Thursday 2 January 2014

వీక్షణం సాహితీ గవాక్షం -15 (Nov 10, 2013)


 
ఈ నెల "వీక్షణం"సమావేశం పాలో ఆల్టో లోని అపర్ణ గునుపూడి గారి ఇంట్లో జరిగింది. నవంబర్ పది ఆదివారం సాయంత్రం మూడు గంటల పాటు తెలుగు మిత్రులు సాహిత్య ముచ్చట్లను రసోల్లాసంగా పంచుకున్నారు. చిరంజీవి రంజని పాడిన "దండమూ పెట్టేను చూడరా, కొదండపాణీ చూడరా "అనే మంగళప్రద మైన త్యాగరాజ కీర్తన తో సభకు శుభారంభం జరిగింది. మన తెలుగు భాషను అజరామరం చేసిన కర్ణాటక సంగీతాన్ని తలచుకుంటూ, "ఊరు వారూ వీధి వారూ ఒక్క జాతివారూ"అన్న కృతి పరమార్థ సాదృశ స్వరూపాన్ని సభకు ఆపాదిస్తూ, మనమందరం సాహితీ వర్గానికి చెందిన ఒక్కజాతి వారమే నంటూ అపర్ణ గారు సభను సంబోధించడం ఒక చక్కని ఆహ్వానం.

శ్రీ వేలూరు వెంకటేశ్వర రావు గారి అద్యక్షతన, అపర్ణ గారి సందర్భోచిత సహకారం తో సభ ఆత్మీయంగా కొనసాగింది.
మొదట శ్రీమతి కర్రా విజయ గారు తన కథ ను వినిపించారు. కథ ఆలోచింప జేసేదిగా వుంది. కథా సంవిధానం, క్రమానుగత కథా కథన రీతి ఉత్కంఠను రేపేదిగా వుంది. "సాయంత్రం క్షేమంగా ఇల్లు చేరుకున్న ఈడొచ్చిన కూతురు కళ్ళ ముందున్నా, టెలిఫోన్లో అవతలి వైపున అసహాయ స్థితిలో ఉన్న కూతురు లాంటి అమ్మాయి ఎవరో 'తనను ఇంటికి రానివ్వు నాన్నా' అని ప్రాధేయ పడుతుంటే సున్నిత మైన తండ్రి సందిగ్ధ హృదయం కాదనలేక పోయింది." అదీ కథకు కొస మెరుపు. చక్కని ముగింపు.
తరువాత, ప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి రాధిక తన స్వీయ కథా సంకలనం "కథా స్రవంతి" నుండి రెండు కథలను చదివి వినిపించారు.మొదటిది "ఆంతర్యం"-ఆకాశవాణి లో 2001లో ప్రసారమైన ప్రసిద్ధ కథ. రెండవది "మాస్టారికో శిక్ష"-89 లో ఆంధ్రప్రభ లో ప్రచురిత మైన పాపులర్ కథ. సుమారు 500 కథలు రాసి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం పొందిన రాధిక గారు తన తొలి సృజన కాలం నాటి పాత సంగతులను, మధురాంతకం రాజారాం వంటి పెద్దల నుండి పొందిన మన్ననలను తలచుకున్నారు.
తర్వాత శ్రీ రాయసం గణపతి శాస్త్రి గారు మల్లాది వెంకటకృష్ణమూర్తి , యండమూరి వీరేంద్రనాథ్ సాహిత్యం గురించి ప్రసంగించారు.మల్లాది వారి రచనలలో పాఠకులను ఆఖరుదాకా ఆపకుండా చదివించే రీడబిలిటీ లక్షణం ఉందని, "డబ్బెవరికి చేదు" నవలను ఉదహరిస్తూ తెలిపారు. వారు అపరాధ పరిశోధక కథలే కాక శృంగార పరమైన నవలలు,ఆద్యాత్మిక కథలు, ట్రావెలాగ్స్, భజగోవింద వ్యాఖ్యానం, తుదకు హాస్యరస భరితమైన విషయాలను కూడా వదలకుండా సుమారు 150 పుస్తకాలు రచించారని వివరించారు.
వీరేంద్రనాథ్ రచనల గురించి మాట్లాడుతూ అవన్నీ ఇంగ్లీషు రచనల కాపీలని అపవాదు ఉందని ,అయినా వారు పలు పుస్తకాలు ప్రచురించారని తెలిపారు. వారి రచనలు యువ పాఠకులను ఇట్టే ఆకర్షిస్తాయని అన్నారు. తులసి, తులసీదళం, వెన్నెల్లో ఆడపిల్ల, యుగాంతం లాంటి 49 నవలలు రాసారని పొగిడారు. ఐతే, కొందరు శ్రోతలు యండమూరి వి అసలు సాహిత్య విలువలున్న రచనలే కాదని, అవి కేవలం marketable commercial pulp writings లనీ ,దిగజారుడు క్షుద్ర సాహిత్యమనీ, ఆకర్షణీయమైన శైలి అబ్బింది కనుక వారు తన art of selfishness ను చల్లగా సొమ్ము చేసుకున్నారని విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఈ చర్చ అందరినీ ఆకర్షిందని చెప్పక తప్పదు.
ఆతర్వాత,మహ్మద్ ఇఖ్బాల్ గారు అరబ్బీ,పర్షియన్, హిబ్రూ లాంటి semitic భాషలు, ఉర్దూ, సంస్కృత భాషల వంటి indo aaryan భాషలలోని కొన్ని పదాల మూలాల గురించి, వాటి వ్యుత్పత్తుల గురించి, ఆ పదాల మాతృకల గురించి వివరించే ప్రయత్నం చేశారు.సంస్కృత పదాలు శబ్ద/నాద ప్రాతిపదికలనీ, అందుకు భిన్నంగా అరబిక్ మాటలకు శబ్ద మూలాలతో సంబంధం లేదని తెలిపారు.ఇంగ్లీషు భాష natural growth కు చెందిన భాష కాదన్నారు. caligraphy అరబిక్ భాసను సుసంపన్నం చేసే దిశగా అత్యంత దోహదకారి అయిందన్నారు. hindustaani ఉత్తరభారత వాడుక భాషగా రూపొందించబడినది అయినందు వలన (ఇండోఆర్యన్ భాషా మూలాలు ఉన్నప్పటికీ ) అది భారతీయ భాషనే అని అన్నారు. అరబిక్ పదాలకు మూడు అక్షరాల ధాతువులు మూలాధారాలని, ఆధాతువులు 14 స్థాయిలలో (scales) ఉంటాయని, ప్రత్యయాల (suffix/affix) తో కలసి వేలాది పదాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. తన ప్రస్తుత ప్రసంగాన్ని 'ఖాయం','జమ' అనే రెండు పదాల ప్రాగ్రూప విశ్లేషణ కే పరిమితం చేస్తున్నానని, తదనంతర సమావేశాలలో పదాల సంఖ్యనూ, విశ్లేషణనూ విస్తృతం చేస్తానని తెలిపారు.
తర్వాతి కార్యక్రమం కవిసమ్మేళనం. మొదట కె. గీత గారు వారి స్వీయకవితా సంకలనం "శతాబ్ది వెన్నెల" నుండి ఒక చక్కని వచన కవిత 'ఎగిరొచ్చిన ఇల్లు' వినిపించారు. కవిత లో "ఆనంద నిలయం ఐన తన ఇంట్లో వెచ్చని సూర్యుడు మా అరచేతుల్లో వికసిస్తాడని, ఇంట్లో ప్రవహించే సెలయేళ్ళు ఉన్నాయని" బహు రమ్యం గా వర్ణించారు.పిదప నాగరాజు రామస్వామి తన స్వీయ కవితా సంకలనం "ఓనమాలు'', అనువాద కవితా సంకలనం 'అనుధ్వని' నుండి ఒక్కొక్క కవిత వినిపించారు. తర్వాత రాకేశ్వర్ రావు "జెట్లాగ్" ఒక సంసృత స్వీయ రచనను వినిపించి దానికి తన తెలుగు సేతను కూడా జతపరచడం విశేషం.

ఆనవాయితీగా వస్తున్నక్విజ్ కార్యక్రమాన్ని శ్రీ కిరణ్ ప్రభ గారు సమర్థ వంతంగా నిర్వహించి సభలో ఉత్సాహాన్ని ఇనుమడింప జేశారు.
ఆఖరు గా ఫోటో సెషన్, అపర్ణ సుబ్బారావు గార్ల కమ్మని స్నాక్ విందు, రాయసం కృష్ణ కాంత్ పాడిన పసందైన పాటల శ్రావ్యత ! ఈ సమావేశం చక్కని సాయంత్రాన్ని స్వంతం చేసుకున్నామన్న సంతృప్తిని అందరిలో మిగిల్చింది. ఈ కవితా గవాక్ష వీక్షణం చిరకాలం ఇలాగే కొనసాగుతుందనడంలో సందేహం లేదు.
--నాగరాజు రామస్వామి.
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec13/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2013/december/dec_2013_vyAsakoumudi_vikshanam.pdf

No comments:

Post a Comment