Wednesday 27 February 2013

వీక్షణం సాహితీ సమావేశం- 5 (Jan12, 2013)


వీక్షణం ఐదవ సమావేశం జనవరి 12 తల్లాప్రగడ రామచంద్రరావు గారింట్లో రసవత్తరంగా జరిగింది. పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ అధ్యక్షత వహించిన సమావేశంలో సిలికాన్ వ్యాలీలోని సాహితీవేత్తలు మరియు సాహితీప్రియులు తమ కుటుంబసభ్యులతో పాల్గొన్నారు.

మధు ప్రఖ్య 'సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం' అనే అంశంపై కీలకోపన్యాసం చేసారు. కొత్త పంథాలో సాగిన ఉపన్యాసంలో మనిషి జీవితంలో సాహిత్యం యొక్క ప్రాముఖ్యతను విశదపరిచారు. సాహిత్యం ఒక ఇంజక్షన్ లాంటిదని, మనిషి గుర్తుంచుకునే మంచిమాటలన్నీ సాహిత్యానికి సంబధించినవేనని చెప్పారు. జీవితంలో జరిగిన ముఖ్య అనుభూతులు, సంఘటనల వెనుక సాహిత్యం తప్పక ఉంటుందని వివరిస్తూ బాల్యంలో తల్లి పాడే జోలపాట, పెళ్ళిలోని భాజాభజంత్రీలు మొదలైన వాటిని ఉదాహరణలుగా పేర్కొన్నారు. మనిషికి, పశువుకి స్పష్టంగా కనిపించే తేడా సాహిత్యం అన్నారు.

మనకు ఎంత ఇష్టమైన వంటకాన్ని పదేపదే తింటే మొహం మొత్తుతుందనీ, కానీ ఇష్టమైన సాహిత్యాన్ని ఎన్నిసార్లైనా చదవడమో, వినడమో, లేదా చూడటానికి ఇష్టపడతామన్నారు. దృశ్యం, శ్రవణం, ఇంకా అనేక హంగులు మిళితమీన సినిమా మనకు లభ్యమైన ఒక మహత్తర సాహిత్యమంటూ తనదైన శైలిలో మధ్యమధ్యలో చమక్కులు, చురుక్కులు విసురుతూ సభికులను రజింపజేసారు. సాహిత్యం ఒక వైరస్ లా తెలియకుండా సంఘంలోకి ప్రవేశించి మనల్ని ప్రభావితం చేస్తున్నదని చెప్పుకొస్తూ రామాయణ కావ్యాన్ని గుర్తుచేసారు.

సమావేశంలో వైవిధ్యంగా సభికులు ఒక్కొక్కరు తమను ప్రభావితం చేసిన పద్యాన్ని, మనిషిని, సంఘటనని, కథని, లేదా నవలని క్లుప్తంగా సమీక్షించారు.
ఎప్పటిలాగే కిరణ్ ఫ్రభగారు 'సాహితీ క్విజ్జు 'లో మెదడుకు పదును పెట్టే ప్రశ్నలను (తెలుగులో అచ్చు అయిన మొట్టమొదటి పుస్తకం - సమాధానం 'బైబిల్ ', Alex Haley రాసిన Roots కి తెలుగు అనువాదం - సమాధానం 'ఏడుతరాలు ' మొదలైనవి) అడిగారు.
ఈసారి సభలో పిల్లలు పాల్గొనడం ఒక విశేషం. ఏడేళ్ల బాలిక తుర్లపాటి అమృత 'గణనాయకాయ, గణదైవతాయా...' పాటను మధురంగా ఆలపించింది. అలాగే విజాపురపు సంధ్య కర్ణాటక సంగీతంలోని కొన్ని కీర్తలను ఆలాపించింది.

విన్నకోట వికాస్, శ్రీచరణ్, పుల్లెల శ్యాం సుందర్, తల్లాప్రగడ రావు,  తమ స్వీయకవితలను చదివి వినిపించారు.
సమావేశంలో చివరగా కిరణ్ ప్రభగారు తాను రోజు ఉదయం టోరీ రేడియో ప్రొగ్రాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం 'మా తెలుగుతల్లికి మల్లె పూదండ ' రచయిత 'శంకరంబాడి సుందరాచార్య ' పై జరిపిన ప్రసంగంలోని కొన్ని విశేషాలని పంచుకొన్నారు.
భోగి పండుగ సందర్భంగా రావుగారి సతీమణి జ్యోత్స్న గారు పులిహోర, గారెలు, పెరుగన్నం లాంటి రుచికరమైన పదార్థాలని అందించారు.

ఫిబ్రవరి నెల వీక్షణం సమావేశం తాటిపాముల మృత్యుంజయుడు ఇంట్లో జరుగుతుందని ప్రకటించారు.
.....................
-తాటిపాముల మృత్యుంజయుడు
 
http://www.koumudi.net/Monthly/2013/february/feb_2012_vyAsakoumudi_vikshanam.pdf
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/feb13/veekshanam.html

No comments:

Post a Comment