Tuesday 2 April 2013

వీక్షణం సాహితీ సమావేశం- 6 (Feb 9, 2013)



 




 


 


 
 
ఫిబ్రవరి పదవ తేదీన జరిగిన వీక్షణం ఆరవ సాహితీ సమావేశానికి, బే ఏరియాలోని మిల్పిటాస్ నగరంలో శ్రీ తాటిపాముల మృత్యుంజయుడు గారి ఇల్లు వేదిక అయ్యింది. సాయంత్రం మూడు నుండి ఆరు గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి శ్రీ బులుసు నారాయణ గారు అధ్యక్షత వహించగా, స్థానిక రచయితలు, కవులు పాల్గొన్నారు.

ప్రముఖ రచయిత శ్రీ అక్కిరాజు రమాపతిరావు గారు ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వచ్చారు. శ్రీ మృత్యుంజయుడుగారు వారిని సభకు పరిచయం చేసారు. అరవై సంవత్సరాల సాహితీగమనంలో జరిగిన ప్రముఖ సంఘటనలను, ప్రముఖులతో పరిచయలాని, ఇతర జ్ఞాపకాలను పంచుకొన్నారు. వారు తమ జీవితంలో రచనా వ్యాసంగం గురించి సవివరంగా ప్రసంగించారు. కలకత్తాలోని భారతీయ భాష పరిషత్, దేశంలోని వివిధ భాషలను సమన్వయ పరుస్తూ, భావ సమైక్యతను ఏకం చేస్తున్న సేవను, అలాగనే వారు దేశంలోని రచయితలను, కవులను సత్కరించటం వివరించారు. అటువంటి సంస్థ ద్వారా పురస్కారం అందుకున్న మొదటి తెలుగు రచయిత కావటం ఎంతో సంతృప్తిని కలిగించిందని తెలియచేసారు. 1961-62లో మొట్టమొదటిసారి, ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో తన మొదటి కథ, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ప్రోత్సాహంతో చదవడం ఎంతో మధుర అనుభూతి అని తెలియచేస్తూ, కృష్ణ శాస్త్రిగారికి తమకు ఉన్న అనుబంధం గురించి వివరించారు.

 
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారిపై డాక్టరేట్ చేయటం వలననే కృష్ణశాస్త్రి గారికి, అలాగనే ఎందరో పెద్దలకు, తెలుగు భాషాభిమానులకు ఆప్తుడయ్యానని అభిప్రాయపడ్డారు. పంతులుగారి పై పరిశోధనా సమయంలో వారి ప్రయాసాలను వివరిస్తూ, ఆప్పుడు సహాయం చేసిన వారిని జ్ఞప్తికి తెచ్చుకుని, శ్రీ వీరేశలింగంగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరిపిన వారి వద్ద నుండి ఆ ప్రతులను సేకరించిన విధానం తెలియచేసి, ఆ ప్రతులను శాశ్వతంగా భద్రపరిచే విధానం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

తమకు పూర్వ, సమకాలీన కవులు, రచయితలను గురించి చెబుతూ, బహు భాషాకోవిదులైన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వంటి వారికి అత్యున్నత సాహితీ పురస్కారమైన 'జ్ఞానపీఠ' లభించకపోవడం కడు శోచనీయమని తెలియచేసారు. ప్రసంగం తర్వాత, ప్రశ్నోత్తరాల సమయంలో వారి కథాంశాలకు, కలం పేరుకు ప్రేరణ, మరిన్ని విషయాలు ఎంతో మధురంగా వివరించారు.
 

 
ఈ ప్రసంగం అనంతరం విచ్చేసిన వారికి అందరికీ శ్రీమతి తాటిపాముల జయగారు, అల్పాహార విందు, తేనీరు ఏర్పాటు చేసారు.
విరామ సమయానంతరం, శ్రీ చిమట శ్రీనివాస్ గారు, ప్రశ్నోత్తరాల పోటీ నిర్వహించారు. ఈ సారి, తెలుగు సినిమాతో అనుబంధం ఉన్న కవులు, వారి రచనల పై జరిగిన క్విజ్ లో ఎందరో ఉత్సాహంగా పాల్గొని, పుస్తకాలను బహుమతులుగా పొందారు.
కార్యక్రమం ఉత్తర భాగంలో శ్రీమతి కె.గీతగారి మూడవ కవితా సంపుటి 'శతాబ్ది వెన్నెల' శ్రీమతి గునుపూడి అపర్ణగారు ఆవిష్కరించి ముఖ్య అతిధికి, సభాధ్యక్షులకి, ఇతరులకి అందించి, గీతగారు మరిన్ని రచనలు చేయాలని అభిలషించారు. అనంతరం, శ్రీ కిరణ్ ప్రభగారు పుస్తక పరిచయం చేస్తూ, శతాబ్ది వెన్నెల సంపుటిలోని కవితలు ఉటంకిస్తూ, వారి రచనా శైలి అద్భుతమని, ఆధునిక వచన కవితా రచయితలలో గీతగారికి ప్రత్యేక స్థానమున్నదని కొనియాడారు. నిర్జీవ వస్తువైనా 'అమ్మేసిన కారు', అలాగనే 'డంబార్టన్ బ్రిడ్జి' లతో మనము పంచుకునే మధురానుభూతులు కూడా ఒక కవితా వస్తువు చేసుకోవడం, అటువంటి వస్తువులను కూడా మనము మానవీయ దృక్కోణంలో చూడడం కూడా కేవలం గీతగారికే చెల్లిందన్నారు. వారి ఈ సంపుటి, కొత్త రచయితలకు ఒక రిఫరెన్స్ వంటిదని కొనియాడారు. శ్రీమతి గీతగారు తమ మూడవ కవితా సంపుటి ఆవిష్కరణపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కవిత్వం రాయడం తనకు ఊపిరి పీల్చుకునేంత సమానమని తెలియచేసారు. .
వీక్షణం సమావేశాలకి, బ్యానర్ ను బ్యానర్ రూపకర్త శ్రీమతి కాంతి కిరణ్ గారు ఆవిష్కరించారు.
అనంతరం స్వీయ కవితాపఠనం అంశంలో ఆనంద్ బండి గారు, 'ఈ దేశం నా దేశం' అనే కవితా గేయాన్ని పాడగా, శ్రీమతి కె.గీత గారు తమ ఎనభై ఏళ్ళ నాయనమ్మ పై వ్రాసిన 'కథ ముగిసింది' కవిత చదివారు, శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు తాను రచించిన 'శ్రీ సత్యదేవం భజే' అనే శతకం లోని నాలుగు శ్లోకాలను వినిపించారు.

తమకు నచ్చిన కవితలను చెబుతూ శ్రీ తాటిపాముల మృత్యుంజయుడుగారు, కందుకూరి రామభద్ర రావు గారి 'ఎంత చక్కని దోయి ఈ తోట' అనే కవిత, తెలుగు మహా సభల కోసం ప్రత్యేకంగా తెలుగు భాషపై వ్రాసిన గేయాన్ని చదివారు.

కార్యక్రమంలో చివరి అంశంగా శ్రీ కిరణ్ ప్రభ గారు రచయిత శారద గారి జీవిత విశేషాలని వివరించారు. 
   
 
 - ఆనంద్ బండి   

No comments:

Post a Comment