వీక్షణం సాహితీ గవాక్షం - 22
రచన :
నాగరాజు రామస్వామి
ఈ నెల బేఏరియా వీక్షణం
సాహితీ సమావేశం ప్రసిద్ధ సాహిత్య అంతర్జాల
పత్రిక
'కౌముది'
సంపాదకులు,
శ్రవణ మనోజ్ఞ మైన 'వీక్లీ
ఆడియో' కార్యక్రమ
నిర్వాహకులూ, 90
సాహిత్య సంచికలను,
ఈ-పుస్తకాలను
జయప్రదంగా అంతర్జాలం లో ఆవిష్కరించి
సాహితీప్రియులను అబ్బుర పరచిన సాహితీ బంధువులు
శ్రీ కిరణ్ ప్రభ గారి ఇంట్లో డబ్లిన్లో
జరిగింది. వారి సతీమణి "ప్రశాంత కిరణ కౌముది"
శ్రీమతి కాంతి గారు
అందించిన చల్లని ఆతిథ్యం తో
సమావేశం ప్రారంభమైంది. వరిష్ఠ సాహితీ మూర్తులు,
బహుగ్రంధకర్త, moving
encyclopedia
శ్రీ అక్కిరాజు రమాపతిరావు
గారు అధ్యక్షులు.
కిరణ్ ప్రభ గారి ఆత్మీయ
స్వాగతం పిదప ఆంధ్రలక్ష్మి గారు
'సంగమం'
కథ వినిపించారు.
స్త్రీ
మనోభావ సున్నితమైన ఇతివృత్తం. రఘు,రఘురాం
అత్యంత సన్నిహితులైన మిత్రులు. కాన్సర్ పేషంట్
రఘు అవసాన ఘడియల్లో తన భార్య మైథిలి శేషజీవిత
బాధ్యతను మిత్రునికి అప్పగిస్తాడు.
స్వార్థరహితమైన సాన్నిహిత్యాన్ని
అందిస్తుంటాడు మైథిలికి రఘు. ఎదిగిన మైథిలి
పిల్లలు రఘురాం మైథిలి
అన్నివిధాల ఒక్కటైపోతే
బాగుండునని తలపోస్తుంటారు. బంధంలేని కలయిక ఒక
నాటకం మాత్రమేనని వారి అభిప్రాయం. మైథిలి
ఇతమిద్దమని నిర్వచించరాని ఒక అసహాయ
సందిగ్ధతలో ఊగిసలాడుతుంటుంది. నడివయసు జీవన
ధర్మం,
కాలానుగుణ పరిణామ ధర్మం,
స్నేహ
ధర్మం త్రివేణీ సంగమంగా ధర్మ సంకటంగా ఈ కథ
కొనసాగుతుంది. ఆత్మీయ సంబంధాల భావ సంఘర్షణలతో
సంఘటనలతో సరళమైన భాషలో సాఫీగా సాగిన శైలి.
ద్వివేదుల
విశాలాక్షి గారి అలనాటి కథ
'గ్రహణం
విడిచింది'
ని తలపిస్తున్నదీ కథ అని
అధ్యక్షుల వారు అనడం విశేషం.
తరువాత డా||కె.గీత
"వాకిలి" పత్రికలో నెల నెలా
వెలువడుతున్నధారావాహిక కథలలో ఈ నెల కథ
'లివ్ ఎ లైఫ్'
ను వినిపించారు. కథలో
'లెవ్'
నడి వయసు
దాటిన ఒక యూదు సంతతికి చెందిన వ్యక్తి. తొలుత
నాజీల బారినుండి తప్పించుకొని రష్యా లో
తలదాచుకున్న కుటుంబం వాళ్ళది. యూదుల భూతల
స్వర్గమని భావించబడే ఇస్రాయిల్లో కొన్నాళ్లు
ఉండిపోయి లాటరీ పద్ధతి ద్వారా వీసా పొంది
స్వేచ్చాప్రపంచమనబడే
అమెరికాలో స్థిర పడిన
హుషారైన మనిషి. కథలో లెవ్ రంగప్రవేశం,
గౌరీ,
ప్రియలతో పరిచయం అంతా కాజ్వల్. సంఘటనల సమాహారం
తో కాకుండా సంభాషణల ఒరవడిలో నడచిన కథ ఇది.
'స్కెచ్'
లాంటి
కథా ప్రక్రియ. సంభాషణలతో కథను నడపడం నవీన
పధ్ధతి. కష్టమైనది. కాని రచయిత్రి ప్రతిభా
వంతంగా నిర్వహించారు. చిన్న కథ అయినా "కథ అంటే
సంఘటనల తోరణం మాత్రమే కాదని చెప్పే మంచి కథ".
"ఎక్కడ జీవించినా అదుగో అలా (లెవ్
లా )ఉత్సాహంగా జీవించాలి"
అన్న భావనకు కల్పించబడిన కథారూపం. కథా గమనం లో
మనకు అంది వచ్చిన అదనపు విషయ పరిజ్ఞానం రష్యా
,ఇస్రాయిల్,అమెరికా
దేశాలలోని అరుదుగా ద్యోతకమయ్యే వాస్తవాల
వెలుగు నీడలు. గీత గారు స్వయంగా కవయిత్రి
కావడం వల్ల కథా వచన రచనలో కవితాత్మకమైన
వాక్యాలు అలవోకగా దొర్లాయి. ప్రణాళికా బద్దంగా
కథా సంవిధానం కుదిరింది. ద్వాన్యాత్మకంగా కథా
నాయకుణ్ణి గుర్తుకు
తెచ్చే ఇతివృత్తోచిత శీర్షిక!
పసందైన అల్పాహార
స్వల్ప విరామం తరువాత కవిసమ్మేళన కార్యక్రమం.
మొదట రావు తల్లాప్రగడ గారు శ్రావ్యంగా
గొంతెత్తి పాడి వినిపించిన వారి గజల్ ఆనాటి
కవిసమ్మేళనపు శుభారంభం. "వొకరికి మించిన
వారొకరు,
వొకరి నుంచే వేరొకరు,
సగమును పిలిచిన సాంతము కాదా
,శాంతము
లేదా లింగమా"అంటూ
అర్ధనారీశ్వరతత్వాన్నిగజలుశైలిలోఆవిష్కరించడం
అందరినీ ఆకర్షించింది.తరువాత నాగరాజు
రామస్వామి
వినిపించిన వచన కవిత
'విశ్వాంతరాళ
స్వగతం'. ఒకింత
ఆధ్యాత్మిక ఛాయలున్న ఖగోళశాస్త్ర సంబంధి. పిదప
శంషాద్ మహ్మద్ గారు 'డాలర్
లైఫ్ 'అన్న తన స్వీయ
కవితను, వారి తండ్రి
గారైన దిలావర్ గారి 'నా
కవితాత్మ' అన్న చక్కని
కవితలను చదివి వినిపించారు.రూపుగొన్న ఉద్యమ
ఊపిరులు,
బాల్య జ్ఞాపకాల విరులు ఆ కవితల
సిరులు.
చివరగా
గీతగారు"పార్కులోపిల్లలు"కవితను వినిపించారు.
అందాలసీతాకోకచిలుకలు,
ఉత్సాహంగా గంతులేసే
ఉడతపిల్లలు,
చిరునవ్వుల వెన్నెల దీపాలు,ఉల్కాపాతాల
కళ్ళు,
పిల్లల కొత్త ప్రపంచాలు వారి
కవితలో చెంగలించాయి.
సుమారు మూడు
గంటలపాటు సాగిన సమావేశం మధ్యమధ్య పలు
సాహిత్యచర్చలు,
చాందోపనిషత్తు,
పురుషసూక్తంవంటిఆధ్యాత్మికవిచారాలు,
ఖగోళశాస్త్ర జిజ్ఞాసలు,
సినారె,
ఎల్లాప్రగడసుబ్బారావు,
భోగరాజు,
కవన శర్మ,
కాకర్ల సుబ్బారావు,
గరిమెళ్ళ సత్యనారాయణ లాంటి ఉద్దండుల
జ్ఞాపకాలముచ్చట్లు!
ఆఖరుగా కిరణ్ ప్రభ గారి
సాహిత్య క్విజ్ రసవత్తరంగా సాగి ఆ సారస
సాహిత్య సంధ్యకు చక్కని ముగింపు పలికింది. ఈ
సమావేశంలో శివ చరణ్ గుండా,
విజయ కర్రా,
వేమూరి,
ఉమా వేమూరి,
లెనిన్,
చుక్కా
శ్రీనివాస్ మొ.న వారు కూడా పాల్గొన్నారు.
-
రచన : నాగరాజు రామస్వామి
|
||
http://www.koumudi.net/Monthly/2014/july/july_2014_vyAsakoumudi_vikshanam.pdf http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july14/veekshanam.html |
No comments:
Post a Comment