Sunday 8 October 2017

వీక్షణం - సాహితీ గవాక్షం-57 (May14, 2017)

వీక్షణం - 57 సమీక్ష
(మాసం మాసం శ్రుత సాహిత్యం)
- విద్యార్థి

Vikshanam

వీక్షణం 57వ సమావేశము మే 14, 2017న శ్రీ పాలడగు శ్రీచరణ్, యామినీ గార్ల స్వగృహమునందు జరిగినది. ఈ సభకు శ్రీ వెంకట నాగ సాయి బాబా గారు అధ్యక్షత వహించి, "వీక్షణం, వీక్షణం, అమెరికాలో తెలుగు ప్రజల గర్వ కారణం, వీక్షణం ..." స్వరచన కవితా గానముతో, ఆ తరువాత బ్లాండు బేతాళ కథ అంటూ, సగం తెలుగులోనూ, సగం ఇంగ్లీషులోను హాస్య కథతో సభను ప్రారంభించారు.
మొదటి ప్రసంగము  శ్రీచరణ్  తండ్రిగారైన శ్రీ పాలడుగు జయ రామా నాయుడు గారిది. వారు కాళిదాసుని కుమార సంభవము లోని ఒక శ్లోకం గురించి చేసిన ప్రసంగ విశేషములు: "ఇది కుమార సంభవములోని మూడవ శ్లోకము. ముందు రెండు శ్లోకములలో హిమవంతుని ప్రాభవము వివరించి, మూడవ శ్లోకము ఇలా వివరించారు.
అనంతరత్నప్రభావస్య యస్య హిమం న సౌభాగ్యవిలోపి జాతమ్
ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతీన్దోః  కిరణేష్వివాంఙ్కః
అనంతమైన రత్నములకు ఓషధిలకు నిలయమైన  హిమవత్పర్వతానికి, అనగా హిమవంతుడు అనే పర్వత రాజునకు ఒక చిన్న దోషముంది. ఈ రత్నాలు, ఓషధులు మంచుతో కప్పబడి ఉన్నాయి. అయినా, చంద్రుని చూచి ఆనందించవలెను కానీ, చిన్న చిన్న మచ్చలను లెక్కపెట్టకూడదు కదా! అలాగే, హిమవంతుని వలె, మన యెదుటనుండే పెద్దవారు కానీ, మహానుభావులని కానీ వారిలోని గొప్ప గుణాలని చూచి ఆనందించవలెను. వారిలోని చిన్న చిన్న లోటుపాట్లను లెక్క చేయరాదు.
ఇదే విషయాన్ని కబీర్ దాసు ఈ విధముగా చెప్పారు.
बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोय,
जो दिल खोजा आपना, मुझसे बुरा न कोय।
అనగా, ఒక చెడును చూడడానికి నాకు చెడు ఎక్కడా కనబడలేదు. ఎవరి మనసును చూచినా, నాకు చెడు అనేది కనబడలేదు. మనము వెతుకుతున్నది మన గుణమును బట్టి కనబడుతున్నది.
అలాగే, ఒక ఇద్దరు కలసి ఒక తీర్థంకి వెళ్లారు. పది మణుగుల పాపం వెంటబెట్టుకొచ్చారట. మన గుణము ఎదుటివారిలో మంచిని గ్రహించేదైతే, పుణ్యము అదే వస్తుంది. మన గుణము సరిగా లేకపోతే, ఎంతటి తీర్థానికి వెళ్లినా పాపము పెరుగుతుంది.
కాబట్టి, మనము ఎదుటి వారిలోని మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి"
ఆ తరువాత పాలడుగు శ్రీ చరణ్ గారు కుమారసంభవములోని శివుని తపస్సు, పార్వతీ దేవి పూజ, మన్మథుడు శివునికి పార్వతిపై మోహము కల్పించే ఘట్టాలని క్లుప్తముగా వివరించారు.
ఆ తరువాతి కార్యక్రమం కిరణ్ ప్రభ గారి క్విజ్. క్లిష్ట ప్రశ్నలతో కూడి, సభకు ఇష్టమైన కార్యక్రమం. ఒక ఉదాహరణ ప్రశ్న 'పాత క్రొత్తల మేలు కలయిక క్రొమ్మెరంగులు జిమ్మగ", ఇది ఏ పుస్తకము లోనిది?
విరామానంతరము కవి సమ్మేళనములో చదివిన కవితలు:
  1. మేకా రామస్వామి గారు, "తొణికిన స్వప్నం"
  2. మేకా ఛాయా దేవి గారు, మాతృ దినోత్సవము సందర్భముగా, ఒక స్త్రీ వేదన కవిత
  3. డా|| కె  గీతా మాధవి గారు, "సెలయేటి దివిటీ .."
  4. గీత గారు చదివిన, ఆచార్య గంగిశెట్టి గారి కవిత, "సారస్వత యోగం"
  5. నాగ సాయి బాబా గారి "కాకిని నేను"
  6. శ్రీ చరణ్, "కలలోన ఇలలోన ..
శ్రీమతి ఇందిర, శ్రీమతి కాంతి కిరణ్, శ్రీమతి శారద, శ్రీమతి మాధవి, శ్రీమతి  లక్ష్మి, శ్రీమతి యామిని, శ్రీమతి ఉమా వేమూరి, శ్రీమతి రత్నకుమారి, శ్రీ కోటి రెడ్డి, శ్రీ ప్రసాద్, శ్రీ సత్యనారాయణ, శ్రీ శ్రీనివాస్, శ్రీ లెనిన్, శ్రీ  తాటిపామల మృత్యుంజయుడు మున్నగు స్థానిక ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు.

divider
http://sirimalle.com/issues/2017/06/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2017/june/june_2017_vyAsakoumudi_vikshanam.pdf

No comments:

Post a Comment