Monday 2 January 2017

వీక్షణం - సాహితీ గవాక్షం-44 (Apr10, 2016)

వీక్షణం - సాహితీ గవాక్షం-44
- శ్రీ చరణ్ పాలడుగు
వీక్షణం-44 వ సాహితీ సమావేశం ఏప్రిల్ నెల 10 వ తారీఖున కిరణ్ ప్రభ గారింట్లో జరిగింది. శ్రీ వేణు ఆసూరి అధ్యక్షత వహించిన ఈ సభలో ముందుగా శ్రీ సుభాష్ పెద్దు "అనసూయమ్మ కబుర్లు" అనే అంశం పై ప్రసంగించారు. శ్రీమతి వింజమూరి అనసూయాదేవి సంగీత ప్రతిభాపాటవాలను వివరిస్తూ కొనసాగిన ఈ ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. దేవులపల్లి వారి మేనగోడలైన అనసూయా దేవి భావ సంగీతానికి, లలిత సంగీతానికి స్వరాలు కూర్చిన మొదటి స్త్రీ అని అన్నారు. ప్రజలు చిన్నచూపు చూసే జానపద సంగీతానికి సేకరణ, స్వరపరచడం ద్వారా గొప్ప ప్రాముఖ్యతని కల్పించారు ఆమె. ఇవేళ జానపద గేయాలు పీ.ఎచ్.డీ చేసే స్థాయికి ఎదిగాయంటే అది ఆవిడ చలవేనన్నారు. అనసూయాదేవి శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆలిండియా రేడియో మద్రాసు వ్యస్థాపక గాయకుల్లో ఒకరు. వీరికి ప్రభుత్వం కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది. దేవులపల్లి వారి "జయ జయ ప్రియ భారత జనయిత్రీ" వంటి అనేక గీతాలకు స్వర కల్పన చేసారు. ఇప్పుడు 96 ఏళ్ళ వయసులో ఉన్న యువతి అని కొనియాడారు. అనసూయాదేవి గారి జీవిత విశేషాలను, ఇతరులకు తెలియనివెన్నో వివరాలను సేకరించానని, ప్రత్యేకించి తాను స్వయంగా రెండు సం. రాలపాటు ఆవిడ జీవితచరిత్రను చెప్తూండగా రాసి పుస్తకప్రచురణకు తోడ్పాటు చేసి ఆవిడ గీతాల పట్ల ఉన్న అభిమానానికి చిరు కానుకగా సమర్పించానని అన్నారు సుభాష్. ప్రసంగానికి ముక్తాయింపుగా వింజమూరి అనసూయాదేవి సేకరించిన జానపద గేయం "నోమి నోమన్నలాల"ను కె.గీత ఆలపించారు.
తర్వాత శ్రీ వేమూరి వేంకటేశ్వర్రావు కథా పఠనం లో భాగంగా "శిక్ష" కథను చదివి వినిపించారు. "సైన్స్ ఫిక్షనులో అందె వేసిన చేయి" వేమూరి అని సభాధ్యక్షులు వేణు ఆసూరి కొనియాడారు.
ఆ తర్వాత డా|| కె.గీత "తెలుగు రచయిత" వెబ్ సైటు తొలి రచయితల పేజీ "కందుకూరి వీరేశలింగం పంతులు" ను సభలో శ్రీ వేమూరి, కిరణ్ ప్రభ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసారు. నిర్వహణ బాధ్యతలను వివరిస్తూ అనేక ప్రయాసలకోర్చి రచయితలందరికీ ప్రత్యేక పేజీలను రూపొందిస్తున్నామని అన్నారు. ఇందుకు వేణు ఆసూరి, సుభాష్ లతో పాటూ తాను సంస్థాపించిన "గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఆథర్స్" విశేషంగా సహాయ సహకారాలను అందజేస్తూందని, రచయితలంతా తమ వంతు సహకారాన్ని అందజేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా శ్రీ అక్కిరాజు రమాపతి రావు తాను పీ.ఎచ్.డీ చేసిన కందుకూరి వారి గురించి ప్రసంగించారు. "ఆధునిక ఆంధ్రదేశం అఖండ గోదావరీ అయితే, నాసికాత్ర్యయంబకం కందుకూరి" అన్నారు. వెయ్యేళ్ల తెలుగు చరిత్రలో రెండే యుగాలున్నాయని, అవి నన్నయ యుగం, వీరేశలింగం యుగం అని కొనియాడారు. ఆయన తన 71 సం.వత్సరాల జీవితంలో 134 గ్రంథాలు రచించారని, కృష్ణశాస్త్రి అన్నట్లు "మరణించేవరకూ వీరేశలింగానికి మరణించే తీరిక లేదని " అన్నారు. తను స్వయంగా ప్రయాసలకోర్చి సాగించిన పరిశోధనల్ని గుర్తు చేసుకున్నారు.
వీరేశలింగం గారితో సమానంగా రచనల్ని చేసిన రమాపతిరావు గారిని "21 వ శతాబ్దపు వీరేశలింగం" గా గీత కొనియాడారు.
శ్రీ చరణ్ అప్పటి కప్పుడు ఆశువుగా అక్కిరాజు గారిపై పద్యం అల్లారు.
"శ్రీ కందుకూరి రసధి
ప్రాకట రాకేందు "రమాపతి"! మంజుశ్రీ
మాకీవే ఆంధ్ర కవన
లోకాంబుధి వారధి! వయ! రోచిస్సాంద్రా!"
తేనీటి విరామం తర్వాత జరిగిన సాహితీ క్విజ్ తో కిరణ్ ప్రభ సభలో అందరినీ ఉత్సాహితుల్ని చేసారు.
కవి సమ్మేళనంలో భాగంగా శ్రీచరణ్ "ఉగాది పద్యాలు", కె.గీత రాష్ట్ర విభజనని గురించిన "నేనెవ్వరిని?" కవితని, పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ "ఉగాది చంపక మాలలు" వినిపించారు.
చివరగా శ్రీ ఇక్బాల్ "ఐనా నేను ఓడిపోలేదు" శ్రీమతి జ్యోతిరెడ్డి స్ఫూర్తిదాయక ఆత్మకథను సభకు పరిచయం చేసారు.
ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సభలో శ్రీ & శ్రీమతి ఉదయ, శ్రీమతి శాంత, శ్రీమతి ఉమ, శ్రీ శివచరణ్ మొ.లైన వారు పాల్గొన్నారు.
http://www.koumudi.net/…/may_2016_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/…/suja…/may2016/veekshanam.html

No comments:

Post a Comment