Sunday 8 October 2017

వీక్షణం - సాహితీ గవాక్షం-60 (Aug13, 2017)

వీక్షణం - 60 సమీక్ష
- పాలడుగు శ్రీ చరణ్

Vikshanam

వీక్షణం 60 వ సమావేశం ఆగష్టు 13న శానోజోలోని శారద, మాధవి గార్ల ఇంట్లో జరిగింది. ఈ సమావేశానికి కాత్యాయనీ విద్మహే అధ్యక్షత వహిస్తూ ఆసక్తి కరమైన రచనలెన్నో చేసిన కథా రచయిత, అనువాదకులు దాసరి అమరేంద్ర విచ్చేసిన వీక్షణం సభలో అధ్యక్షత వహించడం తనకు చాలా సంతోషకరమన్నారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి అమరేంద్ర గారు "తెలుగులో యాత్రా సాహిత్యం" గురించి మాట్లాడుతూ ముందుగా టూరిస్టు వేరు, ట్రాలెలర్ వేరు, యాత్ర వేరు , ప్రయాణం వేరన్నారు.  ముందుగా దిశా నిర్దేశం చేసుకునేవారు టూరిస్టు లనీ, అవి యాత్రలనీ, ప్రయాణంతో బాటూ ముందుకు సాగేవారు ట్రాలెలర్ అనీ స్పష్టం చేసారు.
యాత్రా సాహిత్యాలకు మళయాళం, మరాఠీ భాషాలలో యాత్రా సాహిత్యాలకు గొప్ప ఆదరణ ఉందనీ, దేశవ్యాప్తంగా దాదాపు రెండు వందల కొత్త గ్రంథాలు వస్తున్నాయనీ అన్నారు.
మన తెలుగులో ఏనుగుల వీరాస్వామయ్య, గురజాడ, చలం, ఆచంట, అడవి బాపిరాజు, మాలతీ చందూర్, నవీన్, ఆదినారాయణ, కె.గీత వంటి అనేకమంది రచయితలు యాత్రా చరిత్రల్ని రాశారని అన్నారు.
విభిన్న రూపాల్లోని యాత్రానుభవాల్ని గురించి చెప్తూ పరిమళా సోమేశ్వర్, ఎండ్లూరి సుధాకర్, కాశీయాత్రా చరిత్రల్ని గురించి పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రదేశాల్ని గురించి తెలుగు వారు యాత్రాచరిత్రలు రాసారని, మనం సృశించని ప్రదేశం లేదని అన్నారు.
కొన్ని పుస్తకాల గురించి క్లుప్తంగా వివరిస్తూ, ముందుగా కాశీ యాత్రా చరిత్ర గురించి వివరించారు. మద్రాసులో బయలుదేరి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ల మీదుగా  కాశీ వెళ్లి, బీహార్ గుండా వెనుకకు 15 నెలల పాటూ మందీ, మార్బలంతో చేసిన ఈ యాత్ర తెలుగులో రచించబడిన మొట్టమొదటి యాత్రా చరిత్ర అని పేర్కొన్నారు. ఇది170 ఏళ్ళ క్రిందట ఒక సత్యశోధకుడు, జిజ్ఞాసువు చేసిన గొప్ప యాత్రగా పేర్కొన్నారు. ఈ యాత్రాచరిత్ర ద్వారా మనకు అప్పటి భారతదేశపు రూపురేఖలు తెలిసాయని అన్నారు.
తరువాత నాయని కృష్ణకుమారి విద్యార్థులతో చేసిన కాశ్మీర్ యాత్ర "కాశ్మీర దీపకళిక", ఎం. ఆదినారాయణ "భ్రమణ కాంక్ష", రాహుల్ రాసిన డార్జిలింగు యాత్ర, బదరీ పాదయాత్ర గురించి రాసిన సోమశేఖర్, పరవస్తు లోకేశ్వర్ ఛండీగఢ్ స్కూటర్ యాత్ర, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు  ఉత్తర దేశ యాత్ర గురించి రాసిన "మా యాత్ర", దాసరి అమరేంద్ర రాసిన అండమాన్ డైరీ, యూరప్ యాత్రా సమాహారం "మూడు నగరాలు",  స్కూటర్ పై చేసిన యాత్రల గురించి  వివరించారు.  6 ఖండాలలో 14 దేశాల యాత్రా సమాహారమైన ఎం. ఆదినారాయణ "భ్రమణ కాంక్ష" ను ప్రపంచ స్థాయి యాత్రా చరిత్రంగా కొనియాడారు.
ఆ తరువాత సంక్షిప్త చర్చలో భాగంగా సభలోని వారు వేమూరి రాసిన "అమెరికా అనుభవాల" గురించి  గుర్తు చేసేరు.
తరువాత శారద ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్ ఆసక్తికరంగా సాగింది.
ఆ తరువాత విశ్రామ ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ తన స్వీయ కవితా సంపుటి "మండువా లోగిలి" ని సభకు పరిచయం చేసేరు.
విరామానంతరం వేణు ఆసూరి, కల్లూరి రామ ప్రసాద్ గారి " సచిత్ర శ్రీ త్యాగరాజ కీర్తనామృతం" పుస్తక పరిచయాన్ని చేసారు.
ఆ తరువాత జరిగిన కవి సమ్మేళనం, పాటల కార్యక్రమంలో శ్రీ చరణ్, కె. గీత, వేణు ఆసూరి, లెనిన్, యువ కవి శశి మున్నగు వారు పాల్గొన్నారు.
ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ సమావేశంలో డా|| వెంకటేశ్వర్లు, రవికుమార్, ఐ. ఎం శర్మ దంపతులు, కాంతి పాతూరి, ఉమా వేమూరి మున్నగు వారు కూడా పాల్గొన్నారు.
divider

http://sirimalle.com/issues/2017/09/vikshanam.html

http://www.koumudi.net/Monthly/2017/september/sept_2017_vyAsakoumudi_vikshanam.pdf

No comments:

Post a Comment