Monday 28 December 2015

వీక్షణం సాహితీ సమావేశం-31(Mar,15-2015)



వీక్షణం సాహితీ సమావేశం-31

 

వీక్షణం 31 వ సాహితీ సమావేశం పాలో ఆల్టో లోని శ్రీమతి గునుపూడి అపర్ణ గారింట్లో జరిగింది.
వేమూరి వేంకటేశ్వరరావు గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశం లో ముందుగా రిటైర్డ్ జర్నలిస్టు శ్రీ పిల్లలమర్రి వేణుగోపాల స్వామి గారు జర్నలిజంలో తన అనుభవాల్ని, జ్ఞాపకాల్ని పంచుకున్నారు. సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగినందు వల్ల ఇంజనీరింగు చదువుని మధ్యలోనే ఆపేసి, స్వస్థలమైన తెనాలిలో స్థిరపడ్డారు గోపాలస్వామి గారు. మిత్రుని వల్ల జర్నలిజంతో పరిచయం ఏర్పడిందనీ, మొదట్నించీ ఆంగ్లభాష పట్ల మక్కువ వల్ల జర్నలిజంలో అతి వేగంగా రాణించ గలిగానన్నారు. దాదాపు 40 సం||రాలు జర్నలిస్టుగా కొనసాగారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కు అధ్యక్షులుగా 3 సార్లు ఎన్నికయ్యారు.
ఎమర్జన్సీ సమయంలో ఘాటుగా రాసిన ప్రభుత్వ వ్యతిరేక రిపోర్టు ఎన్నో మన్ననలు పొందిందని అన్నారు. ఆంధ్ర ఉద్యమ సమయంలో అంతటా బందు సమయంలో వార్తల సేకరణ ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. కొన్ని సార్లు అసలు వార్తలు మరుగున పడి, అసత్య వార్తలు ఎలా ప్రచారమవుతాయో వివరించారు. చుండూరు హత్య గురించి రిపోర్టు రాయలేని పరిస్థితుల్ని వివరించారు. జర్నలిజం మీద ఫ్యాక్షనిజం ప్రభావం గురించి చర్చించారు.
తర్వాత శ్రీమతి మద్దూరి లక్ష్మి 'కవన శర్మ" గారి సాహిత్య పరిచయం చేసారు. వారు రాసిన బ్రెయిన్ డ్రెయిన్, సంఘ పురాణం, సైన్స్ నడిచిన బాట వంటి రచనల్ని గురించి, బెంగుళూరులో తెలుగు విజ్ఞాన సమితి, మేలు కలయిక వంటి సంస్థల ద్వారా కవన శర్మ గారి సాహితీ సేవని వివరించారు.ఈ సందర్భంగా వేమూరి కవన శర్మ గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత గునుపూడి అపర్ణగారి తొలి కథా సంపుటి "ఘర్షణ" ఆవిష్కరణ ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి గారి చేతుల మీదుగా జరిగింది.
ఆ తర్వాత కథా పఠనంలో భాగంగా అపర్ణ గారు "జాతక చక్రం" కథను చదివి వినిపించారు.
పిల్లల పెంపకం విషయంలో ఎలా ప్లాన్ చేసినా చివరికి ఎలా జరగాలనుందో అదే జరుగుతుందనే విషయాన్ని చక్కగా వివరించిన కథ ఇది.
కథా ప్రారంభంలో ఫైనాన్షియల్ ప్లానింగుకి సంబంధించిన సంఘటనని వివరించడం రచయిత్రి కథా రచనా ప్రతిభ కు తార్కాణం.
తేనీటి విరామం తర్వాత ఇక్బాల్ గారి అరబిక్ వ్యాకరణ సిరీస్ లో భాగంగా అరబిక్ నామవాచకాలు, పదాల భేదాలు వివరించారు.
కవిసమ్మేళనంలో డా|| కె.గీత ఉగాది సందర్భంగా "ఉగాది జ్ఞాపకాలు" కవితను వినిపించారు.
శ్రీ వేణు ఆసూరి "శ్రీ శ్రీ కవిత్వంలో పదబంధాలు", "శివ దండకం లో పదబంధాలు" అనే విషయాలను చిన్న ఉపన్యాసంలో వివరించారు. శ్రీ శ్రీ కవిత్వంలో "నిలకడ గల క్రొక్కారు మెరుపు", "సదమన మదగజగమన" వంటివి, దండకంలో "జయత్పదభ్రవిభ్రమత్" వంటివి ఉదహరించారు.
ఆ తర్వాత రాయసం కృష్ణ కాంత్ చక్కని గాత్రంతో పాటలు ఫాడి అందరినీ అలరించారు.
సాహితీ క్విజ్ తో శ్రీ కిరణ ప్రభ సభను దిగ్విజయంగా ముగించారు.
----------------
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/april15/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2015/april/april_2015_vyAsakoumudi_vikshanam.pdf

No comments:

Post a Comment