Monday 28 December 2015

వీక్షణం సాహితీ గవాక్షం - 32 (Apr,19-2015)



వీక్షణం సాహితీ గవాక్షం - 32


-‘విద్వాన్’ విజయాచార్య

ఈ నెల 4-19-15 ఆదివారం ‘ వీక్షణం’ సమావేశం ప్రముఖ కథా రచయిత ‘ బి.పి. కరుణాకర్’ గారి అమ్మాయి గారి ఇంట్లో రస రమ్య భరితంగా, కథా కథన కుతూహలంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ ‘విద్వాన్’ టి.పి. యన్. ఆచార్యులు గారు అధ్యక్ష స్థానాన్ని అలంకరించి, సభా కార్యక్రమాలు నిర్వహించారు.

ముందుగా శ్రీ కరుణాకర్ గారు వారి నాలుగు కథా సంపుటాలని సభకి పరిచయం చేసి, రచనా నేపధ్యాన్ని సోదాహరణంగా వివరించేరు. నేటి యాంత్రిక జీవితంలో పుస్తకం చదవడం గొప్ప ఉపశమనం అని తెలిపి “ రెల్లు” కథలోని ‘సరోజని, రాజ రత్నం ‘ పాత్రల చిత్రీకరణలో రచయిత తన అంతరంగ కథనాన్ని ,మానసిక విశ్లేషణల్నిశ్రోతలకి వివరించారు. శ్రీ కరుణాకర్ గారు ”రెల్లుపూల”ని జీవితానికి అన్వయింపజేసి, సమన్వయ పరచిన విధానం శ్రోతల్ని ఆలోచింప జేసింది. అట్లే ‘ అంబాలీస్' అనే ఆటని తమ కథల పుస్తకానికి పేరుగా పెట్టడం క్రొత్తగా ఉంది.
ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి వరలక్ష్మి గారు కరుణాకర్ గారి కథలలోని ఆర్ద్రత, శైలి గొప్పగా ఉంటుంది అని కొనియాడగా, కరుణాకర్ గారు వరలక్ష్మిగారి కథలు నూతనత్వం తో హృదయానికి హత్తుకొనే విధంగా ఉంటాయని తెలపడం నేటి సభలో ప్రత్యేకత. ఇంకా ‘కౌముది’ అంతర్జాల పత్రిక సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభగారు కరుణాకర్ గారి కథలలోని రచనా విన్యాసాలని సోదాహరణంగా వివరించారు. డా|| కె. గీతగారు కరుణాకర్ గారి ‘ఎదురు నీడ’ ‘పొగ’ కథలను చదివి సభికులను అలరించారు.

తదుపరి జరిగిన చర్చలో శ్రీ ఇక్బాల్ గారు, మురళి గారు, లెనిన్ గారు అడిగిన ప్రశ్నలకు రచయిత చక్కని సమాధానాలని చెప్పి ,’కన్నీటి నురుగు’ కథలోని రిక్షావాడు, సావిత్రి పాత్రల స్వభావాలని, కథముగింపు లోని కొస మెరుపుని చక్కగా వివరించారు. ఆపై అధ్యక్షులు ఆచార్యులు గారు “ నిత్య వ్యవహారంలో మనం ఉదహరించే సంస్కృత లోకోక్తులు” ఆలస్యం అమృతం విషం, ధనమూలమిదం జగత్, నభూతో న భవిష్యత్ వంటి వాక్యాల పూర్వాపరాలని అద్భుతంగా విశదీకరించి శ్రోతలని అలరింప జేసారు.
కొద్దిసేపు అల్పాహార విరామం తరువాత. కిరణ్ ప్రభగారు నిర్వహించిన ‘సాహీతీ క్విజ్ ‘ సభను రంజింప జేసింది.
తదుపరి గీతగారు చదివిన "పుట్ట గొడుగు మడి" కవిత -ప్రతీకాత్మ స్వరూపంగా,భావ గాంభీర్యంగా ఉండి శ్రోతల మన్ననలను పొందింది. ఇంకా ‘విద్వాన్’ విజయలక్ష్మిగారు ‘ఉగాది’ కవితలో త్రికాలాలని, త్రిగుణాలని, త్రిమూర్తి స్వరూపాన్ని, ప్రకృతి తత్వాలని విపులంగా వర్ణించి సభికులను ఆనందింప జేశారు. శ్రీ ఇక్బాల్ గారు అరబిక్, తెలుగు భాషల వ్యాకరణాన్ని సభకు క్లుప్తంగా పరిచయం చేసారు.
గీతగారి వందన సమర్పణతో నేటి సభ దిగ్విజయంగా ముగిసింది.
--------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/may/may_2015_vyAsakoumudi_vikshanam.pdf

No comments:

Post a Comment