Monday 2 January 2017

వీక్షణం - సాహితీ గవాక్షం-51 (Nov13, 2016)


వీక్షణం 51వ సమావేశ 
సమీక్ష 
-సుభాష్ పెద్దు

వీక్షణం 51వ సమావేశం దుర్ముఖి, కార్తీక మాసం శుద్ధ చతుర్దశి నాడు, అనగా నవంబరు 13, 2016 నాడు శ్రీమతి ఉదయ లక్ష్మి& శ్రీ గాంధీ ప్రసాద్ గారి కుమార్తె గృహమునందు జరిగినది. శ్రీమతి ఉదయలక్ష్మి గారు స్వాగతం పలికిన తరువాత, శ్రీ వేమూరి రావు గారిని అధ్యక్షత వహించవలసినదిగా కోరారు. అధ్యక్షులు శ్రీవేమూరి రావు గారు  శ్రీ మొలకలమూరు శ్రీనివాస మూర్తి గారిని సభకు పరిచయం చేస్తూ, వారు కన్నడ కవిగా ప్రసిద్ధికెక్కినా, పాళీ వాఙ్మయం గురించి పలురచనలు చేసినారని తెలిపి, పాళీ  వాఙ్మయం గురించి ప్రసంగించవలసినదిగా ఆహ్వానించారు. 
శ్రీనివాసమూర్తి గారు పాళీభాష లోని అమరకోశములో నుండి బుద్ధ భగవానునికి కల పలు నామధేయములను,  కొన్ని ఘటములు (శ్లోకములు) ఉద్దండ దండకములాగా పఠించి, తమ ప్రసంగం ప్రారంభించారు. వారి ప్రసంగ విశేషములు: "బుద్ధ భగవానుడి వాడుక భాష మగధీ ప్రాకృతము. ఈ భాషను పాళీ అని కూడా అంటారు. బుద్ధ భగవానుడు 45 సంవత్సరములలో 84,000 ధమ్మఖండములు, అనగా ధర్మ అంశములను పాళీ భాషలోనే వివరించినాడు. ఈ బుద్ధవచనములు తేరవాదములో త్రిపీటికములనుబడు ముఖ్య గ్రంధములు. త్రిపీటకములు అనగా మూడు బుట్టలు. అవి శుద్ధ పీటిక, వినయ పీటిక, అభిధమ్మ పీటిక. ఈ  పాళీ వాఙ్మయం బుద్ధుని మహాపరినిర్వాణము కాలమునాటిది, అనగా క్రీ పూ 543 నాటిది. మొదటి మహా సంగాయనము బుద్ధుడు మహానిర్వాణము జరిగిన మూడు నెలలకు అరిహంత మహాపక్స అధ్యక్షతన జరిగినది. రెండవ, మూడవ మహాసంగాయనములు 100, 250 సంవత్సరముల తరువాత జరిగినవి. బుద్ధుని పాళీ ధమ్మఖండములను భద్ర పరుచుట ఒక ముఖ్య ఉద్దేశము. ఐదవ, ఆరవ మహా సంగాయనములు నేటి బర్మా దేశములో జరిగినవి. ఐదవ మహా సంగాయనములో ఈ పాళీ ధమ్మఖండములను పాలరాతి పలకల పైన చెక్కినారు. పాళీ ధమ్మఖండముల పఠనము, బౌద్ధ ధర్మముతోపాటు ప్రపంచ వ్యాప్తి చెంది, నేటికి కూడా బహు ప్రచారములో ఉన్నవి. 
ఈ పాళీ వాఙ్మయాన్ని పాశ్చాత్య పండితులు బహు ప్రాచుర్యం కలిగించారు. ధమ్మ ఖండములను పాళీ లిపిలోనూ, రోమన్ లిపిలోనూ ప్రక్క ప్రక్కనే పొందు పరిచి వివరణలతో ప్రచురించారు. వారిలో ముఖ్యులు మోనియర్ విలియంస్, ర్రీస్ డేవిడ్స్ దంపతులు,  ఐ బి హొనర్, వుడ్వార్ద్, భిక్ఖు బోధి, జేంస్స్ గ్రె, కె ఆర్ నార్మన్, ఓల్డెంబర్గ్ మొదలైన వారు. వారు పాళీ భాషా, వాఙ్మయానికి చేసిన సేవ బహు ప్రశంసనీయము. ధమ్మఖండములను భారతీయ భాషలు వేటిలోనూ అనువదింపబడలేదు, పండిత వర్గానికి మాత్రమే అందుబాటులో ఈ గ్రంధములు ఉండటము విచారకరము అని మోనియర్ విలియంస్ అభిప్రాయపము.  బుద్ధ భగవానుడి సందేశము అష్ట మార్గముల సాధన ద్వారా, ఎవరికివారు తమ జ్ఞాన జ్యోతిని తెలుసుకోవలెను. పరియత్తి (జ్ఞాన సముపార్జన, ప్రతిపత్తి (సాధన), పరివేధ (అనుభవము) అనే పాళీ పదములు ఈ మార్గము తెలుసుకోవడానికి దోహదము చేస్తాయి." 
ఆ తరువాత, శ్రీనివాసమూర్తి గారు ధమ్మపాదములోని 400వ శ్లోకము పఠించి, బ్రాహ్మణుడు అనగా క్రోధ, మద, మాత్సర్యములు లేనివాడని వివరించారు. మనము మన మంచి గుణముల ద్వారా గుర్తింపబడవలెను, కానీ మన్ను పుట్టుకతో, కుల గోత్రాలతో కాదని తెలిపి, సభకు ధన్యవాదములు తెలిపారు.
రెండవ ప్రసంగకర్త శ్రీ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. వారు పోతన భాగవతము ప్రారంభ పద్యము శ్రీ కైవల్య పదము వైశిష్ఠ్యతను, సూక్ష్మార్థమును వివరించారు. వారి ప్రసంగ విశేషములు - "ఒక వ్యక్తి, విశ్వమును కలిపేది విశ్వాసము. ధ్యాతను ధ్యేయమును కలిపేది ధ్యానం. భక్తుడు లేక భగవంతుడు లేడు, భగవంతుడు లేక భక్తుడూ లేడు. సత్ అనగా నిస్సందేహమైన, నిర్వివాదమైన సత్యం. చిత్ అనగా నిత్య చైతన్యశాలి, ఆనందము అనగా బ్రహ్మా  నందాన్ని ఇచ్చేది.  ఈ స్థూల సూక్ష్మజ్ఞానము, వేదాంతాల నేపధ్యములలోనుంచి ఉద్భవించినది. పోతన "శ్రీ కైవల్య పదం." పోతన పూర్వ కాలములో గ్రంథ ప్రారంభములో మొదటి పద్యము ఇష్ట దేవతా ప్రార్ధన గురించి ఉండేది. కానీ, పోతన ఏ దేవతల పేరూ ఈ పద్యములో చెప్పలేదు. మోక్షము అనగా విడిపోవడము. పోతన మోక్షం గురించి ప్రార్ధించలేదు. ఒక భక్తుడు భగవంతుడిలోని భాగం కావడము గురించి చెప్పాడు. సత్ చిత్ ఆనందము గురించి చెప్పాడు. ఈ విశిష్ట స్థానాన్ని పొందటం తన ధ్యేయమని పోతన తెలిపాడు.
తెలుగు భాష నిలబడాలంటే నేటి చిన్నారులకు తెలుగు సాహిత్యం మీద అభిమానం ఉండటం ఆవశక్యం. అమెరికాలో పోతన భాగవతం అంటే అభిమానంతో గజేంద్ర మోక్షములోని పలు పద్యాలని ధారణగా బడి పిల్లలైన కాసుల అంజలి, కాసుల అమృత పఠించి సభను ఆకట్టుకున్నారు.
ఆ తరువాతి కార్యక్రమము సభికులని ఉత్సాహ పరిచే కిరణ్ ప్రభ గారి క్విజ్ కార్యక్రమము. ఒక ఉదాహరణ ప్రశ్న "అష్ట కష్టాలు లో లేనిది ఏమిటి? క) యుద్ధములో గాయ పడటం చ) ఒంటరిగా నడవడం ట) దారిద్ర్యం త) అప్పు
తర్వాత  శ్రీ గంగాధర తిలక్ గారు తమ "శ్రమదాన్" గురించి వివరిస్తూ  చేసిన ప్రసంగం సభలోని వారిని ఆసక్తిదాయకుల్ని చేసింది. రోడ్లపై గుంతల్ని ప్రతి రోజూ స్వయంగా పూడుస్తూ తనదైన శైలిలో సమాజ సేవనందిస్తున్న తిలక్ గార్ని అంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. 
షంషాద్ గారు తన తెలుగు కవిత్వములో ఉర్దూ పదాల వివరణ గురించి వివరిస్తూ, ముస్లిం స్త్రీల సమస్యల గురించి వ్రాసిన కవితలలో సరియైన భావ ప్రకటనకు ఉర్దూ పదజాలం వాడడము తప్పనిసరి అని తెలిపి ఉదహరించారు. 
కవి సమ్మేళనం లో చదివిన కవితలు: 
1. గంగిశెట్టి గారు - "ఏదీ మా మండువా లోగిలి .."
2. శ్రీధర్ గారు - "నేను హాలాహలాన్ని"
3. సుభాష్ - 'నా శ్వాస నీ నిశ్వాస ..."
3. శ్రీనివాస మూర్తి గారు కన్నడ కవిత - "చైత్రం వచ్చేసింది"
4. కె.గీత గారు - "వీడ్కోలు విమానం"
5. వేణు గారు - "నా కౌగిలి కరగాలని", "ప్రతి దినం పరుగుల పందెం"
చివరగా సత్యనారాయణ గారు సూఫీ గీతాలను ఆలపించగా, గీత "శివ శివ శివ అనరాదా" అంటూ ఆలపించి సభలోని వారిని ముగ్ధుల్ని చేశారు.
సమావేశం ముగిస్తూ  శ్రీమతి ఉదయలక్ష్మి గారు విచ్చేసిన సభికులందరికీ ధన్యవాదములను తెలిపారు.
Vikshanam
http://www.koumudi.net/Monthly/2016/december/dec_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://sirimalle.com/SM-old-issues/2016/December/vikshanam.html
 http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/dec16/veekshanam.html


No comments:

Post a Comment