Thursday 2 January 2014

వీక్షణం సాహితీ గవాక్షం -16 (Dec 15, 2013)



 
 
వీక్షణం పదహారవ సాహితీ సమావేశం ప్లెసంటన్ లోని వేమూరి గారింట్లో జరిగింది. సభకు ఆహ్వానం పలుకుతూ వేమూరి పదహారు నెలలుగా నెలనెలా కొనసాగుతున్న ఈ సాహితీ గవాక్షం మొదటి సమావేశం వారింట్లోనే జరగడం తమకు గర్వ కారణం అన్నారు. సభకు అధ్యక్షత వహించిన యువ కవి శివచరణ్ గుండా ముందుగా బే ఏరియా ప్రముఖ కథా రచయిత, ఈ - మాట సంస్థాపకులు అయిన శ్రీ కె.వి. ఎస్. రామారావు గారిని ఆహ్వానించారు.
రామారావు ఈ - మాట తొలి దశ నుండి ఇంత వరకూ దాదాపు పదిహేనేళ్ల ప్రస్థానాన్ని సభలోని వారందరితో పంచుకున్నారు. ఆస్టిన్ లైబ్రరీ లో తెలుగు విభాగం లో ఒంటరి పాఠకుడిగా ఆలోచనలు ప్రారంభమైన కాలం నుండి మిత్రులు కనక ప్రసాద్, కొంపెల్ల భాస్కర్, లక్షణ్ ల తో స్నేహాన్ని , ‘ తెలుసా? ’ చాట్ గ్రూప్ ద్వారా ప్రారంభమైన పత్రికా చర్చ తరువాత ఇంటర్నెట్ పత్రికగా తొలి సంచిక వెలువడే వరకు పడిన శ్రమనంతా గుర్తుకు తెచ్చుకున్నారు. తొలి సంచిక లో టెక్నికల్ సమస్యల గురించి ప్రస్తావిస్తూ సరైన తెలుగు ఫాంట్ కూడా లేని దశలో రాత ప్రతి ని జిప్ ఫైల్సుగా పెట్టామన్నారు. మిత్రులు వేల్చేరు, వేలూరి, వేమూరి, జంపాల చౌదరి, పెమ్మరాజు వేణుగోపాల్ తదితరులు విశేషంగా పత్రికాభివృద్ధికి దోహదపడ్డారన్నారు. పేరొందిన వ్యాసాల్ని అందిస్తూ, మంచి ప్రజాదరణ పొందిన వెబ్ పత్రికగా తనకు ఈ - మాట సంతృప్తినిస్తూందన్నారు. ఇక స్వీయ రచనా నేపధ్యం, ప్రస్థానాన్ని గురించి చెప్తూ తొలి నాళ్ల నుంచీ ఒక ప్రవాసాంధ్రుడిగా ప్రవాస సమస్యల్ని కథలుగా మలచడం లోనే ఆసక్తి ఎక్కువ అన్నారు. అలా రాసిన మొదటి కథ ‘ అదృష్టవంతుడు ’ గురించి, తర్వాత రాసిన ‘ కూనిరాగం ’, స్టాక్ మార్కెట్ బూం గురించి రాసిన ‘ పందెం ఎలక ’ మొ.లైన కథల గురించి ప్రస్తావించారు. ఇక్కడి సమాజం లోని క్రైం లలో తెలీక ఇరుక్కున్న అమాయక భారతీయులను గురించి రాసిన మరిన్ని కథలను టూకీగా చెప్పారు. శ్రోతలు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఇక్కడి సమాజం లో పూర్తిగా భాగస్వాములు అయినప్పుడే ఇక్కడి సమస్యలు ఎవరైనా కథలుగా మలచగలరని అన్నారు. దాదాపు గంట పాటు సాగిన ప్రసంగాన్ని అంతా బహు ఆసక్తిదాయకంగా విని ఆనందించారు.

ఆ తర్వాత కథా పఠన కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఆకెళ్ల కృష్ణకుమారి ‘ లెట్ గో ’ కథను వినిపించారు. కొడుకునీ, కోడల్నీ తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడం కాకుండా వారి భావాలకు విలువనిస్తూ, స్వేచ్ఛగా వారికీ బాధ్యతని పంచగలిగితే బావుంటుందన్న సున్నితమైన కుటుంబ కథని చిన్న చమక్కు వాక్యంతో చెప్పి కథను మెప్పించారు. "బాగా ఆలస్యంగా కథా రచన ప్రారంభించాను కనుక సరిగా కథలు రాయడం రాదని "భావించే ఆమె చక్కని తేలిక పాటి ప్రవాహంలాంటి రచనా శైలితో అందర్నీ ఆకట్టుకున్నారు.


తేనీటి విరామం తర్వాత వేమూరి బర్కిలీ విశ్వవిద్యాలయం లో తెలుగు విభాగం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతే ఏడేళ్ల నుంచీ జరిగిన అభివృద్ధి కుంటుబడుతుందని ఆవేదన వెలిబుచ్చారు. ఇతోధికంగా ప్రవసాంధ్రులు సహాయం చెయ్యమని, వివరాలకు తనను సంప్రదించమని సభాముఖంగా తెలియజేసారు. మంచి ముద్రణతో తయారైన "పెద్ద బాల శిక్ష" సరిక్రొత్త గ్రంధాన్ని విరాళం అందజేసిన వారికి ఉచితంగా కుమార్ కలగర గారు అందజేస్తారని పేర్కొన్నారు.

తర్వాత కిరణ్ ప్రభ "భండారు అచ్చమాంబ" జీవిత విశేషాల్ని, అందించిన సాహితీ సేవను వివరిస్తూ నిరక్షరాశ్యురాలిగా పసి వయస్సులో పరిణయం తర్వాత ఆమె నాగపూరు నివాసాన్ని, భర్త మాధవరావు, తమ్ముడు కొమర్రాజు లక్ష్మణ రావుల ప్రోత్సాహంతో విద్యాభ్యాస, రచనా వ్యాసంగాన్ని ప్రారంభించడం, చిన్న వయసులో కష్టాలు అనుభవించడం, తన జీవితంలోని అంతులేని దు:ఖాన్ని అధిగమించి తెలుగు కథా చరిత్రలోనే తొలి కథ ‘ ధన త్రయోదశి ’ ని రాయడం మొదలైన విషయాలను కళ్లుకు కట్టినట్లు వివరించారు. నూరేళ్ల కిందట ఆమె రచించిన "అబలా సచ్చరిత్ర రత్నమాల" గొప్పతనాన్ని వివరించారు. పలువురికి సహాయం చెయ్యాలనే మంచి తలంపు కలిగిన ఆమె ప్లేగు బారిన పడి ముప్ఫై సం.రాల పిన్న వయస్సులో మరణించడం దురదృష్టకరం అన్నారు.

కవి సమ్మేళనం లో అపర్ణ గునుపూడి తనకు బాగా నచ్చిన తన తొలి కవిత వినిపించారు, కె.గీత భూగోళానికటూ ఇటూ హృదయాలలో "ప్రవహించే సూర్యోదయం" కవితని, కె.గిరిధర్ "పావురాల వాన", శివచరణ్ "నేనూ సైనికుణ్నే" కవితలు వినిపించారు. చివరగా కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ కార్యక్రమంతో ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశంలో మృత్యుంజయుడు తాటిపామల, ప్రసాద్ నల్లమోతు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment