వీక్షణం సాహితీ గవాక్షం - 20
వీక్షణం
20 వ సాహితీ సమావేశం ఫ్రీమౌంట్ లోని మహమ్మద్
ఇక్బాల్ గారింట్లో ఏప్రిల్ 13, రెండవ ఆదివారం
మధ్యాహ్నం 3 గం. నుండి సాయంత్రం 6 గం. వరకు
రసవత్తరంగా జరిగింది. ఈ సమావేశానికి శ్రీ
ఇక్బాల్ స్వాగతం పలికి అధ్యక్షత వహించారు.
ముందుగా ఈ సమావేశపు అతిధి ఉపన్యాసకులు శ్రీ
ఉపాధ్యాయుల సూర్య నారాయణ మూర్తి గార్ని శ్రీ
రాం వేమూరి సభకు పరిచయం చేశారు. తర్వాత
ఉపన్యాసాన్ని ప్రారంభించిన సూర్య నారాయణ మూర్తి
"కోనసీమ జాలరి పాటలు- ఒక పరిశీలన" గ్రంధ
సమీక్ష చేశారు. ఈ పరిశోధనా గ్రంధాన్ని వారి
తండ్రి గారు, డా|| ఉపాధ్యాయుల
సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు పరిశోధించి,
రచించడం విశేషం. తమ తండ్రి గారి జీవిత
విశేషాల్ని, గ్రంధ పరిశోధనా కృషిని తెలియజేస్తూ
" 1930 లో తూ.గో.జిల్లా లో ఉపాధ్యాయుల
సుబ్రహ్మణ్యేశ్వర శర్మ జన్మించారు. అమలాపురం
ఎస్.కె.బి ఆర్ కాలేజీ లో ప్రొఫెసర్ గా 25
స.రాలు సేవలందించారు. నిత్యం గోదావరి దాటి
కాలేజీకి వచ్చేటపుడు మత్స్యకారుల పాటలు ఆయనను
విశేషంగా ఆకట్టుకోవడంతో రాత్రింబగళ్లు కృషి
చేసి తెలుగు విశ్వవిద్యాలయంలో అదే అంశం పై
పీ.ఎహ్.డీ చేశారు. కోనసీమ లోని 18 మండలాళ్లో
175 పల్లెల్లోని జాలరుల పాటల్ని స్వయంగా
రికార్డు చేసి వారి సంస్కృతిని, మౌఖిక
సాహిత్యాన్ని భద్ర పరిచి, సుస్థిరత ను
చేకూర్చారు. 1993 లో 63 స.రాల వయస్సులో తెలుగు
విశ్వ విద్యాలయం నుంచి పీ.ఎచ్.డీ పట్టా పొందారు.
తెలుగు విశ్వ విద్యాలయం ఈ గ్రంధానికి "తూమాటి
దొణప్ప మెమోరియల్ స్వర్ణ పతకాన్ని " ప్రదానం
చేసింది." అన్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే
"జానపద సాహిత్యానికి వలపన్ని, ఒడ్డుకు ఈడ్చి,
పరిశోధన రూపేణా రూపం కల్పించారు. ఈ గ్రంధాన్ని
ప్రస్తుతం వారి మనుమలు డిజిటలైజ్ చేస్తున్నారు.
సూర్య నారాయణ మూర్తి కొన్ని జానపద పాటలను
స్వయంగా అత్యంత మాధుర్యంతో పాడి వినిపించారు.
అందులో "పాలా వన్నెపు చాయ- పలువరుస చక్కని,
పలుకవేమి తమ్ముడా- లక్ష్మణా చిన్ని ముద్దుల
తమ్ముడా" అనే "లక్ష్మణ మూర్ఛ" పదాలు సభలోని
వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
తర్వాత ఈ సమావేశంలో సుమతీ పద్యాల్ని, ఇంద్రగంటి రచించిన "తేనెల తెటల మాటలతో" గీతాన్ని అత్యంత శ్రావ్యంగా పదేళ్ల వరూధిని, ఇందు పాడి వినిపించారు. భాషా, సంగీత ప్రధాన "తెలుగు వికాసం" విద్యార్థులైన వీరు, తమ గురువు కె.గీత కు ధన్యవాదాలు సమర్పించారు. తేనీటి విందు తర్వాత జరిగిన కవి సమ్మేళనం లో ముందుగా షంషాద్ "లేక్ తాహో" కవితను, వేణు ఆసూరి " చిన్ని గురువు " అనే కవితను, కె.గీత "ద్రవభాష" నుంచి "ఇస్త్రీ వాడు" కవితను వినిపించారు. సమావేశానికి విచ్చేసిన మరొక ముఖ్య అతిధి "శ్రీ భీమ శంకరం" పద్య కవిత్వాన్ని వినిపించారు. సభకు ఈయనను పరిచయం చేస్తూ శ్రీ అక్కిరాజు రమాపతి రావు తన సహజ వాగ్ధాటితో సభలోని వారిని ఆకట్టుకున్నారు. ఈయన పద్య రామాయణం వంటివే గాక, అపరాధ పరిశోధక సాంఘిక పద్య కావ్యాన్ని రచించడం విశేషం. పద్య కవిత్వం లో చమక్కులను సొంతం చేసుకున్న లకార ప్రధానమైన పద్యాల్ని, ఉదాహరణ కావ్యం నుంచి రగడలను వినిపించారు. సందర్భోచితంగా ఉగాది పద్యాల్ని, శ్రీ రామ నవమి పద్యాల్ని వినిపించి అందరినీ అలరించారు. ఇక్బాల్ చిలకమర్తి వారి "గణపతి" ని గురించి స్పందనోపన్యాసం చేసారు. వస్తువు ఆ కాలానికి సంబంధించిన దైనప్పటికీ ఇందులో ఒక వర్గపు జీవన విధానాన్నే చూపడం, పేదల జీవితాల్ని, అంగ వైకల్యాన్ని హాస్య స్ఫోరకంగా మల్చడం తనకు రుచించలేదన్నారు. దీనిపై చర్చా కార్యక్రమంలో వేణు ఆసూరి తదితరులు మంచి ఆలోచనాత్మకమైన చర్చ ను చేసారు. చివరగా సంతోషకరంగా జరిగిన క్విజ్ కార్యక్రమాన్ని కిరణ్ ప్రభ తన సహజ ఛలోక్తులతో నిర్వహించారు. వచ్చే నెల సమావేశం మిల్పిటాస్ లోని షంషాద్ ఆతిధ్యంలో జరగనుందని తెల్పారు. సభలోని వారంతా ఆ నాటి సమావేశానికి ఆతిధ్యం వహించిన ఇక్బాల్ దంపతులకు హర్ష ధ్వానాలతో అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో తాటిపామల మృత్యుంజయుడు, శారద, కృష్ణ కుమార్, లెనిన్, కాంతి కిరణ్ తదితరులు కూడా పాల్గొన్నారు.
-డా|| కె.గీత
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may14/veekshanam.html
|
No comments:
Post a Comment