Thursday 11 July 2013

వీక్షణం సమావేశం - 10 (June,9-2013)

బే ఏరియా సాహితీ మిత్రుల నెలవారీ సమావేశం జూన్ నెల 9 వ తేదీన క్యుపర్టినో శారద. కె. గారి ఆతిథ్యంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డా. వేమూరి వెంకటేశ్వర రావు గారు ముందుమాటలో క్రమం తప్పకుండా గత పది నెలలుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బే-ఏరియా సందర్శిస్తున్న ప్రముఖలంతా హాజరవడం ఎంతో ఆనందదాయకం అన్నారు. డా. వేమూరి ఆనాటి ముఖ్య అతిథులు అల్లం రాజయ్య, చుక్కా రామయ్య (ఐ.ఐ.టి రామయ్య) గార్లను పరిచయం చేశారు.


అల్లం రాజయ్య గారు తన ప్రసంగంలో విదేశాల్లో ఉండి కూడా, స్వదేశీ సాహిత్యం గురించి ఆలోచిస్తున్న ప్రవాసాంధ్రులని అభినందించారు. తను ఇంతకుముందు మాట్లాడిన సమావేశాల కంటే ఈ సమావేశాలు భిన్నమైనవి అన్నారు. తాను, తన సోదరులు కూడా సాహిత్యాన్ని ఉద్యమాలకి అనుకూలంగా ఎలా మలచుకున్నారో వివరిస్తూ, మనుషుల్ని మనుషులుగా బ్రతకనివ్వని సమాజం వలనే తాము సాహిత్య ఉద్యమకారులమైనామని చెప్పారు. సమాజంలోని వైరుధ్యాలు పాఠాలు నేర్పుతాయనీ, వాటిని అందరితో పంచుకునే ప్రయత్నమే సాహితీ సృజన అని రాజయ్య గారు చెప్పారు. ప్రపంచ సాహిత్యంతో తనకు గల పరిచయాన్ని కూడా వివరించారు. అల్లం రాజయ్య గారి ప్రసంగం శ్రోతలని ఆలోచింపచేసేలా సాగింది. అక్కిరాజు సుందర రామకృష్ణ గారి కోరిక మేరకు వట్టికోట ఆళ్వారు స్వామి గురించి, ఆయన వ్రాసిన‘ ప్రజల మనిషి ’, ‘గంగు’ ల గురించి కూడా రాజయ్య గారు ప్రసంగించారు.
ఆ తరువాత చుక్కా రామయ్య గారు ‘ఆధునిక విద్యావిధానంలో తెలుగు భాషా విలువలు పడిపోతున్నాయా?’ అనే అంశం గురించి మాట్లాడారు. నైజాం ప్రభుత్వం కాలం నుంచి వస్తున్న విద్యా విధానాలని క్లుప్తంగా సమీక్షిస్తూ బోధనా మాధ్యమం యొక్క ప్రభావాన్ని చాలా విశదంగా తెలియజేశారు. ఆలోచన అనేది మాతృభాషలో స్పష్టంగా ఉంటుందనీ శాస్త్రీయంగా నిరూపించబడిందని, అందువల్ల మాతృభాషలో విద్య నేర్పడం వల్ల విద్యార్ధులలో సృజనాత్మకత పెంపొందుతుందనీ రామయ్య గారు చెప్పారు. ఆ తరువాత ఉద్యమ సాహిత్యం గురించి కూడా మాట్లాడుతూ రామయ్య గారు కాళోజీ ‘అణా గ్రంధమాల’ గురించి, గోర్కి అనువాదాల గురించి ప్రసంగించారు. సాహిత్యం పఠితల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో వివరించారు. తన ఐ.ఐ.టి. శిక్షణా తరగతుల నిర్వహణలో ఎదురౌతున్న అనుభవాలని కూడా శ్రోతలతో పంచుకున్నారు.


తదుపరి జరిగిన కవి సమ్మేళనంలో జి. వెంకట హరనాథ్ గారు, దాసు శ్రీరాములుగారు వ్రాసిన అరుదైన పుస్తకంలోని కొన్ని పద్యాలు చదివి వినిపించారు. ఇంకా నాగరాజు రామస్వామి, క్రాంతి శ్రీనివాస రావు, టి.పి.ఎన్. ఆచార్యులు, విజయలక్ష్మి, డా.గీత, బండి ఆనంద్ తదితరులు కూడా తమ స్వీయ కవితలని వినిపించారు. కిరణ్ ప్రభ నిర్వహించిన సాహితీ క్విజ్ కార్యక్రమంతో ఆ నాటి వీక్షణం సమావేశం ముగిసింది.
- కిరణ్ ప్రభ
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july13/veekshanam.html
http://www.koumudi.net/Monthly/2013/july/july_2013_vyAsakoumudi_vikshanam.pdf


No comments:

Post a Comment