|
||
వీక్షణం పదహారవ సాహితీ సమావేశం ప్లెసంటన్ లోని వేమూరి గారింట్లో జరిగింది. సభకు ఆహ్వానం పలుకుతూ వేమూరి పదహారు నెలలుగా నెలనెలా కొనసాగుతున్న ఈ సాహితీ గవాక్షం మొదటి సమావేశం వారింట్లోనే జరగడం తమకు గర్వ కారణం అన్నారు. సభకు అధ్యక్షత వహించిన యువ కవి శివచరణ్ గుండా ముందుగా బే ఏరియా ప్రముఖ కథా రచయిత, ఈ - మాట సంస్థాపకులు అయిన శ్రీ కె.వి. ఎస్. రామారావు గారిని ఆహ్వానించారు.
రామారావు ఈ - మాట తొలి
దశ నుండి ఇంత వరకూ దాదాపు పదిహేనేళ్ల
ప్రస్థానాన్ని సభలోని వారందరితో పంచుకున్నారు.
ఆస్టిన్ లైబ్రరీ లో తెలుగు విభాగం లో ఒంటరి
పాఠకుడిగా ఆలోచనలు ప్రారంభమైన కాలం నుండి
మిత్రులు కనక ప్రసాద్, కొంపెల్ల భాస్కర్,
లక్షణ్ ల తో స్నేహాన్ని , ‘ తెలుసా? ’ చాట్
గ్రూప్ ద్వారా ప్రారంభమైన పత్రికా చర్చ తరువాత
ఇంటర్నెట్ పత్రికగా తొలి సంచిక వెలువడే వరకు
పడిన శ్రమనంతా గుర్తుకు తెచ్చుకున్నారు. తొలి
సంచిక లో టెక్నికల్ సమస్యల గురించి
ప్రస్తావిస్తూ సరైన తెలుగు ఫాంట్ కూడా లేని
దశలో రాత ప్రతి ని జిప్ ఫైల్సుగా పెట్టామన్నారు.
మిత్రులు వేల్చేరు, వేలూరి, వేమూరి, జంపాల
చౌదరి, పెమ్మరాజు వేణుగోపాల్ తదితరులు విశేషంగా
పత్రికాభివృద్ధికి దోహదపడ్డారన్నారు. పేరొందిన
వ్యాసాల్ని అందిస్తూ, మంచి ప్రజాదరణ పొందిన
వెబ్ పత్రికగా తనకు ఈ - మాట
సంతృప్తినిస్తూందన్నారు. ఇక స్వీయ రచనా నేపధ్యం,
ప్రస్థానాన్ని గురించి చెప్తూ తొలి నాళ్ల నుంచీ
ఒక ప్రవాసాంధ్రుడిగా ప్రవాస సమస్యల్ని కథలుగా
మలచడం లోనే ఆసక్తి ఎక్కువ అన్నారు. అలా రాసిన
మొదటి కథ ‘ అదృష్టవంతుడు ’ గురించి, తర్వాత
రాసిన ‘ కూనిరాగం ’, స్టాక్ మార్కెట్ బూం
గురించి రాసిన ‘ పందెం ఎలక ’ మొ.లైన కథల
గురించి ప్రస్తావించారు. ఇక్కడి సమాజం లోని
క్రైం లలో తెలీక ఇరుక్కున్న అమాయక భారతీయులను
గురించి రాసిన మరిన్ని కథలను టూకీగా చెప్పారు.
శ్రోతలు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఇక్కడి
సమాజం లో పూర్తిగా భాగస్వాములు అయినప్పుడే
ఇక్కడి సమస్యలు ఎవరైనా కథలుగా మలచగలరని అన్నారు.
దాదాపు గంట పాటు సాగిన ప్రసంగాన్ని అంతా బహు
ఆసక్తిదాయకంగా విని ఆనందించారు.
ఆ తర్వాత కథా పఠన కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఆకెళ్ల కృష్ణకుమారి ‘ లెట్ గో ’ కథను వినిపించారు. కొడుకునీ, కోడల్నీ తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం కాకుండా వారి భావాలకు విలువనిస్తూ, స్వేచ్ఛగా వారికీ బాధ్యతని పంచగలిగితే బావుంటుందన్న సున్నితమైన కుటుంబ కథని చిన్న చమక్కు వాక్యంతో చెప్పి కథను మెప్పించారు. "బాగా ఆలస్యంగా కథా రచన ప్రారంభించాను కనుక సరిగా కథలు రాయడం రాదని "భావించే ఆమె చక్కని తేలిక పాటి ప్రవాహంలాంటి రచనా శైలితో అందర్నీ ఆకట్టుకున్నారు. తేనీటి విరామం తర్వాత వేమూరి బర్కిలీ విశ్వవిద్యాలయం లో తెలుగు విభాగం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతే ఏడేళ్ల నుంచీ జరిగిన అభివృద్ధి కుంటుబడుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఇతోధికంగా ప్రవసాంధ్రులు సహాయం చెయ్యమని, వివరాలకు తనను సంప్రదించమని సభాముఖంగా తెలియజేసారు. మంచి ముద్రణతో తయారైన "పెద్ద బాల శిక్ష" సరిక్రొత్త గ్రంధాన్ని విరాళం అందజేసిన వారికి ఉచితంగా కుమార్ కలగర గారు అందజేస్తారని పేర్కొన్నారు. తర్వాత కిరణ్ ప్రభ "భండారు అచ్చమాంబ" జీవిత విశేషాల్ని, అందించిన సాహితీ సేవను వివరిస్తూ నిరక్షరాశ్యురాలిగా పసి వయస్సులో పరిణయం తర్వాత ఆమె నాగపూరు నివాసాన్ని, భర్త మాధవరావు, తమ్ముడు కొమర్రాజు లక్ష్మణ రావుల ప్రోత్సాహంతో విద్యాభ్యాస, రచనా వ్యాసంగాన్ని ప్రారంభించడం, చిన్న వయసులో కష్టాలు అనుభవించడం, తన జీవితంలోని అంతులేని దు:ఖాన్ని అధిగమించి తెలుగు కథా చరిత్రలోనే తొలి కథ ‘ ధన త్రయోదశి ’ ని రాయడం మొదలైన విషయాలను కళ్లుకు కట్టినట్లు వివరించారు. నూరేళ్ల కిందట ఆమె రచించిన "అబలా సచ్చరిత్ర రత్నమాల" గొప్పతనాన్ని వివరించారు. పలువురికి సహాయం చెయ్యాలనే మంచి తలంపు కలిగిన ఆమె ప్లేగు బారిన పడి ముప్ఫై సం.రాల పిన్న వయస్సులో మరణించడం దురదృష్టకరం అన్నారు. కవి సమ్మేళనం లో అపర్ణ గునుపూడి తనకు బాగా నచ్చిన తన తొలి కవిత వినిపించారు, కె.గీత భూగోళానికటూ ఇటూ హృదయాలలో "ప్రవహించే సూర్యోదయం" కవితని, కె.గిరిధర్ "పావురాల వాన", శివచరణ్ "నేనూ సైనికుణ్నే" కవితలు వినిపించారు. చివరగా కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ కార్యక్రమంతో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశంలో మృత్యుంజయుడు తాటిపామల, ప్రసాద్ నల్లమోతు తదితరులు పాల్గొన్నారు.
http://www.koumudi.net/Monthly/2014/january/jan_2014_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan14/veekshanam.html |
Thursday 2 January 2014
వీక్షణం సాహితీ గవాక్షం -16 (Dec 15, 2013)
వీక్షణం సాహితీ గవాక్షం -15 (Nov 10, 2013)
ఈ నెల "వీక్షణం"సమావేశం పాలో ఆల్టో లోని అపర్ణ
గునుపూడి గారి ఇంట్లో జరిగింది. నవంబర్ పది
ఆదివారం సాయంత్రం మూడు గంటల పాటు తెలుగు
మిత్రులు సాహిత్య ముచ్చట్లను రసోల్లాసంగా
పంచుకున్నారు. చిరంజీవి రంజని పాడిన "దండమూ
పెట్టేను చూడరా, కొదండపాణీ చూడరా "అనే
మంగళప్రద మైన త్యాగరాజ కీర్తన తో సభకు శుభారంభం
జరిగింది. మన తెలుగు భాషను అజరామరం చేసిన
కర్ణాటక సంగీతాన్ని తలచుకుంటూ, "ఊరు వారూ వీధి
వారూ ఒక్క జాతివారూ"అన్న కృతి పరమార్థ సాదృశ
స్వరూపాన్ని సభకు ఆపాదిస్తూ, మనమందరం సాహితీ
వర్గానికి చెందిన ఒక్కజాతి వారమే నంటూ అపర్ణ
గారు సభను సంబోధించడం ఒక చక్కని ఆహ్వానం.
శ్రీ వేలూరు వెంకటేశ్వర రావు గారి అద్యక్షతన, అపర్ణ గారి సందర్భోచిత సహకారం తో సభ ఆత్మీయంగా కొనసాగింది.
మొదట శ్రీమతి కర్రా విజయ గారు తన కథ ను
వినిపించారు. కథ ఆలోచింప జేసేదిగా వుంది. కథా
సంవిధానం, క్రమానుగత కథా కథన రీతి ఉత్కంఠను
రేపేదిగా వుంది. "సాయంత్రం క్షేమంగా ఇల్లు
చేరుకున్న ఈడొచ్చిన కూతురు కళ్ళ ముందున్నా,
టెలిఫోన్లో అవతలి వైపున అసహాయ స్థితిలో ఉన్న
కూతురు లాంటి అమ్మాయి ఎవరో 'తనను ఇంటికి
రానివ్వు నాన్నా' అని ప్రాధేయ పడుతుంటే
సున్నిత మైన తండ్రి సందిగ్ధ హృదయం కాదనలేక
పోయింది." అదీ కథకు కొస మెరుపు. చక్కని ముగింపు.
తరువాత, ప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి రాధిక
తన స్వీయ కథా సంకలనం "కథా స్రవంతి" నుండి రెండు
కథలను చదివి వినిపించారు.మొదటిది "ఆంతర్యం"-ఆకాశవాణి
లో 2001లో ప్రసారమైన ప్రసిద్ధ కథ. రెండవది "మాస్టారికో
శిక్ష"-89 లో ఆంధ్రప్రభ లో ప్రచురిత మైన
పాపులర్ కథ. సుమారు 500 కథలు రాసి రాష్ట్ర
ప్రభుత్వ పురస్కారం పొందిన రాధిక గారు తన తొలి
సృజన కాలం నాటి పాత సంగతులను, మధురాంతకం రాజారాం
వంటి పెద్దల నుండి పొందిన మన్ననలను
తలచుకున్నారు.
తర్వాత శ్రీ రాయసం గణపతి శాస్త్రి గారు మల్లాది
వెంకటకృష్ణమూర్తి , యండమూరి వీరేంద్రనాథ్
సాహిత్యం గురించి ప్రసంగించారు.మల్లాది వారి
రచనలలో పాఠకులను ఆఖరుదాకా ఆపకుండా చదివించే
రీడబిలిటీ లక్షణం ఉందని, "డబ్బెవరికి చేదు"
నవలను ఉదహరిస్తూ తెలిపారు. వారు అపరాధ పరిశోధక
కథలే కాక శృంగార పరమైన నవలలు,ఆద్యాత్మిక కథలు,
ట్రావెలాగ్స్, భజగోవింద వ్యాఖ్యానం, తుదకు
హాస్యరస భరితమైన విషయాలను కూడా వదలకుండా సుమారు
150 పుస్తకాలు రచించారని వివరించారు.
వీరేంద్రనాథ్ రచనల గురించి మాట్లాడుతూ అవన్నీ
ఇంగ్లీషు రచనల కాపీలని అపవాదు ఉందని ,అయినా
వారు పలు పుస్తకాలు ప్రచురించారని తెలిపారు.
వారి రచనలు యువ పాఠకులను ఇట్టే ఆకర్షిస్తాయని
అన్నారు. తులసి, తులసీదళం, వెన్నెల్లో ఆడపిల్ల,
యుగాంతం లాంటి 49 నవలలు రాసారని పొగిడారు. ఐతే,
కొందరు శ్రోతలు యండమూరి వి అసలు సాహిత్య
విలువలున్న రచనలే కాదని, అవి కేవలం marketable
commercial pulp writings లనీ ,దిగజారుడు
క్షుద్ర సాహిత్యమనీ, ఆకర్షణీయమైన శైలి అబ్బింది
కనుక వారు తన art of selfishness ను చల్లగా
సొమ్ము చేసుకున్నారని విరుచుకుపడ్డారు.
అయినప్పటికీ ఈ చర్చ అందరినీ ఆకర్షిందని చెప్పక
తప్పదు.
ఆతర్వాత,మహ్మద్ ఇఖ్బాల్ గారు అరబ్బీ,పర్షియన్,
హిబ్రూ లాంటి semitic భాషలు, ఉర్దూ, సంస్కృత
భాషల వంటి indo aaryan భాషలలోని కొన్ని పదాల
మూలాల గురించి, వాటి వ్యుత్పత్తుల గురించి, ఆ
పదాల మాతృకల గురించి వివరించే ప్రయత్నం
చేశారు.సంస్కృత పదాలు శబ్ద/నాద ప్రాతిపదికలనీ,
అందుకు భిన్నంగా అరబిక్ మాటలకు శబ్ద మూలాలతో
సంబంధం లేదని తెలిపారు.ఇంగ్లీషు భాష natural
growth కు చెందిన భాష కాదన్నారు. caligraphy
అరబిక్ భాసను సుసంపన్నం చేసే దిశగా అత్యంత
దోహదకారి అయిందన్నారు. hindustaani ఉత్తరభారత
వాడుక భాషగా రూపొందించబడినది అయినందు వలన (ఇండోఆర్యన్
భాషా మూలాలు ఉన్నప్పటికీ ) అది భారతీయ భాషనే
అని అన్నారు. అరబిక్ పదాలకు మూడు అక్షరాల
ధాతువులు మూలాధారాలని, ఆధాతువులు 14 స్థాయిలలో
(scales) ఉంటాయని, ప్రత్యయాల (suffix/affix)
తో కలసి వేలాది పదాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు.
తన ప్రస్తుత ప్రసంగాన్ని 'ఖాయం','జమ' అనే రెండు
పదాల ప్రాగ్రూప విశ్లేషణ కే పరిమితం
చేస్తున్నానని, తదనంతర సమావేశాలలో పదాల సంఖ్యనూ,
విశ్లేషణనూ విస్తృతం చేస్తానని తెలిపారు.
తర్వాతి కార్యక్రమం కవిసమ్మేళనం. మొదట కె. గీత
గారు వారి స్వీయకవితా సంకలనం "శతాబ్ది వెన్నెల"
నుండి ఒక చక్కని వచన కవిత 'ఎగిరొచ్చిన ఇల్లు'
వినిపించారు. కవిత లో "ఆనంద నిలయం ఐన తన ఇంట్లో
వెచ్చని సూర్యుడు మా అరచేతుల్లో వికసిస్తాడని,
ఇంట్లో ప్రవహించే సెలయేళ్ళు ఉన్నాయని" బహు
రమ్యం గా వర్ణించారు.పిదప నాగరాజు రామస్వామి
తన స్వీయ కవితా సంకలనం "ఓనమాలు'', అనువాద కవితా
సంకలనం 'అనుధ్వని' నుండి ఒక్కొక్క కవిత
వినిపించారు. తర్వాత రాకేశ్వర్ రావు "జెట్లాగ్"
ఒక సంసృత స్వీయ రచనను వినిపించి దానికి తన
తెలుగు సేతను కూడా జతపరచడం విశేషం.
ఆనవాయితీగా వస్తున్నక్విజ్ కార్యక్రమాన్ని శ్రీ కిరణ్ ప్రభ గారు సమర్థ వంతంగా నిర్వహించి సభలో ఉత్సాహాన్ని ఇనుమడింప జేశారు.
ఆఖరు గా ఫోటో సెషన్, అపర్ణ సుబ్బారావు గార్ల
కమ్మని స్నాక్ విందు, రాయసం కృష్ణ కాంత్ పాడిన
పసందైన పాటల శ్రావ్యత ! ఈ సమావేశం చక్కని
సాయంత్రాన్ని స్వంతం చేసుకున్నామన్న సంతృప్తిని
అందరిలో మిగిల్చింది. ఈ కవితా గవాక్ష వీక్షణం
చిరకాలం ఇలాగే కొనసాగుతుందనడంలో సందేహం లేదు.
--నాగరాజు రామస్వామి.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec13/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2013/december/dec_2013_vyAsakoumudi_vikshanam.pdf
|
వీక్షణం 14 వ సమావేశం(Oct 13, 2013)
వీక్షణం
14 వ సమావేశం ఫ్రీమౌంట్
లో శ్రీ వంశీ ప్రఖ్యా ఆతిథ్యంలో జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా వంశీ ముందుగా కథా రచయిత
శ్రీ బి.పి కరుణాకర్ గారిని ఆహ్వానించారు. కరుణాకర్ తన రచనలకు ప్రేరణ గా నిలిచిన పాశ్చాత్య
కథల గురించి చెబ్తూ చెకోవ్ కథలను ప్రస్తావించారు.
కథకు చివర ముగింపు ఎప్పుడూ పాఠకుణ్ణి ఆలోచింపజేసేదిగా ఉండే లక్షణం తాను అటువంటి
రచయితల నుండి అలవరచుకున్నానని తెలిపారు. ఇక కథల్లోని పాత్రధారులు మన చుట్టూ పరిభ్రమించే
మన ప్రపంచం నుంచే పుడతారని గుర్తు చేసారు. స్వీయ కథ లలో నుంచి "పొగ" అనే
కథ ను కళ్లకు కట్టినట్లు వినిపించారు. ఈ కథను డబ్బుకు, మానవీయ విలువలకు ఉన్న ప్రత్యక్ష సంఘర్షణను
సన్నివేశ చిత్రాల ద్వారా ఎలా చెప్పొచ్చో ఉదాహరణ గా పేర్కొన్నారు.
ఆ
తరువాత శ్రీ మహమ్మద్ ఇక్బాల్ "నన్నయ్య కవితా రీతులను" గురించి వివరంగా పరిశోధనాత్మక
ప్రసంగం చేసారు. నన్నయ్యకు పూర్వం కవిత్వం ఎలా ఉండేదో శాసనాల ద్వారా లభ్యమైన సమాచారాన్ని, నన్నయ్య ను భారతాంధ్రీకరణకు పురిగొల్పిన
పరిస్థితులను, భారత
రచనా పద్ధతుల్లో కవిత్రయానికున్న విలక్షణతను
సోదాహరణంగా వివరించారు. ఇక నన్నయ్య కవితా రీతులైన "ప్రసన్న కథా కలితార్థ
యుక్తి", "అక్షర
రమ్యత", "నానా
రుచిరార్థ సూక్తి నిధిత్వము" భారత రచన లో చోటు చేసుకున్న విధానాన్ని చక్కగా వివరించారు.
ఆ
తర్వాత శ్రీ కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన క్విజ్ కార్యక్రమం సభ లో హాజరైన వారిని ఆనందంతో
ఉత్తేజితుల్ని చేసింది. సాహిత్య ప్రధాన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి పుస్తకాలు
బహుమానం గా అందాయి.
ప్రతీ సారీ జరిగే క్విజ్ కార్యక్రమం లో ఇలా పుస్తకాలు బహుమతిగా ఇచ్చే వీలు కోసం సభ్యులను తమ గ్రంధాలయంలో నిల్వ ఉన్న పుస్తకాలను "వీక్షణం గ్రంథాలయానికి" తెచ్చి ఇవ్వమని ఈ సందర్భంగా కిరణ్ ప్రభ గుర్తు చేసారు. ఈ సారి సమావేశం లో బహుమతి పుస్తకాలను శ్రీమతి కె.శారద అందజేశారు.
ప్రతీ సారీ జరిగే క్విజ్ కార్యక్రమం లో ఇలా పుస్తకాలు బహుమతిగా ఇచ్చే వీలు కోసం సభ్యులను తమ గ్రంధాలయంలో నిల్వ ఉన్న పుస్తకాలను "వీక్షణం గ్రంథాలయానికి" తెచ్చి ఇవ్వమని ఈ సందర్భంగా కిరణ్ ప్రభ గుర్తు చేసారు. ఈ సారి సమావేశం లో బహుమతి పుస్తకాలను శ్రీమతి కె.శారద అందజేశారు.
దసరా
రోజున జరిగిన సమావేశం కావడం తో ఈ సారి వీక్షణం సభ సాహితీ మిత్రులతో సరదా పండుగగా సాగింది.
శ్రీమతి
వంశీ పిండి వంటలతో విందు చేసారు.
కవి
సమ్మేళనం లో డా|| కె.గీత
పాప ను బడి నుంచి తీసుకు వచ్చే దృశ్యాన్ని ఆవిష్కరించే "బడి పాపాయి" కవితను చదివి వినిపించారు. వంశీ ప్రకృతి పరమైన కవితల్ని
వినిపించారు. ఈ సభకు శ్రీ వేమూరి, శ్రీ పిల్లల మర్రి, శ్రీ రాజేంద్ర, శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీమతి రాధిక, శ్రీ ప్రసాద్ మొ.న వారు హాజరయ్యారు. వచ్చే
సమావేశం పాలో ఆల్టో లోని శ్రీమతి గునుపూడి అపర్ణ గారింట్లో జరగనుందని గీత ప్రకటించారు.
http://koumudi.net/Monthly/2013/november/nov_2013_vyAsakoumudi_vikshanam.pdf
Subscribe to:
Posts (Atom)