Monday 28 December 2015

వీక్షణం సమావేశం- 29(Jan,18-2015)

కబుర్లు

వీక్షణం – సమీక్షణం


వీక్షణం 29వ సాహితీ సమావేశం


-‘విద్వాన్’ విజయాచార్య.

వీక్షణం 29వ సాహితీ సమావేశం శ్రీ వేణు ఆసూరి గారి ఇంట్లో ఈ నెల 18న రస రాగ రంజితంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ప్రఖ్యాత సినీ, నాటక, నవలా, కధారచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు విచ్చేశారు.

నేటి సమావేశానికి శ్రీ తాటిపాముల మృత్యుంజయడు గారు అధ్యక్షత వహించి సభని చక్కగా నడిపించేరు. ముందుగా శ్రోతలు అడిగిన సినిమా నాటక రంగాలకి సంబంధించిన ప్రశ్నలకి పార్థసారథిగారు యుక్తియుక్తంగా, సవివరంగా సమాధానాలు చెప్పి, సభని ఉత్కంఠభరితం గావించేరు. పూర్వ కాలం సినిమాలకి, ఇప్పటి సినిమాలకి గల తారతమ్యాలని, విలువలని, విపులంగా విశదీకరించేరు. రచయితకి నాటకరంగంలో ఉన్న తృప్తి, స్వేచ్ఛ సినిమారంగంలో ఉండదని తెల్పి, తమ అనుభవాలను,రచనా వ్యాసంగాన్ని, సభకి చక్కగా వివరించేరు.

తన మొదటి సినిమా “ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం” గురించి చెబుతూ “విజయవాడ లో హాస్య నాటికల పోటీ లో ప్రదర్శించిన “పూజకు వేళాయెరా” నాటిక ను రేలంగి నరసింహారావు గారు చూసి, నాటికలోని సన్నివేశాలను “ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్“ కు తీసుకున్నారన్నారు. అంతే గాక ఆయన తీసిన తరువాతి సినిమా “ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం” కు డైలాగ్ రైటర్ గా అవకాశం ఇచ్చారన్నారు.
సినిమా కు కథ వేరు, స్క్రీన్ ప్లే వేరని చెప్పారు. సినిమా కథ రాయడం లో ఉన్న కొన్ని ఇబ్బందుల్ని చెప్తూ, సినిమా కథలకు ముందుగా హీరో ఇమేజ్ ను గుర్తుపెట్టుకోవలసిందని,
కామెడీ ఎప్పటికప్పుడు కొత్తగా, వైవిధ్యభరితంగా ఉండాలని అన్నారు. ఇక స్క్రీన్ ప్లే అనేది ఒక్కొక్క స్క్రీన్ ను పేర్చుకుంటూ వెళ్లడమని అన్నారు.
సినిమా కథలకు ఫార్ములా లు ఉండవని, డైరక్టర్ స్టైలు లు బట్టి మలచబడతాయని అన్నారు. అందుకు ఉదాహరణగా ఇద్దరు ముగ్గురు దర్శకుల పద్ధతులు హాస్య స్ఫోరకంగా చెప్పి అందర్నీ కడుపుబ్బ నవ్వించారు.ముందుగా తన సినిమారంగానుభావాల్ని క్లుప్తంగా వివరించి తరువాత సభలోని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలనిచ్చారు శంకరమంచి.
“నాటకాలలో చెయ్యి తిరిగిన రచయిత అయిన మీ నాటకానుభవం సినిమా రచనలో ఉపయోగపడిందా?” అనే ప్రశ్నకు “నాటక రచనకు, సినిమాకు చాలా దగ్గర సంబంధం ఉందని, ఏ పాత్ర ఎంత వరకు ఉండాలి అనే తూకం, సీన్ నిడివి, పాత్రత, ఔచిత్యం వంటివి, డైలాగులలో పదును నాటక రచనలో తెలుస్తాయన్నారు. ముఖ్యంగా కామెడీ నాటక రచయితగా తనకు సినిమా పెద్దగా కష్టమనిపించలేదన్నారు.”
“రచనలు చేయడానికి ప్రభావితమయిన ప్రాచీన, అర్వాచీన సాహిత్యం గురించి” అన్న ప్రశ్నలకు, “ రచనా ప్రస్థానాన్ని వివరించమన్న” ప్రశ్నకు“తనకు ప్రాచీన సాహిత్యం చాలా తక్కువ తెలుసనీ, కానీ ఆధునికుల్లో రావిశాస్త్రి, తిలక్, శ్రీపాద మొ||న వారి ప్రభావం ఉందన్నారు. చిన్న తనం నించి తనకున్న సినిమా అభిరుచి బాగా దోహదపడిందన్నారు.
ముఖ్యంగా “ఆదుర్తి సుబ్బారావు” గారి తో కలిసి పనిచేయాలని ఆకాంక్ష ఉండేదన్నారు. కానీ ఫామిలీ పరిస్థితుల దృష్ట్యా సెంట్రల్ గవర్న్ మెంట్ ఉద్యోగి అయ్యినా ఆకాంక్ష సినిమా మీదే ఉండేదన్నారు. ఆదివిష్ణు గారి పరిచయం ఒక మలుపు. ముందు నా ఆలోచనలని కాగితమ్మీద పెట్టమని సలహా ఇచ్చారు. అలా కథా రచయితనయ్యాను. అక్కణ్ణించి నవలలు, ఆ తర్వాత నాటక రచయిత గా మారానన్నారు.
“పూజకు వేళాయెరా“ నాటికకు ప్రథమ బహుమతి లభించిన సందర్భంలో నాటక ప్రదర్శనలో పాఠకుడికి, రచయితకు ఉన్న ప్రత్యక్ష సంబంధం బాగా నచ్చడం వల్ల నాటక రచయిత గా స్థిర పడ్డానన్నారు. కామెడీ నాటకాల ప్రయోగాల్లో భాగంగా రెండు గంటల పాటు తెర వేయకుండా, లైట్లు ఆర్పకుండా ప్రదర్శించిన “దొంగల బండి” నాటకం ఒక రికార్డు అన్నారు.
“నాటక రచయితగా మొత్తం నా రచన అని కలిగే సంతృప్తి, సినిమా రచయితగా కలుగుతుందా?” అనే ప్రశ్నకు
“తెలుగు లో ఒకప్పుడు లేదని తొంభైలలో ప్రారంభమయిందని, ఒక రచయిత కంటే ఎక్కువ మంది రచయితలు ఇలా ఒక సినిమాకు పనిచేసే సంప్రదాయాన్ని క్రమంగా తర్వాతి వారు అనుసరించి, ఇక అదే పధ్ధతి ని కొనసాగించారన్నారు. అయితే ఇందు వల్ల ఎవరికీ వారు గంగాళంలో పాలు పొయ్యమంటే అంతా నీళ్లు పోసిన చందమయ్యింది ఇప్పటి సినిమాకథ అన్నారు.”
ఇలా దాదాపు గంట పైనే అన్ని ప్రశ్నలకూ ఎంతో ఓపిగ్గా సమాధానాలనిచ్చారు.
తదుపరి వేణు, విజయా ఆసూరి దంపతులు ఏర్పాటు చేసిన, షడ్ రుచులతో కూడిన విందుని అందరూ స్వీకరించిన పిదప కవిసమ్మేళనం జరిగింది. ముందుగా వేణుఆసూరిగారు “గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు” పంపిన “సృష్టి” కవిత చదివి, పిదప స్వీయరచన ప్రకృతి , ప్రియురాలు వర్ణనలతోకూడిన కవిత చదివి వినిపించేరు. పిదప డా|| కె. గీత ఇరవై వసంతాల కుమారుడి పుట్టిన రోజున అతడి బాల్యాన్ని గుర్తు చేసుకొంటూ మాతృ మూర్తి మనస్సులో కలిగే భావవీచికల్ని విశదీకరించే అద్భుతమైన “అబ్బాయి ఇరవయ్యవ పుట్టిన రోజు” కవిత చదివి శ్రోతలని అలరింపచేసారు. తదుపరి వరకూరు గంగా ప్రసాద్ గారు తమ కవిత ‘వందేమాతరం’ ను పాటగా పాడి వినిపించేరు. శ్రీచరణ్ గారు పద్యాలలో అయ్యప్పని, సంక్రాంతిని కొనియాడేరు. ఆ పై ‘విద్వాన్’ విజయలక్ష్మిగారు సంక్రాంతి లక్ష్మిని సవివరంగా వర్ణిస్తూ చదివిన కవిత శ్రోతల్ని అలరించింది. అలాగే శ్రీ టి.పి.యన్. ఆచార్యులు గారు చదివిన ‘ప్రకృతి’ కవిత సభారంజకంగా సాగింది.కవి సమ్మేళనం తర్వాత శ్రీ ఇక్బాల్ గారు చదివిన “స్వర్గీయ యన్.టి. రామారావు గారు రచించిన రావణుని ప్రాముఖ్యతను వివరించే వ్యాసం” శ్రోతల్ని అలరించింది.


అధ్యక్షులవారి ప్రకటనతో శ్రీ కిరణ్ ప్రభ గారు “సినిమాక్విజ్” కార్యక్రమాన్ని చాకచక్యంగా నిర్వహించేరు. మల్టిపుల్ ఛాయిస్ లు క్విజ్ లో కొత్తగా ప్రవేశపెట్టడం వల్ల సభికులందరూ ఈ సినిమా క్విజ్ కార్యక్రమంలో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. చివరగా గీత గారి వందన సమర్పణతో నేటి సమావేశం దిగ్విజయంగా ముగిసింది. ఈ సభలో కె.శారద, సత్యనారాయణ దంపతులు, వంశీ, శంషాద్, అహ్మద్
మొ||న స్థానిక ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు.
--------
http://www.koumudi.net/Monthly/2015/february/feb_2015_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb15/veekshanam.html

No comments:

Post a Comment