Thursday 2 January 2014

వీక్షణం 14 వ సమావేశం(Oct 13, 2013)



వీక్షణం 14 వ సమావేశం ఫ్రీమౌంట్ లో శ్రీ వంశీ ప్రఖ్యా ఆతిథ్యంలో జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా వంశీ ముందుగా కథా రచయిత శ్రీ బి.పి కరుణాకర్ గారిని ఆహ్వానించారు. కరుణాకర్ తన రచనలకు ప్రేరణ గా నిలిచిన పాశ్చాత్య కథల గురించి చెబ్తూ చెకోవ్ కథలను ప్రస్తావించారు.  కథకు చివర ముగింపు ఎప్పుడూ పాఠకుణ్ణి ఆలోచింపజేసేదిగా ఉండే లక్షణం తాను అటువంటి రచయితల నుండి అలవరచుకున్నానని తెలిపారు. ఇక కథల్లోని పాత్రధారులు మన చుట్టూ పరిభ్రమించే మన ప్రపంచం నుంచే పుడతారని గుర్తు చేసారు. స్వీయ కథ లలో నుంచి "పొగ" అనే కథ ను కళ్లకు కట్టినట్లు వినిపించారు. ఈ కథను డబ్బుకు, మానవీయ విలువలకు ఉన్న ప్రత్యక్ష సంఘర్షణను సన్నివేశ చిత్రాల ద్వారా ఎలా చెప్పొచ్చో ఉదాహరణ గా పేర్కొన్నారు.

ఆ తరువాత శ్రీ మహమ్మద్ ఇక్బాల్ "నన్నయ్య కవితా రీతులను" గురించి వివరంగా పరిశోధనాత్మక ప్రసంగం చేసారు. నన్నయ్యకు పూర్వం కవిత్వం ఎలా ఉండేదో  శాసనాల ద్వారా లభ్యమైన సమాచారాన్ని, నన్నయ్య ను భారతాంధ్రీకరణకు పురిగొల్పిన పరిస్థితులను, భారత రచనా పద్ధతుల్లో కవిత్రయానికున్న విలక్షణతను  సోదాహరణంగా వివరించారు. ఇక నన్నయ్య కవితా రీతులైన "ప్రసన్న కథా కలితార్థ యుక్తి", "అక్షర రమ్యత", "నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము" భారత రచన లో చోటు చేసుకున్న విధానాన్ని చక్కగా వివరించారు.
ఆ తర్వాత శ్రీ కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన క్విజ్ కార్యక్రమం సభ లో హాజరైన వారిని ఆనందంతో ఉత్తేజితుల్ని చేసింది. సాహిత్య ప్రధాన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి పుస్తకాలు బహుమానం గా అందాయి. 

ప్రతీ సారీ జరిగే క్విజ్ కార్యక్రమం లో ఇలా పుస్తకాలు బహుమతిగా ఇచ్చే వీలు కోసం సభ్యులను తమ గ్రంధాలయంలో నిల్వ ఉన్న పుస్తకాలను "వీక్షణం గ్రంథాలయానికి" తెచ్చి ఇవ్వమని ఈ సందర్భంగా కిరణ్ ప్రభ గుర్తు చేసారు. ఈ సారి సమావేశం లో బహుమతి పుస్తకాలను  శ్రీమతి కె.శారద అందజేశారు. 
దసరా రోజున జరిగిన సమావేశం కావడం తో ఈ సారి వీక్షణం సభ సాహితీ మిత్రులతో సరదా పండుగగా సాగింది.
శ్రీమతి వంశీ పిండి వంటలతో విందు చేసారు.
కవి సమ్మేళనం లో డా|| కె.గీత పాప ను బడి నుంచి తీసుకు వచ్చే దృశ్యాన్ని ఆవిష్కరించే "బడి పాపాయి" కవితను  చదివి వినిపించారు. వంశీ ప్రకృతి పరమైన కవితల్ని వినిపించారు.  ఈ సభకు శ్రీ వేమూరి, శ్రీ పిల్లల మర్రి, శ్రీ రాజేంద్ర, శ్రీమతి గునుపూడి అపర్ణ, శ్రీమతి రాధిక, శ్రీ ప్రసాద్ మొ.న వారు హాజరయ్యారు. వచ్చే సమావేశం పాలో ఆల్టో లోని శ్రీమతి గునుపూడి అపర్ణ గారింట్లో జరగనుందని గీత ప్రకటించారు.
 

http://koumudi.net/Monthly/2013/november/nov_2013_vyAsakoumudi_vikshanam.pdf

No comments:

Post a Comment