు వంటి ఎందరో ప్రసంగించారు. అన్నివేదికల్లో దాదాపు100మందికి పైగా పాల్గొన్నారు.

అలాగే ప్రతి సమావేశం ఒక క్రమమైన అనుక్రమణికతో జరుగుతుంది. ప్రధాన ప్రసంగం, కవిసమ్మేళనం, చర్చ వంటివి భాగాలుగా ఉంటాయి. వీక్షణం బ్లాగులో, ఫేస్ బుక్ పేజీలో నెలనెలా సమావేశాలు, వివరాలు పొందుపరచబడతాయి. నెలనెలా వీక్షణం కవితల పోటీలు నిర్వ్హహించబడతాయి. సంవత్సరానికొకసారి వీక్షణం వార్షిక ప్రత్యేక సంచిక ప్రచురింపడుతుంది.

వీక్షణం ఛానెల్ లో సమావేశాల వీడియోలు పొందుపరచబడుతున్నాయి. నెలనెలా వీక్షణం సమావేశ సమీక్షలు స్థానిక పత్రికలైన కౌముది, సిరిమల్లెలలో ముద్రింపబడతాయి. ఇలా ఒక చక్కటి కార్యాచరణతో ఇప్పటివరకు 132 సమావేశాలు నెలనెలా క్రమం తప్పకుండా గడిచాయి.

అయితే నాకు నేనుగా ఇదంతా చెయ్యడానికి, ఆసక్తి కోల్పోకుండా ఇటువంటి వేదికని నడపడానికి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, ఎంత శ్రమ పడాల్సి వస్తుందో తెలిసింది. అన్నిటికంటే విలువైన సమయం వెచ్చించడంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చెయ్యాలో అర్థమైంది. అయితే అది గొప్ప ఆనందాన్నిచ్చే శ్రమ. అత్యంత ఆత్మీయమైన బాధ్యత. ఈవేళ నాకోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప సహృదయులు, ఆత్మీయులు ఉన్నారు అంటే అది కేవలం వీక్షణం వల్లే. నాతో బాటూ అడుగడుగునా సహకరిస్తూ వీక్షణం విజయానికి తోడ్పడుతున్న మిత్రులందరికీ మరోసారి పేరుపేరునా అభివందనాలు తెలియజేస్తున్నాను." అని కృతజ్ఞతలతో ముగించారు.

తరువాత అంతర్జాల కార్యక్రమంలో శ్రీ మృత్యుంజయుడు తాటిపాముల, శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ఆత్మీయవాక్యాలు పలికారు. మృత్యుంజయుడు తాటిపాములగారు వీక్షణం సభ్యుడిగా మొదటి నించీ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు గత ఏడాది కాలంగా వీక్షణం సమావేశాల అనుభవాలను, ఈ ప్రత్యేక సమావేశ ఏర్పాట్ల విశేషాలను పంచుకున్నారు.

విశిష్ట అతిథిగా వంగూరి ఫౌండేషన్ అధినేత శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు విచ్చేసి, ప్రసంగించారు."గీతమ్మా" అంటూ ఆత్మీయంగా సంబోధిస్తూ ఇటువంటి వేదికలను క్రమం తప్పకుండా నడపడంలో ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలను వివరించారు. వీక్షణం ఇంకా ఎన్నో వార్షిక సమావేశాల్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని ముగించారు.

ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారు "తెలుగుసాహిత్య సౌరభం" అనే అంశం మీద ప్రసంగిస్తూ నన్నయ కాలం నుండి నాయకరాజుల కాలం వరకూ సాహిత్యాన్ని సోదాహరణంగా వివరించారు. వరుసగా నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాధుడు, పోతన, కృష్ణదేవరాయలు, వారి ఆస్థానకవులైన పెద్దన, నంది తిమ్మన, రామకృష్ణ కవి మొ.న అష్టదిగ్గజాలు, నాయకరాజుల కాలంలో తాను పరిశోధన చేసిన కందుకూరి రుద్రకవి సాహిత్యం గురించి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని అందిస్తూ చక్కని ప్రసంగాన్ని అందించారు.

ప్రొ.కొలకలూరి మధుజ్యోతి గారు "ఆధునిక తెలుగు సాహిత్యంలో స్త్రీ చిత్రణ" అనే అంశం మీద వివరణాత్మక ప్రసంగం చేసారు. కందుకూరి వీరేశలింగం పంతులుగారి నించి మొదలుకొని స్త్రీ అభ్యున్నతికి పాటుపడిన గురజాడ, చలం, కొడవటిగంటి కుటుంబరావు, కొలకలూరి ఇనాక్ గారు మొ.న ఎందరో రచయితల రచనల్ని, భండారు అచ్చమాంబ మొదలుకుని ఆధునిక స్త్రీవాద సాహిత్యం వరకూ కథలు, నవలల్ని సోదాహరణంగా వివరిస్తూ ఉధృత ప్రవాహంలా అద్భుతమైన ప్రసంగం చేశారు.

తరువాత డా.సంధ్యారాణి కొండబత్తిని కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశాల నుండి కవులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో వసీరా, డా.కె.గీత, శ్రీధర్ రెడ్డి బిల్లా, ఉషా శ్రీదేవి శ్రీధర, పిళ్ళా వెంకట రమణమూర్తి, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, సాదనాల వెంకటస్వామి నాయుడు, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, దేవి గాయత్రి, డాక్టర్ ఎం.ఎన్.బృంద, మేడిశెట్టి యోగేశ్వరరావు, అమృతవల్లి అవధానం, మామిళ్ల లోకనాధం, నారోజు వెంకటరమణ, డాక్టర్ మోటూరి నారాయణరావు, ప్రసాదరావు రామాయణం, డాక్టర్ దేవులపల్లి పద్మజ, కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి, గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్, డబ్బీరు వెంకట రమణమూర్తి, మన్నె లలిత మొ.న వారు పాల్గొని కవితాగానం చేసారు.

చివరగా జరిగిన సమాపనోత్సవంలో ప్రత్యేక అతిథులుగా యు.కె నించి శ్రీ రాజేష్ తోలేటి గారు, ఫ్రాన్స్ నించి శ్రీ వెంకట కృష్ణ మాదాసు గార్లు పాల్గొని తమ ఆత్మీయ సందేశాలనందించారు. తమ దేశాల్లో సాహిత్య కార్యక్రమాలు జరుపుకొందుకు వీక్షణం తమకు మార్గదర్శిగా నిలుస్తూ, మంచి ప్రోత్సాహాన్నిచ్చిందని అన్నారు.

vikshanam-11-Anniversary-02

ఇక ఆదివారం సెప్టెంబరు,10 నాడు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో స్వాగత్ హోటల్లో రోజంతా జరిగిన వీక్షణం వార్షికోత్సవాన్ని డా.కె.గీత గారు నిర్వహించారు. డా.కె.గీత ఆహ్వాన ప్రసంగం తరువాత ముఖ్య అతిథులుగా సిరిమల్లె అంతర్జాల మాస పత్రిక సంపాదకులు డా. మధు బుడమగుంట గారు, శ్రీ చిమటా శ్రీనివాస్ గారు, శ్రీ కిరణ్ ప్రభ గార్లు ప్రసంగాలు చేశారు.

డా.మధు బుడమగుంట గారు "మన సాహిత్యం మన చేతిలో" అనే అంశం మీద ప్రసంగిస్తూ మాతృభాషలో సాహిత్య సృజన చేస్తే జీవం ఉట్టిపడుతూ ఉంటుందన్నారు. మనం మనంగానే మిగిలిన రోజు మానసిక పరిణతి పొంది మనోల్లాసం తో మెదడు చురుకుగా పనిచేసి మనలోని సాహితీ పిపాసి బయటకు వచ్చి మన ఆలోచనల ఉధృతి ని పెంచి అన్నింటా మెరుగైన అక్షరక్రమాన్ని మనకు అందించడం జరుగుతుంది. మనలోని మానసిక పరిపక్వత ను గుర్తించిన నాడు, మనలోని స్వార్థ చింతన తరిగిపోయి సహజమైన మానవత్వ పోకడలు కనబడతాయి. అప్పుడు మాతృభాష మాధుర్యాన్ని ఉగ్గుపాలతో చవిచూసిన మనవంటి భాషా ప్రేమికులకు భాషా సాహిత్య పరిరక్షణ పెద్ద విషయం కాదు. మన బాధ్యత ను గుర్తెరిగి విధిని నిర్వహించడమే అని సెలవిచ్చారు. అలాగే తెలుగు భాష విశిష్టతను తెలియజేస్తూ మన భాషలోని అనేక ప్రత్యేకాంశాలను పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన సాహిత్యం రూపుదిద్దుకునే క్రమాన్ని వివరిస్తూ ముగించారు.

తరువాత శ్రీ చిమటా శ్రీనివాస్ "తెలుగు సినిమా పాటల్లోని మంచి సాహిత్యం" గురించి మాట్లాడుతూ తొలితరం రచనల నించి ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల వరకూ వివరించారు. 1931 లోని భక్తప్రహ్లాద లోని కేశవదాసు, సముద్రాల, పింగళి, దేవులపల్లి, శ్రీశ్రీ , మల్లాది రామకృష్ణ శాస్త్రి, ఆత్రేయ మున్నగు వారి పాటల్లోని విశేషాల్ని వివరిస్తూ, చక్కగా రాగయుక్తంగా పాడుతూ సభలోని వారందరినీ అలరించారు.

తరువాత వీక్షణం 11 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల ఆవిష్కరణలు శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి పాతూరి, డా.కె.గీత, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీ వేణు ఆసూరి, డా.మధు బుడమగుంట, శ్రీ చిమటా శ్రీనివాస్ గార్ల  చేతుల మీదుగా జరిగాయి.

వెనువెంటనే శ్రీ వేణు ఆసూరి కవితాసంపుటి “తరంగాలు” పుస్తకావిష్కరణని  శ్రీ సుభాష్ పెద్దు నిర్వహించారు. ప్రశ్నోత్తర పరంపరగా సాగిన పుస్తక పరిచయం కొత్తగా, విశేషంగా జరిగింది. వేణుగారు స్వేచ్ఛ, సౌందర్యం, అమ్మ గురించిన కవితల్ని గురించి వివరించారు. గీతగారు అప్పటికప్పుడు వేణుగారి కవిత "కలలుకను-కలలుకను" కి రాగం కట్టి అలవోకగా పాడి వినిపించి అందరినీ అలరించారు.

భోజన విరామం తర్వాత శ్రీ కిరణ్ ప్రభ గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జీవిత విశేషాల్ని, గొప్ప తనాన్ని వివరించి అందర్నీ ఆకట్టుకున్నారు. కేవలం వ్యావహారిక తెలుగు భాషా ఉద్యమకారునిగా, తెలుగు భాష సరళీకృత కర్తగా అందరికీ తెలిసిన రామ్మూర్తి పంతులు గారి నిజజీవితంలోని వాస్తవికతను వివరించారు. అందరికీ తెలియని ఎన్నో విషయాలను, రామ్మూర్తి పంతులు గారు స్వీయ ఆసక్తితో, సొంత ఖర్చుతో సవరభాషకు చేసిన విశిష్ట సేవని చక్కగా వివరించారు.

తరువాత శ్రీ ఎ.కె. ప్రభాకర్ గారు నిర్వహించిన కథా చర్చలో శ్రీ కె.వి. రమణారావు , శ్రీమతి తురగా జయశ్యామల, డా.కె.గీత, కుమారి అమూల్య, శ్రీ విద్యార్థి మొ.న వారు పాల్గొన్నారు. గీతగారు రచన సామాజిక బాధ్యత అంటూ, డయాస్పోరా కథల పరిణామం, రచయితల బాధ్యతల్ని వివరించారు. జయశ్యామలగారు, కె.వి. రమణారావు గారు, విద్యార్థి గారు కథా రచయితల నేపథ్యం, కథా వస్తువు, కథా ప్రయోజనం మొ.న అంశాల మీద మాట్లాడేరు. ఇప్పటి కొత్త తరానికి చెందిన యువతి అమూల్య తనకు తెలిసిన తెలుగు సాహిత్యం పట్ల తన అభిప్రాయాల్ని, తన రచనానుభవాల్ని వివరించింది.

చివరిగా శ్రీ వంశీ ప్రఖ్యా గారి నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనంలో స్థానిక ప్రముఖ కవులు శ్రీమతి షంషాద్, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, డా.కె.గీత, శ్రీ ఎ.కె. ప్రభాకర్, శ్రీ వేణు ఆసూరి మున్నగువారు పాల్గొన్నారు.

ఎందరో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సభల సందర్భంగా అధ్యక్షులు డా.కె.గీతామాధవి కవులకు, అతిథులకు ప్రశంసాపత్రాల్ని అందజేశారు.

కిందటి ఏడాది నించి ప్రపంచ వ్యాప్తమైన "వీక్షణం" సాహితీ గవాక్షం అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లోనే కాక, నెలనెలా అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ, ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని ప్రపంచమంతా చాటుతూ విజయవంతంగా 11 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది.

అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశాల వీడియోల్ని ఇక్కడ చూడవచ్చు.

  1. మిల్పిటాస్, కాలిఫోర్నియాలో జరిగిన ప్రత్యక్ష సమావేశ వీడియోలు:-
    పార్ట్-1: https://youtube.com/live/ceG5lZPhdkU?feature=share
    పార్ట్-2 : https://youtube.com/live/j6aIG1AbIio?feature=share
  2. ఆన్ లైన్ సమావేశవీడియో:- https://youtube.com/live/XgXLLoqHpHM?feature=share
_______________